హగ్గయి 1

1
యెహోవా మందిరాన్ని కట్టడానికి పిలుపు
1రాజైన దర్యావేషు పరిపాలనలో రెండవ సంవత్సరం ఆరవ నెల మొదటి దినాన ప్రవక్త అయిన హగ్గయి ద్వారా యూదా దేశం మీద అధికారి, షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలుకు, ప్రధానయాజకుడు, యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు.
2“మేము కలిసి రావడానికి గానీ యెహోవా మందిరాన్ని కట్టడానికి గానీ ఇది సమయం కాదు అని ఈ ప్రజలు చెబుతున్నారు కదా.”
3అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై హగ్గయి ప్రవక్త ద్వారా చెప్పినదేమిటంటే,
4“ఈ మందిరం పాడై ఉండగా మీరు కలపతో కప్పిన ఇళ్ళలో నివసించడానికి ఇది సమయమా?
5కాబట్టి సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి.
6మీరు ఎక్కువ విత్తనాలు చల్లినా పండింది కొంచెమే.
మీరు భోజనం చేస్తున్నప్పటికీ ఆకలి తీరడం లేదు.
మీరు ద్రాక్షరసం తాగుతున్నప్పటికీ మత్తు రావడం లేదు.
బట్టలు కప్పుకుంటున్నా చలి ఆగడం లేదు.
పనివారు కష్టపడి జీతం సంపాదించుకున్నా జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది.
7కాగా సేనల ప్రభువైన యెహోవా ఇలా చెబుతున్నాడు. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి.
8పర్వతాలెక్కి కలప తీసుకు వచ్చి మీరు ఈ మందిరాన్ని కట్టించండి. అప్పుడు నేను ఆనందిస్తాను. నాకు ఘనత వస్తుంది” అని యెహోవా అంటున్నాడు.
9“విస్తారంగా కావాలని మీరు ఎదురు చూశారు గానీ నేను దాన్ని చెదరగొట్టినందువల్ల మీరు కొంచెమే ఇంటికి తెచ్చుకోగలిగారు.
ఎందుకని? యెహోవా అడుగుతున్నాడు.
ఎందుకంటే నా మందిరం పాడై ఉన్నా మీరంతా మీ చక్కని సొంత ఇళ్ళు కట్టుకుంటూ ఆనందిస్తున్నారు.
10అందుకే మిమ్మల్ని బట్టి ఆకాశపు మంచు కురవడం లేదు.
భూమి పండడం లేదు.
11నేను భూమికీ పర్వతాలకూ అనావృష్టి కలగజేసి,
ధాన్యం విషయంలో, ద్రాక్షారసం విషయంలో, తైలం విషయంలో,
భూమి ఫలించే అన్నిటి విషయంలో,
మనుషుల విషయంలో, పశువుల విషయంలో, చేతి పనులన్నిటి విషయంలో కరువు రప్పించాను.”
12షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు, యెహోజాదాకు కొడుకు, ప్రధానయాజకుడు యెహోషువ, శేషించిన ఇశ్రాయేలీ ప్రజలంతా తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్త హగ్గయిని పంపించి, తెలియజేసిన మాట విని యెహోవా పట్ల భయభక్తులు చూపారు.
13అప్పుడు యెహోవా ప్రవక్త హగ్గయి యెహోవా చెప్పగా ప్రజలతో ఇలా చెప్పాడు.
“నేను మీకు తోడుగా ఉన్నాను.” ఇదే యెహోవా వాక్కు.
14యెహోవా యూదాదేశపు అధికారి అయిన షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు మనస్సును,
ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడు యెహోషువ మనస్సును,
శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపించాడు.
15వారు కూడి వచ్చి, దర్యావేషు రాజు పరిపాలనలో రెండవ సంవత్సరం ఆరవ నెల ఇరవై నాలుగవ రోజున సేనల ప్రభువైన తమ దేవుని మందిరపు పనిచేయడం మొదలుపెట్టారు.

Subratllat

Copia

Compara

Comparteix

None

Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió