నిర్గమ 32

32
బంగారు దూడ
1మోషే పర్వతం దిగిరావడానికి ఆలస్యం చేయడం చూసిన ప్రజలు అహరోను చుట్టూ గుమికూడి, అతనితో, “ఈజిప్టులో నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చిన ఈ మోషే అనే వానికి ఏమి జరిగిందో మాకు తెలియదు కాబట్టి నీవు వచ్చి మాకు ముందు నడవడానికి మాకు దేవుళ్ళను తయారుచేయి” అని అన్నారు.
2అందుకు అహరోను, “అయితే మీ భార్యలు మీ కుమారులు మీ కుమార్తెలు ధరించిన బంగారు చెవికమ్మలు తీసి నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పాడు. 3కాబట్టి ప్రజలందరు తమ చెవికమ్మలు తీసి అహరోను దగ్గరకు తెచ్చారు. 4అతడు వారు తనకు ఇచ్చిన వాటిని తీసుకుని ఒక సాధనంతో దూడ రూపంలో పోతపోసి ఒక విగ్రహం తయారుచేశాడు. అప్పుడు వారు, “ఓ ఇశ్రాయేలూ, ఈజిప్టులో నుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుళ్ళు#32:4 లేదా ఇదే మీ దేవుడు వీరే” అని అన్నారు.
5అహరోను ఇది చూసి ఆ దూడ ఎదుట ఒక బలిపీఠం కట్టించి, “రేపు యెహోవాకు పండుగ జరుగుతుంది” అని ప్రకటించాడు. 6కాబట్టి మరునాడు ప్రజలు ఉదయాన్నే లేచి దహనబలులు సమాధానబలులు అర్పించారు. ఆ తర్వాత ప్రజలు తినడానికి త్రాగడానికి కూర్చుని ఆడడానికి లేచారు.
7అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నీవు క్రిందికి వెళ్లు, ఈజిప్టులో నుండి నీవు తీసుకువచ్చిన నీ ప్రజలు చెడిపోయారు. 8నేను వారికి ఆజ్ఞాపించిన మార్గం నుండి చాలా త్వరగా తప్పిపోయి ఒక దూడ రూపంలో పోతపోసిన విగ్రహాన్ని తమ కోసం తయారుచేసుకుని దానికి సాష్టాంగపడి బలి అర్పించి, ‘ఇశ్రాయేలూ, ఈజిప్టులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుళ్ళు వీరే’ అని అన్నారు.
9“నేను ఈ ప్రజలను చూశాను” అని అంటూ యెహోవా మోషేతో ఇలా అన్నారు, “వారు మొండి ప్రజలు, 10నా కోపం వారి మీద రగులుకొని, నేను వారిని నాశనం చేస్తాను, నీవు నన్ను వదిలేయి. తర్వాత నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను.”
11అయితే మోషే తన దేవుడైన యెహోవా దయ కోసం మొరపెడుతూ, “యెహోవా, మీరు గొప్ప బలముతో బలమైన చేతితో ఈజిప్టులో నుండి రప్పించిన మీ ప్రజల మీద ఎందుకంత కోపం? 12‘వారిని పర్వతాల మధ్య చంపాలని భూమి మీద ఉండకుండా వారిని నాశనం అయ్యేలా కీడు చేయడానికే ఆయన వారిని బయటకు రప్పించారని ఈజిప్టువారు ఎందుకు చెప్పుకోవాలి?’ రగులుతున్న నీ కోపాన్ని విడిచిపెట్టండి; మనస్సు మార్చుకోండి, మీ ప్రజలపై విపత్తును తీసుకురావద్దు. 13మీ సేవకులైన అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకోండి, వారికి మీరే స్వయంగా ఇలా ప్రమాణం చేశారు: ‘నేను మీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల్లా అసంఖ్యాకంగా చేసి వారికి ఇస్తానని నేను వాగ్దానం చేసిన ఈ దేశాన్నంతా మీ సంతానానికి ఇస్తాను, అది వారి వారసత్వంగా నిరంతరం ఉంటుంది.’ ” 14అప్పుడు యెహోవా మనస్సు మార్చుకొని తన ప్రజలకు తాను తెస్తానని చెప్పిన విపత్తును వారి మీదికి తేలేదు.
15మోషే తన చేతులతో రెండు నిబంధన పలకలు పట్టుకుని పర్వతం దిగి వెళ్లాడు. ఆ పలకలకు రెండు వైపులా ముందు వెనుక వ్రాసి ఉంది. 16ఆ పలకలు దేవుని పని; ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేతివ్రాత.
17ప్రజలు కేకలు వేస్తున్న శబ్దం యెహోషువ విని మోషేతో, “శిబిరంలో యుద్ధధ్వని వినబడుతుంది” అన్నాడు.
18మోషే ఇలా జవాబిచ్చాడు:
“అది విజయధ్వని కాదు,
అపజయధ్వని కాదు;
నేను వింటుంది పాడుతున్న ధ్వని.”
19మోషే శిబిరాన్ని సమీపించి ఆ దూడ విగ్రహాన్ని, వారు నాట్యం చేయడాన్ని చూసినప్పుడు అతనికి చాలా కోపం వచ్చి, అతడు తన చేతుల్లో ఉన్న రెండు పలకలను విసిరి, పర్వత అడుగు భాగాన వాటిని ముక్కలు చేశాడు. 20అతడు ఆ ప్రజలు చేసిన దూడ విగ్రహాన్ని తీసుకుని అగ్నిలో కాల్చివేశాడు; తర్వాత అతడు దానిని పొడిచేసి, నీళ్ల మీద చల్లి, ఆ నీళ్లను ఇశ్రాయేలీయులతో త్రాగించాడు.
21అప్పుడు మోషే అహరోనును, “నీవు వారిని ఇలాంటి ఘోరమైన పాపం చేసేలా నడిపించడానికి ఈ ప్రజలు నిన్ను ఎలా ప్రేరేపించారు?” అని అడిగాడు.
22అందుకు అహరోను, “నా ప్రభువా, కోప్పడకు, ఈ ప్రజలు చెడుకు ఎంతగా అలవాటుపడ్డారో నీకు తెలుసు. 23వీరు నన్ను, ‘ఈజిప్టులో నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చిన ఈ మోషే అనే వానికి ఏమి జరిగిందో మాకు తెలియదు కాబట్టి నీవు వచ్చి మాకు ముందు నడవడానికి మాకు దేవుళ్ళను తయారుచేయి’ అని అన్నారు. 24అందుకు నేను, ‘ఎవరి దగ్గర బంగారు ఆభరణాలు ఉంటే వారు తీసుకురండి’ అని చెప్పాను. అప్పుడు వారు నాకు బంగారం ఇచ్చారు, నేను దాన్ని అగ్నిలో పడేస్తే, ఈ దూడ అయ్యింది!” అని చెప్పాడు.
25ప్రజలు విచ్చలవిడిగా తిరగడం మోషే చూశాడు. వారి శత్రువుల ముందు నవ్వులపాలయ్యేలా అహరోను వారిని వదిలేశాడు. 26కాబట్టి మోషే శిబిరం ద్వారం దగ్గర నిలబడి, “యెహోవా పక్షం ఉన్నవారందరు నా దగ్గరకు రండి” అని అన్నాడు. అప్పుడు లేవీయులందరు అతని దగ్గరకు వచ్చారు.
27అతడు వారితో ఇలా చెప్పాడు, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: ‘ప్రతి ఒక్కరు తన కత్తిని తన నడుముకు కట్టుకుని, శిబిరం ఒక ద్వారం నుండి ఇంకొక ద్వారం వరకు వెళ్తూ ప్రతివారు తన సోదరులను స్నేహితులను పొరుగువారిని చంపాలి.’ ” 28లేవీయులు మోషే ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు; ఆ రోజు సుమారు మూడువేలమంది చనిపోయారు. 29అప్పుడు మోషే, “ఈ రోజు, మీరు మీ సొంత కుమారులకు సోదరులకు వ్యతిరేకంగా మిమ్మల్ని మీరు యెహోవా కోసం ప్రత్యేకించుకున్నారు, కాబట్టి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించారు” అని అన్నాడు.
30ఆ మరునాడు మోషే ప్రజలతో, “మీరు ఘోరమైన పాపం చేశారు. కాని నేను యెహోవా దగ్గరకు ఎక్కి వెళ్తాను; బహుశ మీ పాపాల కోసం నేనేమైనా ప్రాయశ్చిత్తం చేయగలనేమో” అని అన్నాడు.
31అప్పుడు మోషే యెహోవా దగ్గరకు తిరిగివెళ్లి, “అయ్యో, ఈ ప్రజలు ఎంతో ఘోరమైన పాపం చేశారు! తమ కోసం బంగారంతో దేవుళ్ళను తయారుచేసుకున్నారు. 32కాని ఇప్పుడు, దయచేసి వారి పాపాలను క్షమించండి, వారిని మీరు క్షమించకపోతే మీరు వ్రాసిన గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయండి” అని అడిగాడు.
33అందుకు యెహోవా మోషేకు, “నాకు వ్యతిరేకంగా ఎవరు పాపం చేశారో వారి పేరును నా గ్రంథంలో నుండి కొట్టివేస్తాను. 34నీవు వెళ్లి, నేను నీకు చెప్పిన చోటికి ప్రజలను నడిపించు, నా దూత మీకు ముందుగా వెళ్తాడు. అయితే నేను శిక్ష విధించవలసిన సమయం వచ్చినప్పుడు వారి పాపాలకు వారికి శిక్ష విధిస్తాను” అని సమాధానం ఇచ్చారు.
35అహరోను చేసిన దూడ విగ్రహంతో వారు చేసిన దానిని బట్టి యెహోవా ప్రజలను తెగులుతో మొత్తారు.

Terpilih Sekarang Ini:

నిర్గమ 32: TSA

Highlight

Salin

Bandingkan

Kongsi

None

Ingin menyimpan sorotan merentas semua peranti anda? Mendaftar atau log masuk