అపొస్తలుల కార్యములు 27:1-26

అపొస్తలుల కార్యములు 27:1-26 TELUBSI

మేము ఓడయెక్కి ఇటలీ వెళ్లవలెనని నిర్ణయమై నప్పుడు, వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతియైన యూలి అను వానికి అప్పగించిరి. ఆసియ దరివెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తియ పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితిమి; మాసిదోనీయుడును థెస్సలొనీక పట్టణస్థుడునైన అరిస్తార్కు మాతోకూడ ఉండెను. మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి, అతడు తన స్నేహితులయొద్దకు వెళ్లి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చెను. అక్కడనుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రచాటున ఓడ నడిపించితిమి. మరియు కిలికియకును పంఫూలియకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియలో ఉన్న మూరకు చేరితిమి. అక్కడ శతాధిపతి ఇటలీవెళ్లనైయున్న అలెక్సంద్రియ పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మును ఎక్కించెను. అనేక దినములు మెల్లగా నడచి, యెంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనియ్యకున్నందున క్రేతు చాటున సల్మోనే దరిని ఓడ నడిపించితిమి. బహు కష్టపడి దాని దాటి, మంచిరేవులు అను ఒక స్థలమునకు చేరితిమి. దానిదగ్గర లసైయ పట్టణముండెను. చాల కాలమైన తరువాత ఉపవాసదినము కూడ అప్పటికి గతించినందున ప్రయాణముచేయుట అపాయ కరమై యుండెను. అప్పుడు పౌలు–అయ్యలారా, యీ ప్రయాణమువలన సరకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడ హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. మరియు శీతకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడనుండి బయలుదేరి యొకవేళ శక్యమైతే ఫీనిక్సునకుచేరి అక్కడ శీతకాలము గడపవలెనని యెక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైరుతి వాయవ్యదిక్కులతట్టుననున్న క్రేతురేవై యున్నది. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసరుచుండగా వారు తమ ఆలోచన సమ కూడినదని తలంచి లంగరెత్తి, క్రేతు దరిని ఓడ నడిపించిరి. కొంచెము సేపైన తరువాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీదనుండి విసరెను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడువలేక పోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొనిపోతిమి. తరువాత కౌద అన బడిన యొక చిన్న ద్వీపము చాటున దాని నడిపింపగా పడవను భద్రపరచుకొనుట బహు కష్ట తరమాయెను. దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్లు మొదలైనవి తీసి కొని ఓడచుట్టు బిగించి కట్టిరి. మరియు సూర్తిసను ఇసుకతిప్పమీద పడుదుమేమో అని భయపడి, ఓడ చాపలు దింపివేసి, కొట్టుకొనిపోయిరి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరకులు పారవేయ సాగిరి. మూడవ దినమందు తమ చేతులార ఓడసామగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్దగాలి మామీద కొట్టినందున ప్రాణములతో తప్పించు కొందుమను ఆశ బొత్తిగ పోయెను. వారు బహు కాలము భోజనము లేక యున్నందున పౌలు వారిమధ్యను నిలిచి–అయ్యలారా, మీరు నా మాట విని క్రేతునుండి బయలుదేరకయే యుండవలసినది. అప్పుడీ హానియు నష్టమును కలుగకపోవును. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను; ఓడకేగాని మీలో ఎవని ప్రాణమునకును హానికలుగదు. నేను ఎవనివాడనో, యెవనిని సేవించుచున్నానో, ఆ దేవుని దూత గడచిన రాత్రి నాయొద్ద నిలిచి–పౌలా, భయపడకుము; నీవు కైసరు ఎదుట నిలువవలసియున్నది; ఇదిగో నీతోకూడ ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరిని దేవుడు నీకు అనుగ్రహించియున్నాడని నాతో చెప్పెను. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి; నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అయినను మనము కొట్టుకొనిపోయి యేదైన ఒక ద్వీపముమీద పడవలసి యుండునని చెప్పెను.

అపొస్తలుల కార్యములు 27:1-26 కోసం వీడియో