పస్కా అనబడిన పులియనిరొట్టెల పండుగ సమీ పించెను. ప్రధానయాజకులును శాస్త్రులును ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఏలాగు చంపింతుమని ఉపాయము వెదకుచుండిరి.
అంతట పండ్రెండుమంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్లి, ఆయనను వారికేలాగు అప్పగింపవచ్చునో దానినిగూర్చి ప్రధానయాజకులతోను అధిపతులతోను మాటలాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని, జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదకుచుండెను.
పస్కాపశువును వధింపవలసిన పులియనిరొట్టెల దినమురాగా యేసు పేతురును యోహానును చూచి– మీరు వెళ్లి మనము భుజించుటకై పస్కాను మనకొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. వారు–మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నావని ఆయనను అడుగగా ఆయన–ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించునప్పుడు నీళ్లకుండ మోసికొనిపోవుచున్న యొకడు మీకు ఎదురుగా వచ్చును; అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్లి –నేను నా శిష్యులతోకూడ పస్కాను భుజించుటకు విడిది గది యెక్కడనని బోధకుడు నిన్నడుగుచున్నాడని యింటి యజమానునితో చెప్పుడి. అతడు సామగ్రిగల యొక గొప్ప మేడగది మీకు చూపించును; అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను. వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి.
ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతోకూడ అపొస్తలులును పంక్తిని కూర్చుండిరి. అప్పుడాయన– నేను శ్రమపడకమునుపు మీతోకూడ ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యములో నెరవేరువరకు ఇక ఎన్నడును దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి–మీరు దీనిని తీసికొని మీలో పంచుకొనుడి; ఇకమీదట దేవుని రాజ్యము వచ్చువరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పు చున్నాననెను. పిమ్మట ఆయన యొక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి, వారి కిచ్చి–ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఆప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని–ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతోకూడ ఈ బల్లమీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్యకుమారుడు పోవుచున్నాడుగాని ఆయన ఎవరిచేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమయని చెప్పెను. వారు–ఈ పనిని చేయబోవువాడెవరో అని తమలోతాము అడుగుకొన సాగిరి.
తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను –అన్యజనములలో రాజులు వారిమీద ప్రభుత్వము చేయుదురు; వారిమీద అధికారము చేయువారు ఉపకారులనబడుదురు. మీరైతే ఆలాగు ఉండరాదు; మీలో గొప్పవాడు చిన్నవానివలెను, అధిపతి పరిచారకునివలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజనపంక్తిని కూర్చుండువాడా పరిచర్యచేయువాడా? పంక్తినికూర్చుండు వాడే గదా? అయినను నేను మీ మధ్య పరిచర్యచేయు వానివలె ఉన్నాను. నా శోధనలలో నాతోకూడ నిలిచియున్నవారు మీరే; గనుక నాతండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్లయొద్ద అన్నపానములు పుచ్చుకొని, సింహాసనములమీద కూర్చుండి ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి మీరు తీర్పుతీర్చుటకై, నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పెట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. అయితే అతడు –ప్రభువా, నీతోకూడ చెరలోనికిని మరణమునకును వెళ్లుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా ఆయన–పేతురూ, నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పు వరకు, నేడు కోడికూయదని నీతో చెప్పుచున్నాననెను.
మరియు ఆయన–సంచియు జాలెయు చెప్పులునులేకుండ నేను మిమ్మును పంపినప్పుడు, మీకు ఏమైనను తక్కువాయెనా అని వారినడిగినప్పుడు వారు–ఏమియు తక్కువకాలేదనిరి. అందుకాయన ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలెయు తీసికొని పోవలెను; కత్తి లేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కొనవలెను;
–ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నాయందు నెరవేరవలసియున్నది; ఏలయనగా నన్నుగూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నాననెను. వారు ప్రభువా, ఇదిగో ఇక్కడ రెండు కత్తులున్నవనగా–చాలునని ఆయన వారితో చెప్పెను.
తరువాత ఆయన బయలుదేరి, తనవాడుకచొప్పున ఒలీవలకొండకు వెళ్లగా శిష్యులును ఆయనవెంట వెళ్లిరి. ఆ చోటు చేరి ఆయన వారితో–మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థనచేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్లి మోకాళ్లూని తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చిత్త మైతే తొలగించుము; అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకమునుండి యొకదూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యులయొద్దకు వచ్చి, వారు దుఃఖముచేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను.
ఆయన ఇంకను మాటలాడుచుండగా, ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. పండ్రెండుమందిలో యూదా అన బడినవాడు వారికంటె ముందుగా నడిచి, యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయనయొద్దకు రాగా యేసు–యూదా, నీవు ముద్దుపెట్టుకొని మనుష్యకుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా ఆయన చుట్టు ఉన్నవారు జరుగబోవు దానిని చూచి–ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని కుడి చెవి తెగనరికెను. అయితే యేసు–ఈ మట్టుకు తాళుడని చెప్పి, వాని చెవి ముట్టి బాగుచేసెను. యేసు తన్ను పట్టుకొనవచ్చిన ప్రధానయాజకులతోను దేవాలయపు అధిపతులతోను పెద్దలతోను–మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను బయలుదేరి వచ్చితిరా? నేను అనుదినము మీచెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు; అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను.
వారాయనను పెట్టి యీడ్చుకొనిపోయి ప్రధానయాజకుని యింటిలోనికి తీసికొనిపోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. అంతట కొందరు నడుముంగిట మంటవేసి చుట్టు కూర్చుండినప్పుడు, పేతురును వారిమధ్యను కూర్చుండెను. అప్పుడొక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరిచూచి–వీడును అతనితోకూడ ఉండెనని చెప్పెను. అందుకు పేతురు–అమ్మాయీ, నేనతని నెరుగననెను. మరి కొంత సేపటికి మరియొకడు అతని చూచి–నీవును వారిలో ఒకడవనగా పేతురు– ఓయీ, నేను కాననెను. ఇంచుమించు ఒక గడియయైన తరువాత మరియొకడు–నిజముగా వీడును అతనితోకూడ ఉండెను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను. అందుకు పేతురు–ఓయీ, నీవు చెప్పినది నాకు తెలియ దనెను. అతడింకను మాటలాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురువైపు చూచెను గనుక పేతురు–నేడు కోడి కూయకమునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొని వెలుపలికిపోయి సంతాపపడి యేడ్చెను.