లూకా 2:21-52

లూకా 2:21-52 TELUBSI

ఆ శిశువునకు సున్నతి చేయవలసిన యెనిమిదవ దినము వచ్చినప్పుడు, గర్భమందాయన పడకమునుపు దేవదూతచేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రముచొప్పునవారు తమ్మును శుద్ధి చేసికొను దినములు గడచినప్పుడు –ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువు కు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయ నను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును, ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును, వారు ఆయనను యెరూషలేమునకు తీసికొనిపోయిరి. యెరూషలేమునందు సుమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునైయుండి, ఇశ్రాయేలుయొక్క ఆదరణకొరకు కనిపెట్టువాడు; పరిశుద్ధాత్మ అతనిమీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మచేత బయలు పరచబడి యుండెను; ఆత్మ వశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతట ధర్మశాస్త్రపద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తలిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసికొనివచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తికొని దేవుని స్తుతించుచు ఇట్లనెను – –నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధాన ముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు; అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయననుగూర్చి చెప్ప బడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సుమెయోను వారిని దీవించి–ఇదిగో అనేక హృదయాలోచనలు బయలు పడునట్లు, ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడియున్నాడు; మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసికొనిపోవునని ఆయన తల్లియైన మరియతో చెప్పెను. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవస్త్రి యుండెను. ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు పెని మిటితో సంసారముచేసి బహుకాలము గడిచినదై, యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలైయుండి, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుచుండెను. ఆమె కూడ ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి, యెరూషలేములో విమోచనకొరకు కనిపెట్టుచున్నవారందరితో ఆయననుగూర్చి మాటలాడుచుండెను. అంతట వారు ప్రభువు ధర్మశాస్ర్తము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్లిరి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, ఎదిగి బలము పొందుచుండెను; దేవుని దయ ఆయనమీద నుండెను. పస్కాపండుగప్పుడు ఆయన తలిదండ్రులు ఏటేట యెరూషలేమునకు వెళ్లుచుండువారు. ఆయన పండ్రెం డేండ్లవాడై యున్నప్పుడు ఆ పండుగ నాచరించుటకై వాడుకచొప్పునవారు యెరూషలేమునకు వెళ్లిరి. ఆ దినములు తీరినతరువాత వారు తిరిగి వెళ్లుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తలి దండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి, యొక దినప్రయాణము సాగిపోయి, తమ బంధువులలోను నెళవైనవారిలోను ఆయ నను వెదకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. మూడుదినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకులమధ్య కూర్చుండి, వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు వినినవారందరు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. ఆయన తలిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి–కుమారుడా, మమ్మును ఎందుకీలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని అయనతో చెప్పగా ఆయన–మీరేల నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పెను; అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతట ఆయన వారితోకూడ బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి యుండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయములో భద్రము చేసికొనెను. యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను.