YouVersion Logo
Search Icon

మార్కు 10

10
1ఆయన అక్కడనుండి లేచి యూదయ ప్రాంతములకును యొర్దాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయనయొద్దకు కూడివచ్చిరి: ఆయన తనవాడుక చొప్పున వారికి మరల బోధించుచుండెను. 2పరిసయ్యులు ఆయనయొద్దకు వచ్చి, ఆయనను శోధించుటకై–పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అని ఆయన నడిగిరి. 3అందుకాయన–మోషే మీకేమి ఆజ్ఞాపించెనని వారి నడిగెను. 4వారు–పరిత్యాగ పత్రిక వ్రాయించి, ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చెనని చెప్పగా 5యేసు–మీ హృదయకాఠిన్యమునుబట్టి అతడీ ఆజ్ఞను మీకు వ్రాసి యిచ్చెను గాని 6సృష్ట్యాదినుండి (దేవుడు) వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగ జేసెను. 7ఈ హేతువుచేత పురుషుడు తన తలిదండ్రులను విడిచి పెట్టి తన భార్యను హత్తుకొనును; 8వారిద్దరు ఏకశరీరమై యుందురు, గనుక వారిక ఇద్దరుగా నుండక యేకశరీరముగా నుందురు. 9కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచ కూడదని వారితో చెప్పెను.
10ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతినిగూర్చి ఆయనను మరల నడిగిరి. 11అందుకాయన–తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును. 12మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరియొకని పెండ్లిజేసికొనినయెడల ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పెను.
13తమ చిన్నబిడ్డలను ముట్టవలెనని కొందరాయనయొద్దకు వారిని తీసికొని వచ్చిరి; అయితే శిష్యులు (వారిని తీసికొని వచ్చిన) వారిని గద్దించిరి. 14యేసు అది చూచి కోపపడి–చిన్నబిడ్డలను నాయొద్దకు రానియ్యుడి, వారి నాటంక పరచవద్దు; దేవునిరాజ్యము ఈలాటివారిదే. 15చిన్నబిడ్డవలె దేవునిరాజ్యము నంగీకరింపనివాడు అందులో నెంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పు చున్నానని చెప్పి 16ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను.
17ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తికొనివచ్చి ఆయనయెదుట మోకాళ్లూని–సద్బోధ కుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయన నడిగెను. 18యేసు–నన్ను సత్పురుషుడని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. 19నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధసాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తలిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియును గదా అని అతనితో చెప్పెను. 20అందుకతడు–బోధకుడా, బాల్యమునుండి ఇవన్నియు అనుసరించుచునే యుంటినని చెప్పెను. 21యేసు అతని చూచి అతని ప్రేమించి–నీకు ఒకటి కొదువగానున్నది; నీవు వెళ్లి నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. 22అతడు మిగుల ఆస్తిగలవాడు, గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని, దుఃఖపడుచు వెళ్లిపోయెను.
23అప్పుడు యేసు చుట్టు చూచి–ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. 24ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను– పిల్లలారా, తమ ఆస్తియందు నమ్మికయుంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము; 25ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె ఒంటె సూదిబెజ్జములో దూరుట సులభము. 26అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి– అట్లయితే ఎవడు రక్షణపొంద గలడని ఆయన నడిగిరి. 27యేసు వారిని చూచి–ఇది మనుష్యులకు అసాధ్యమే గాని, దేవునికి అసాధ్యము కాదు; దేవునికి సమస్తమును సాధ్యమే అనెను.
28పేతురు ఇదిగో–మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. 29అందుకు యేసు ఇట్లనెను–నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రనైనను తలి దండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు 30ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందు నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 31మొదటి వారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటి వారగుదురు అనెను.
32వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్లుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయ మొందిరి, వెంబడించువారు భయపడిరి. అప్పుడాయన మరల పండ్రెండుగురు శిష్యులను పిలుచుకొని, తనకు సంభవింపబోవువాటిని వారికి తెలియజెప్పనారంభించి 33– ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్య కుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనుల కప్పగించెదరు. 34వారు ఆయనను అపహసించి, ఆయనమీద ఉమ్మివేసి, కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు; మూడుదినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను.
35జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయనయొద్దకు వచ్చి–బోధకుడా, మేము అడుగునదెల్ల నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా 36ఆయన–నేను మీకేమి చేయగోరుచున్నారని వారి నడిగెను. 37వారు–నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ యెడమవైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయుమని చెప్పిరి. 38యేసు–మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు; నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయైనను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుట యైనను మీచేత అగునా? అని వారి నడుగగా వారు–మా చేత అగుననిరి. 39అప్పుడు యేసు–నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు; నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు, గాని 40నా కుడివైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నావశములో లేదు; అది ఎవరికి సిద్ధపరచబడెనో వారికే (దొరకునని) వారితో చెప్పెను. 41తక్కినపదిమంది శిష్యులు ఆ మాట విని, యాకోబు యోహానులమీద కోపపడసాగిరి. 42యేసు వారిని తనయొద్దకు పిలిచి వారితో ఇట్లనెను–అన్యజనులలో అధికారులని యెంచబడినవారు వారిమీద ప్రభుత్వము చేయుదురు; వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురని మీకు తెలియును. 43మీలో ఆలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై యుండగోరినయెడల వాడు మీకు పరిచారము చేయువాడై యుండవలెను. 44మీలో ఎవడైనను ప్రముఖుడై యుండగోరినయెడల, వాడు అందరికి దాసుడై యుండవలెను. 45మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను.
46వారు యెరికోపట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహుజనసమూహముతోను యెరికోనుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు బర్తిమయి యను గ్రుడ్డి భిక్షకుడు త్రోవప్రక్కను కూర్చుండెను. 47ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని– దావీదు కుమారుడా యేసూ, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. 48ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు–దావీదు కుమారుడా, నన్ను కరు ణింపుమని మరి ఎక్కువగా కేకలువేసెను. 49అప్పుడు యేసు నిలిచి–వానిని పిలువుడని చెప్పగా వారా గ్రుడ్డివానిని పిలిచి–ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. 50అంతట వాడు బట్టను పారవేసి, దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. 51యేసు–నేను నీకేమి చేయగోరుచున్నావని వానినడుగగా, ఆ గ్రుడ్డివాడు–బోధకుడా, నాకు దృష్టి కలుగ జేయుమని ఆయనతో అనెను. 52అందుకు యేసు–నీవు వెళ్లుము; నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయనవెంట చూపుపొంది వెళ్లెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy