యెహోషువ 2:8-21

యెహోషువ 2:8-21 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఆ వేగులవారు రాత్రి పడుకునే ముందు రాహాబు వారున్న మిద్దె మీదికి వెళ్లి, వారితో, “యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చాడని నాకు తెలుసు. మీరంటే మాకు చాలా భయం, ఈ దేశంలో నివసించే వారందరూ మీరంటే భయంతో క్రుంగిపోతున్నారు. మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు యెహోవా మీ కోసం ఎర్ర సముద్రపు నీటిని ఎలా ఆరిపోయేలా చేశారో, మీరు పూర్తిగా నాశనం చేసిన యొర్దానుకు తూర్పున ఉన్న ఇద్దరు అమోరీయుల రాజులైన సీహోను, ఓగుల గురించి విన్నాము. ఈ విషయాలు విన్నప్పుడు, మా గుండెలు భయంతో క్రుంగి, మిమ్మల్ని బట్టి ఎవరికి ఏమాత్రం ధైర్యం లేదు, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా పైన ఆకాశంలోను క్రింద భూమి మీద కూడా దేవుడే. “ఇప్పుడు, దయచేసి మీరు నా కుటుంబం మీద దయ చూపిస్తారని యెహోవా మీద ప్రమాణం చేయండి. ఎందుకంటే నేను మీ పట్ల దయ చూపించాను కాబట్టి మీరు నా తల్లిదండ్రుల, నా అన్నదమ్ముల, అక్కచెల్లెళ్ల, అలాగే వారికి సంబంధించిన వారినందరిని ప్రాణాలతో కాపాడతారని నాకొక నిజమైన సూచన ఇవ్వండి” అని అడిగింది. అందుకు వారు, “మేము ఏమి చేస్తున్నామో, నీవు చెప్పకుండా ఉంటే మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డుపెడతాం! యెహోవా ఈ దేశాన్ని మాకు ఇచ్చినప్పుడు మేము మీ పట్ల దయతో నమ్మకంగా ఉంటాము” అని చెప్పారు. రాహాబు ఇల్లు పట్టణ గోడమీద ఉంది కాబట్టి, ఆమె వారిని కిటికీ నుండి త్రాడుతో క్రిందకు దింపింది. ఆమె వారితో, “మీరు కొండ సీమకు వెళ్లండి, మిమ్మల్ని తరుముతున్నవారు మిమ్మల్ని పట్టుకోలేరు. వారు తిరిగి వచ్చేవరకు అక్కడే మూడు రోజులు దాక్కోండి, తర్వాత మీ దారిన మీరు వెళ్లవచ్చు” అని చెప్పింది. అందుకు వారు ఆమెతో, “మేము నీతో చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉండేలా లేకపోతే మేము నిర్దోషులం: మేము ఈ దేశానికి వచ్చినప్పుడు, నీవు మమ్మల్ని క్రిందికి దించిన కిటికీకి ఈ ఎర్రని త్రాడును కట్టి మమ్మల్ని క్రిందికి దించిన కిటికీకి కట్టాలి, మీ అమ్మ నాన్నలను, మీ అన్నదమ్ములను, మీ కుటుంబమంతటిని నీ ఇంట్లోనే ఉంచాలి. ఒకవేళ నీ ఇంటి నుండి ఎవరైనా బయటి వీధిలోకి వెళ్తే వారి చావుకు వారే బాధ్యులు మేము బాధ్యులం కాము. అయితే నీ ఇంట్లో నీ దగ్గరున్న వారి మీద చేయి పడినా అది మా బాధ్యత. అయితే ఒకవేళ మా గురించి నీవు ఎవరికైనా చెప్తే, నీవు మాతో చేయించిన ప్రమాణం నుండి మేము విముక్తులం” అని అన్నారు. అందుకామె, “సరే, మీరు చెప్పినట్టే కానివ్వండి” అని చెప్పి వారిని పంపివేసింది. వారు వెళ్లిన తర్వాత ఆమె ఆ ఎర్రని త్రాడును కిటికీకి కట్టింది.

యెహోషువ 2:8-21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆ గూఢచారులు పడుకొనే ముందు, ఆమె వాళ్ళున్న మిద్దె ఎక్కి వాళ్ళతో ఇలా అంది, “యెహోవా ఈ దేశాన్ని మీకిస్తున్నాడనీ, మీవల్ల మాకు భయం కల్గుతుందనీ నాకు తెలుసు. మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరూ హడలి పోతారు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చేటప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రజలం ఎలా ఆరిపోయేలా చేశాడో, యొర్దాను తీరాన ఉన్న సీహోను, ఓగు అనే ఇద్దరు అమోరీయ రాజులకు మీరేమి చేశారో, అంటే మీరు వాళ్ళని ఎలా నిర్మూలం చేశారో ఆ సంగతులన్నీ మేము విన్నాం. వినగానే మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశంలో, కింద భూమి మీదా దేవుడే. మీ ముందు ఎలాంటి మనుషులకైనా ధైర్యం ఏమాత్రం ఉండదు. కాబట్టి ఇప్పుడు దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయండి. నేను మీకు ఉపకారం చేసినట్టే మీరూ నా తండ్రి కుటుంబానికి ఉపకారం చేయండి. నా తల్లిదండ్రుల, అన్నదమ్ముల, అక్కచెల్లెళ్ళ కుటుంబాలన్నిటినీ చావు నుండి రక్షిస్తామని నాకు కచ్చితమైన ఒక ఆనవాలు ఇవ్వండి” అంది. అందుకు వారు ఆమెతో “నీవు మా సంగతి వెల్లడి చేయకపోతే మీరు చావకుండా ఉండేలా మీ ప్రాణాలకు బదులు మా ప్రాణాలిస్తాం, యెహోవా ఈ దేశాన్ని మాకిచ్చేటప్పుడు నిజంగా మేము నీకు ఉపకారం చేస్తాం” అన్నారు. ఆమె ఇల్లు పట్టణ ప్రాకారం మీద ఉంది, ఆమె ప్రాకారం మీద నివాసం ఉంటున్నది కాబట్టి తాడువేసి కిటికీ గుండా వాళ్ళని దింపింది. ఆమె “మిమ్మల్ని తరమడానికి వెళ్ళినవాళ్ళు మీకెదురొస్తారేమో, వారు తిరిగి వచ్చేవరకూ మీరు కొండలకు వెళ్లి మూడురోజులు అక్కడ దాక్కుని ఉండండి, తరువాత మీ దారిన మీరు వెళ్ళండి” అని వారితో చెప్పింది. ఆ మనుషులు ఆమెతో “మేము ఈ దేశానికి వచ్చేవాళ్ళం కాబట్టి నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మేము నిర్దోషులమయ్యేలా మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్ర తాడు కట్టి, నీ తండ్రినీ నీ తల్లినీ నీ అన్నదమ్ములనూ నీ తండ్రి కుటుంబం మొత్తాన్నీ నీ ఇంటికి తెచ్చుకో. నీ ఇంట్లోనుండి ఎవరన్నా బయటికి వస్తే మాత్రం తన ప్రాణానికి తానే బాధ్యుడు, మేము నిర్దోషులం. అయితే నీ దగ్గర నీ ఇంట్లో ఉన్న వాళ్ళల్లో ఎవరికైనా ఏ అపాయమైనా కలిగితే దానికి మేమే జవాబుదారులం. నీవు మా సంగతి వెల్లడి చేస్తే నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మాకు దోషం ఉండదు” అన్నారు. అందుకు ఆమె “మీ మాట ప్రకారం జరుగుతుంది” అని చెప్పి వాళ్ళను పంపివేసింది. వాళ్ళు వెళ్ళిన తరువాత ఆమె ఆ ఎర్ర తాడును కిటికీకి కట్టింది.

యెహోషువ 2:8-21 పవిత్ర బైబిల్ (TERV)

ఆ ఇద్దరు మనుష్యులూ అప్పుడే నిద్రకు ఉపక్రమించబోతున్నారు. అయితే ఆమె అటక పైకి వెళ్లి వాళ్లతో మాట్లాడింది. రాహాబు ఇలా అంది, “ఈ దేశాన్ని యెహోవా మీ ప్రజలకు ఇచ్చాడని నాకు తెలుసు. మీరంటే మాకు భయం. ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ మీరంటే భయమే. యెహోవా మీకు సహాయం చేసిన విధానాల్ని గూర్చి విన్నాము గనుక మాకు భయం. మీరు ఈజిప్టునుండి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం ఆరిపోయేటట్టు ఆయన చేసాడని మేము విన్నాము. అమోరీ రాజులైన సీహోను, ఓగులకు మీరు చేసినదాన్ని గూర్చి కూడ మేము విన్నాము. యొర్దాను నదికి తూర్పున ఉన్న ఆ రాజులను మీరు నాశనం చేసిన సంగతి మేము విన్నాము. ఆ సంగతులు మేము విని చాల భయపడిపోయాము ఇప్పుడు మా వాళ్లెవరికీ మీతో పోరాడే ధైర్యంలేదు. ఎందుచేతనంటే పైన ఆకాశాన్ని క్రింద భూమిని మీ యెహోవా దేవుడే పాలిస్తున్నాడు గనుక. ఇప్పుడు మీరు నాతో ఒడంబడిక చేస్తామని మాట ఇవ్వండి. నేను మీకు సహాయం చేసాను, దయ చూపించాను. కనుక మీరు నా కుటుంబానికి దయ చూపిస్తామని యెహోవా ఎదుట ప్రమాణం చేయండి. ఇలా మీరు చేస్తామని దయచేసి నాకు చెప్పండి. నా తండ్రి, తల్లి, సోదరులు, సోదరీలు, వాళ్లందరి కుటుంబాల్ని, నా కుటుంబాన్ని మీరు బ్రతుకనిస్తామని నాకు మాట ఇవ్వండి. చావునుండి మీరు మమ్మల్ని రక్షిస్తామని ప్రమాణం చేయండి.” ఆ మనుష్యలు ఒప్పుకున్నారు. “మీ ప్రాణాల కోసం మా ప్రాణాలు ఇస్తాము. మేము చేస్తున్న పని గూర్చి ఎవ్వరితో చెప్పకు. తర్వాత మీ దేశాన్ని యెహోవా మాకు ఇచ్చినప్పుడు మేము నీకు దయ చూపిస్తాము. నీవు మా మాట నమ్ము” అని వాళ్లు చెప్పారు. ఆ స్త్రీ ఇల్లు పట్టణం ప్రహారీ గోడమీద కట్టబడింది. అది గోడలో ఒక భాగంగా ఉంది. కనుక ఆమె ఒక తాడు ప్రయోగించి కిటికీలోనుంచి వాళ్లిద్దర్నీ క్రిందికి దించింది. అప్పుడు ఆమె వాళ్లతో ఇలా అంది: “పొరబాటున కూడా మీరు రాజుగారి మనుష్యులకు కనపడకుండా పడమటి కొండల్లోకి వెళ్లిపోండి. మూడు రోజులు అక్కడ దాక్కోండి. రాజుగారి మనుష్యులు తిరిగి వచ్చాక, మీ దారిన మీరు వెళ్లవచ్చు.” ఆ మనుష్యులు ఇద్దరూ ఆమెతో ఇలా అన్నారు: “మేము నీకు వాగ్దానం చేసాము. అయితే నీవు ఒక పని చేయాలి. లేకపోతే మా వాగ్దానానికి మేము బాధ్యులం కాదు. మేము తప్పించుకోనేందుకు నీవు ఈ ఎర్రటి తాడు ప్రయోగిస్తున్నావు. మేము ఈ దేశానికి తిరిగి వస్తాము. ఆ సమయంలో ఈ ఎర్రటి తాడును నీవు నీ కిటికీలో కట్టాలి. నీ తండ్రిని, తల్లిని, నీ సోదరులను, నీ కుటుంబం అంతటిని నీవు నీ ఇంట్లో చేర్చాలి. ఈ ఇంట్లో ఉండే ప్రతీ ఒక్కరినీ మేము క్షేమంగా కాపాడుతాము. నీ ఇంట్లో ఉన్న వాళ్లెవరైనా దెబ్బతింటే దానికి మేము బాధ్యులము. నీ ఇంట్లోనుంచి ఎవరైనా బయటకు వెళ్లి, చంపబడితే దానికి మేము బాధ్యులము కాము. అది ఆ వ్యక్తి తప్పు అవుతుంది. ఈ ఒడంబడిక మేము నీతో చేస్తున్నాము. మేము చేస్తోన్న పనిగూర్చి నీవు గనుక ఎవరితోనైనా చెప్పావంటే మేము ఈ ఒడంబడికకు కట్టుబడి ఉండనక్కర్లేదు.” “ఇది నాకు సమ్మతమే” అని ఆ స్త్రీ జవాబిచ్చింది. ఆమె వాళ్లకు వీడ్కోలు చెప్పింది, వాళ్లు ఆమె ఇల్లు విడిచి బయల్దేరారు. అప్పుడు ఆమె ఆ ఎర్రటి తాడును కిటికీకి కట్టింది.

యెహోషువ 2:8-21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆ వేగులవారు పండుకొనకమునుపు, ఆమె వారున్న మిద్దెమీదికెక్కి వారితో ఇట్లనెను. –యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీవలన మాకు భయము పుట్టుననియు, మీ భయమువలన ఈ దేశనివాసులందరికి ధైర్యము చెడుననియు నేనెరు గుదును. మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు మీ యెదుట యెహోవా యెఱ్ఱసముద్రపు నీరును ఏలాగు ఆరిపోచేసెనో, యొర్దాను తీరముననున్న అమోరీయుల యిద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఏలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమియందును దేవుడే. మీ యెదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమేమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరును నా తండ్రియింటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలును ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములును నా అక్కచెల్లెండ్రును వారికి కలిగి యున్నవారందరును చావకుండ బ్రదుకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యెహోవాతోడని ప్రమాణము చేయుడనెను. అందుకు ఆ మనుష్యులు ఆమెతో–నీవు మా సంగతి వెల్లడి చేయనియెడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చెదము, యెహోవా ఈ దేశమును మాకిచ్చునప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసెదమనిరి. ఆమె యిల్లు పట్టణపు ప్రాకారముమీద నుండెను, ఆమె ప్రాకారము మీద నివసించునది గనుక త్రాడువేసి కిటికిద్వారా వారిని దింపెను. ఆమె–మిమ్మును తరుమబోయినవారు మీకెదు రుగా వచ్చెదరేమో, మీరు కొండలకువెళ్లి తరుమబోయినవారు తిరిగి వచ్చువరకు మూడుదినములు అచ్చట దాగి యుండుడి, తరువాత మీ త్రోవను వెళ్లుడని వారితో అనగా ఆ మనుష్యులు ఆమెతో ఇట్లనిరి–యిదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మాచేత చేయించిన యీ ప్రమాణము విషయమై మేము నిర్దోషుల మగునట్లు నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎఱ్ఱని దారమును కట్టి, నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి యింటివారినందరిని నీయింట చేర్చుకొనుము. నీ యింటి ద్వారములలోనుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది, మేము నిర్దోషులమగుదుము. అయితే నీయొద్ద నీ యింటనున్న యెవనికేగాని యే అపాయమైనను తగిలినయెడల దానికి మేమే ఉత్తర వాదులము. నీవు మా సంగతి వెల్లడిచేసినయెడల నీవు మాచేత చేయించిన యీ ప్రమాణము విషయములో మేము దోషులము కామనిరి. అందుకు ఆమె–మీ మాటచొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ల నంపెను. వారు వెళ్లినతరువాత ఆమె ఆ తొగరుదారమును కిటికీకి కట్టెను.