యెషయా 41:1-10
యెషయా 41:1-10 TSA
ద్వీపాల్లారా, నా ఎదుట మౌనంగా ఉండండి! దేశాలు తమ బలాన్ని నూతన పరచుకోవాలి! వారు ముందుకు వచ్చి మాట్లాడాలి; తీర్పు తీర్చే స్థలం దగ్గర మనం కలుసుకుందాము. “తన సేవ కోసం తూర్పు నుండి ఒకరిని పురికొల్పి నీతిలో పిలిచింది ఎవరు? ఆయన అతనికి దేశాలు అప్పగిస్తారు రాజులను అతని ఎదుట అణచివేస్తారు. అతడు తన ఖడ్గంతో వాటిని ధూళిగా చేస్తాడు, తన విల్లుతో గాలికి ఎగిరే పొట్టులా మారుస్తాడు. అతడు వారిని వెంటాడుతాడు, ఇంతకుముందు తాను వెళ్లని దారైనా క్షేమంగా వెళ్తాడు. ఎవరు దీనిని ఆలోచించి జరిగించారు? మొదటి నుండి తరాలను పిలిచింది ఎవరు? యెహోవానైన నేనే; వారిలో మొదటి వారితో ఉంది నేనే, చివరి వరకు వారితో ఉండేది నేనే.” ద్వీపాలు దానిని చూసి భయపడుతున్నాయి; భూమి అంచులు వణుకుతున్నాయి. వారు వచ్చి చేరుతున్నారు; వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, “ధైర్యంగా ఉండండి!” అని ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. శిల్పి కంసాలివాన్ని ప్రోత్సహిస్తాడు, సుత్తితో నునుపు చేసేవాడు, “అది బాగుంది” అని అతుకు గురించి చెప్తూ దాగిలి మీద కొట్టే వానిని ప్రోత్సహిస్తాడు. ఇంకొకడు విగ్రహం కదలకుండా మేకులతో దానిని బిగిస్తాడు. “అయితే, నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేను ఏర్పరచుకున్న యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము వారసులారా, భూమి అంచుల నుండి నేను మిమ్మల్ని తీసుకువచ్చాను, మారుమూల ప్రాంతాల నుండి పిలుచుకున్నాను. నేను అన్నాను, ‘నీవు నా సేవకుడవు’; నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను త్రోసివేయలేదు. కాబట్టి భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను; దిగులుపడకు, నేను నీ దేవుడను. నేను నిన్ను బలపరచి నీకు సహాయం చేస్తాను; నీతిగల నా కుడిచేతితో నిన్ను ఆదరిస్తాను.

