రోమా పత్రిక 3:22-31
రోమా పత్రిక 3:22-31 TSA
యేసు క్రీస్తులో ఉన్న విశ్వాసం ద్వారా నమ్మిన వారందరికి ఈ నీతి ఇవ్వబడుతుంది. యూదులకు యూదేతరులకు మధ్య ఏ భేదం లేదు. అందరు పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకుంటున్నారు. కాబట్టి విశ్వసించిన వారందరు ఆయన కృప చేత యేసు క్రీస్తు నుండి వచ్చిన విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. క్రీస్తు రక్తాన్ని చిందించడం ద్వారా దేవుడు ఆయనను ప్రాయశ్చిత్త బలిగా సమర్పించారు; విశ్వాసం ద్వారా దానిని పొందుకోవాలి. ఆయన తన నీతిని చూపించడానికి ఇలా చేశారు, ఎందుకంటే ఆయన సహనంతో పూర్వం చేసిన పాపాలను శిక్ష విధించకుండా వదిలేశారు. ఆయన ఈ ప్రస్తుత కాలంలో తన నీతిని కనుపరచడానికి, ఆయన నీతిమంతుడై ఉండి యేసులో విశ్వాసముంచిన వారిని నీతిమంతులుగా తీర్చేవానిగా ఉండడానికి ఇలా చేశారు. అయితే అతిశయించడానికి కారణం ఎక్కడ? అది రద్దు చేయబడింది. ఏ నియమాన్ని బట్టి? క్రియల నియమాన్ని బట్టియా? కాదు, విశ్వాస నియమాన్ని బట్టియే. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన కాకుండా విశ్వాసం ద్వారానే ఒకరు నీతిమంతునిగా తీర్చబడతారని మనం నిశ్చయించుకున్నాము. దేవుడు కేవలం యూదులకు మాత్రమే దేవుడా? యూదేతరులకు ఆయన దేవుడు కాడా? అవును, ఆయన యూదేతరులకు కూడా దేవుడే. దేవుడు ఒక్కడే కాబట్టి సున్నతి పొందినవారిని విశ్వాసం ద్వారా, సున్నతి లేనివారిని కూడా అదే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చుతారు. అయితే ఈ విశ్వాసం బట్టి మనం ధర్మశాస్త్రాన్ని నిరర్ధకం చేస్తున్నామా? ఎన్నటికి కాదు! మనం ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాము.






