గలతీ పత్రిక 3:6-14

గలతీ పత్రిక 3:6-14 TSA

అలాగే మన పూర్వికుడైన అబ్రాహాము కూడా, “దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది.” కాబట్టి మీరు అర్థం చేసుకోవలసింది ఏంటంటే విశ్వాసం కలిగినవారే అబ్రాహాముకు పిల్లలవుతారు. దేవుడు యూదేతరులను వారి విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీరుస్తారని లేఖనంలో ముందుగానే చెప్పబడింది. “నిన్ను బట్టి సర్వ జనులు దీవించబడతారు” అని చెప్పడం ద్వారా అబ్రాహాముకు ముందుగానే సువార్త ప్రకటించబడింది. అందువల్ల విశ్వాసంపై ఆధారపడే ప్రతి ఒక్కరూ విశ్వాస పురుషుడైన అబ్రాహాముతో పాటు ధన్యులవుతారు. ధర్మశాస్త్ర క్రియలపై ఆధారపడే వారందరూ శాపగ్రస్తులు, ఎలాగంటే లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారం: “ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాటన్నిటిని పాటించనివారు శాపగ్రస్తులు.” ధర్మశాస్త్రం మీద ఆధారపడే ఏ ఒక్కడూ దేవుని ముందు నీతిమంతునిగా తీర్చబడడు, ఎందుకంటే “నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు.” ధర్మశాస్త్రం విశ్వాసానికి సంబంధించింది కాదు పైగా “వీటిని చేసేవారు వాటి వల్లనే జీవిస్తారు” అని అది చెప్తుంది. ధర్మశాస్త్రం వల్ల వచ్చే శాపం నుండి మనల్ని విమోచించడానికి క్రీస్తు మన కోసం శాపగ్రస్తుడయ్యారు. ఎలాగంటే, లేఖనాల్లో, “మ్రానుపై వ్రేలాడదీయబడిన ప్రతి ఒక్కరూ శాపగ్రస్తులే” అని వ్రాయబడిన దాని ప్రకారం. విశ్వాసం ద్వారా దేవుని ఆత్మను గురించిన వాగ్దానాన్ని మనం పొందుకునేలా అబ్రాహాముకు ఇవ్వబడిన దీవెన క్రీస్తు యేసు ద్వారా యూదేతరులకు కూడా వర్తించాలని ఆయన మనల్ని విమోచించారు.