యెహోషువ 4:1-9

యెహోషువ 4:1-9 TSA

ప్రజలంతా యొర్దాను నది దాటిన తర్వాత యెహోవా యెహోషువకు, “ప్రతి గోత్రం నుండి ఒకరి చొప్పున ప్రజల్లో నుండి పన్నెండుమందిని ఎన్నుకుని, యొర్దాను మధ్య నుండి, అంటే యాజకులు నిలబడి ఉన్న చోటుకు కుడివైపు నుండి పన్నెండు రాళ్లను తీసుకుని, వాటిని మీతో పాటు మోసుకువెళ్లి, ఈ రాత్రి మీరు బసచేసే స్థలంలో వాటిని ఉంచమని వారికి చెప్పు” అని ఆజ్ఞాపించారు. కాబట్టి యెహోషువ ఇశ్రాయేలీయుల నుండి తాను నియమించిన పన్నెండుమందిని ప్రతి గోత్రం నుండి ఒకరి చొప్పున పిలిచి, వారితో, “మీ దేవుడైన యెహోవా మందసానికి ముందుగా యొర్దాను మధ్యలోనికి వెళ్లండి. ఇశ్రాయేలీయుల గోత్రాల లెక్క చొప్పున మీలో ప్రతి ఒక్కరూ తన భుజంపై ఒక రాయిని మోయాలి, అది మీ మధ్య ఒక సూచనగా ఉంటుంది. భవిష్యత్తులో, ‘ఈ రాళ్లకు అర్థమేంటి?’ అని మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు, యెహోవా నిబంధన మందసం యొర్దాను దాటుతున్నప్పుడు యొర్దాను నీళ్లు ఆగిపోయాయి. కాబట్టి ఈ రాళ్లు ఇశ్రాయేలు ప్రజలకు నిత్యం జ్ఞాపకార్థంగా ఉంటాయి అని వారికి చెప్పండి.” కాబట్టి ఇశ్రాయేలీయులు యెహోషువ ఆజ్ఞాపించినట్లు చేశారు. యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయుల గోత్రాల లెక్క ప్రకారం వారు యొర్దాను మధ్య నుండి పన్నెండు రాళ్లను తీసుకొని తమతో పాటు తమ శిబిరానికి తెచ్చి వారు ఉన్నచోట పెట్టారు. యెహోషువ ఆ పన్నెండు రాళ్లను యొర్దాను మధ్యలో, నిబంధన మందసాన్ని మోస్తున్న యాజకులు నిలబడిన స్థలంలో నిలబెట్టించాడు. నేటి వరకు అవి అక్కడే ఉన్నాయి.