ప్రకటన 15:1-8

ప్రకటన 15:1-8 TSA

నేను పరలోకంలో మరొక గొప్ప అద్భుతమైన సూచన చూశాను: ఏడుగురు దేవదూతలు చివరి ఏడు తెగుళ్ళను పట్టుకుని వస్తున్నారు. అవి చివరివి ఎందుకంటే ఈ తెగుళ్ళతో దేవుని కోపం తీరిపోతుంది. నేను అగ్నితో కలిసి ఉన్న గాజు సముద్రంలాంటి దాన్ని చూశాను. ఆ గాజు సముద్రపు ఒడ్డున ఆ మృగాన్ని, దాని విగ్రహాన్ని, ఆ మృగం పేరుగల సంఖ్యను జయించినవారు నిలబడి ఉన్నారు. వారు తమకు దేవుడు ఇచ్చిన తంతి వాయిద్యాలను పట్టుకుని ఉన్నారు. వారు దేవుని సేవకుడైన మోషే పాట, వధించబడిన గొర్రెపిల్ల పాడిన పాట పాడుతూ, “మా ప్రభువైన సర్వశక్తిగల దేవా! నీవు చేసిన క్రియలు గొప్పవి, ఆశ్చర్యకరమైనవి! సకల రాజ్యాలకు రాజా! నీ మార్గాలు యథార్థంగా న్యాయంగా ఉన్నాయి! ఓ ప్రభువా! నీవు ఒక్కడివే పరిశుద్ధుడవు, కాబట్టి నీకు భయపడని వారు ఎవరు? నీ పేరును ఘనపరచకుండా ఎవరు ఉండగలరు? నీ నీతి క్రియలు తెలియజేయబడ్డాయి, కాబట్టి భూజనులందరు నీ ఎదుటకు వచ్చి ఆరాధిస్తారు,” అని దేవుని స్తుతించారు. దీని తర్వాత నేను చూస్తూ ఉండగా, పరలోక దేవాలయం అనగా సాక్షి గుడారం తెరవబడింది. ఆ పరలోక దేవాలయం నుండి ఏడుగురు దేవదూతలు ఏడు తెగుళ్ళు తీసుకువచ్చారు. వారు ప్రకాశిస్తున్న తెల్లని వస్త్రాలను ధరించి తమ రొమ్ముకు బంగారు దట్టీని కట్టుకుని ఉన్నారు. అప్పుడు నాలుగు ప్రాణులలోని ఒక ప్రాణి నిరంతరం జీవించే దేవుని ఉగ్రతతో నింపబడిన ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దేవదూతలకు ఇచ్చాడు. అప్పుడు దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చే పొగతో ఆ దేవాలయమంతా నిండిపోయి ఆ ఏడుగురు దేవదూతలు ఆ ఏడు తెగుళ్ళను కుమ్మరించే వరకు ఆ దేవాలయంలోనికి ఎవరు ప్రవేశించలేకపోయారు.

ప్రకటన 15:1-8 కోసం వీడియో