దేవునికి, ప్రభువైన యేసు క్రీస్తుకు సేవకుడనైన యాకోబు, వివిధ దేశాలకు చెదిరిపోయిన పన్నెండు గోత్రాల వారికి వ్రాస్తున్నాను: మీకు శుభాలు. నా సహోదరీ సహోదరులారా, మీ విశ్వాసానికి ఎదురయ్యే పరీక్షలవల్ల ఓర్పు వస్తుందని మీకు తెలుసు కాబట్టి, మీకు ఎప్పుడైనా ఎలాంటి శోధనలు ఎదురైనా వాటిని బట్టి సంతోషించండి. మీరు పరిణతి చెంది సంపూర్ణులై ఏ విషయంలో కొదువలేనివారై ఉండేలా పట్టుదల తన పనిని చేయనివ్వండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొరతగా ఉంటే దేవున్ని అడగాలి, ఆయన తప్పులను ఎంచకుండా అందరికి ధారాళంగా ఇస్తారు. మీరు అడిగినప్పుడు సందేహించకుండా విశ్వాసంతో అడగండి ఎందుకంటే, సందేహించేవారు గాలికి రేగి ఎగసిపడే సముద్రపు అలల్లాంటివారు; కాబట్టి వారు ప్రభువు నుండి తమకు ఏమైనా దొరుకుతుందని ఆశించకూడదు. అలాంటివారు రెండు రకాల మనస్సులను కలిగి ఉంటారు, తాము చేసేవాటన్నిటిలో అస్థిరంగా ఉంటారు. దీనస్థితిలో ఉన్న విశ్వాసులు తమకు కలిగిన ఉన్నత స్థితిని బట్టి అతిశయించాలి. అయితే ధనవంతులైనవారు తమ దీనస్థితిని బట్టి అతిశయించాలి, ఎందుకంటే వారు గడ్డి పువ్వులా కనుమరుగవుతారు. కాల్చివేసే వేడిమితో సూర్యుడు ఉదయించినప్పుడు గడ్డి వాడిపోతుంది; దాని పువ్వు రాలిపోతుంది, దాని అందం నశించిపోతుంది; ధనవంతుల పట్ల కూడా అలాగే జరుగుతుంది; తమ తీరికలేని జీవితం మధ్యలో వారు వాడిపోతారు. శోధన సహించినవారు ధన్యులు. పరీక్షలో నిలబడినవారు ప్రభువు తాను ప్రేమించినవారికి ఇస్తానని వాగ్దానం చేసిన జీవకిరీటాన్ని పొందుతారు. దేవుడు కీడు చేత శోధించబడడు; ఆయన ఎవరిని శోధించడు కాబట్టి ఎవరికైనా శోధన ఎదురైతే, “నేను దేవుని చేత శోధించబడుతున్నాను” అని అనకూడదు. ఒకరు తమ సొంత కోరికతోనే ఆకర్షించబడి వాటి ద్వారా ప్రలోభాలకు గురై శోధించబడతారు. చెడు కోరిక గర్భాన్ని ధరించి పాపానికి జన్మనిస్తుంది, ఆ పాపం పండి మరణానికి జన్మనిస్తుంది. నా ప్రియ సహోదరీ సహోదరులారా, మోసపోకండి. పైనుండి వచ్చే ప్రతీ శ్రేష్ఠమైన సంపూర్ణమైన బహుమానం వెలుగును కలిగించిన తండ్రి దగ్గర నుండి క్రిందకు వస్తున్నాయి, ఆయన ఒకచోట నిలబడని నీడల్లా ఎన్నడు మారరు. ఆయన సృష్టంతటిలో మనం మొదటి ఫలాలుగా ఉండాలని, సత్యవాక్యం చేత మనకు జన్మనివ్వడానికి ఎంచుకున్నారు. నా ప్రియ సహోదరీ సహోదరులారా, మీరు దీనిని గ్రహించాలి: ప్రతి ఒక్కరు వినడానికి తొందరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, అలాగే తొందరపడి కోపపడవద్దు; ఎందుకంటే మీ కోపం దేవుని నీతిని జరిగించదు. కాబట్టి మీ జీవితాల్లోని సమస్త మలినాన్ని చెడును వదిలిపెట్టి, దేవుడు మీ హృదయాల్లో నాటిన వాక్యాన్ని వినయంతో అంగీకరించండి, ఎందుకంటే మీ ఆత్మలను రక్షించే శక్తి దానికే ఉంది. మీరు వాక్యాన్ని వినేవారిగా మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. వాక్యం చెప్పేది చేయండి. ఎవరైతే వాక్యాన్ని విని అది చెప్పిన ప్రకారం చేయరో, వారు తమ ముఖాన్ని అద్దంలో చూసుకునే వారిలా ఉంటారు; వారు తమను చూసుకొని ప్రక్కకు వెళ్లిన వెంటనే తాము ఎలా ఉన్నారో మరచిపోతారు. అయితే స్వాతంత్ర్యాన్ని ఇచ్చే సంపూర్ణమైన ధర్మశాస్త్రంలోనికి పరిశీలనగా చూసి దానిలో కొనసాగేవారు, విని మరచేవారిగా ఉండకుండా అది చెప్పిన ప్రకారం చేస్తారు; వారు తాము చేసిన దానిలో దీవించబడతారు. తాము భక్తిపరులమని భావిస్తూ తమ నాలుకను అదుపులో పెట్టుకోనివారు తమ హృదయాలను తామే మోసం చేసుకుంటారు. అలాంటివారి భక్తి విలువలేనిది.
చదువండి యాకోబు పత్రిక 1
వినండి యాకోబు పత్రిక 1
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యాకోబు పత్రిక 1:1-26
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్లైన్లో చదవండి, బోధన క్లిప్లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు