సంఖ్యాకాండము 13:21-33

సంఖ్యాకాండము 13:21-33 TELUBSI

కాబట్టి వారు వెళ్లి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబువరకు దేశసంచారముచేసి చూచిరి. వారు దక్షిణదిక్కున ప్రయాణముచేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులగు అహీమాను షేషయి తల్మయి అను వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయనుకంటె ఏడేండ్లు ముందుగా కట్టబడెను. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్షచెట్టుయొక్క కొమ్మనుకోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మపండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలీయులు అక్కడకోసిన ద్రాక్ష గెలనుబట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను. వారు నలుబది దినములు ఆ దేశమును సంచరించి చూచితిరిగి వచ్చిరి. అట్లువారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేషులోనున్న మోషే అహరోనులయొద్దకును ఇశ్రాయేలీయుల సర్వసమాజమునొద్దకును వచ్చి, వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరచినదేమనగా–నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్లితిమి; అది పాలు తేనెలు ప్రవహించు దేశమే; దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు; వారి పట్టణములు ప్రాకారముగలవి అవి మిక్కిలి గొప్పవి; మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణదేశములో నివసించుచున్నారు; హిత్తీయులు యెబూసీయులు అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు; కనానీయులు సముద్రమునొద్దను యొర్దాను నదీప్రాంతములలోను నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళ పరచి–మనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను. అయితే అతనితోకూడ పోయిన ఆ మనుష్యులు–ఆ జనులు మనకంటె బలవంతులు; మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమునుగూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి–మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము; దానిలో మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి; మా దృష్టికి మేము మిడతలవలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి.