అపొస్తలుల కార్యములు 21:1-36

అపొస్తలుల కార్యములు 21:1-36 TELUBSI

మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్లి కోసుకును, మరునాడు రొదుకును, అక్కడనుండి పతరకును వచ్చితిమి. అప్పుడు ఫేనీకేకు వెళ్ల బోవుచున్న ఒక ఓడను చూచి దానిని ఎక్కి బయలుదేరితిమి. కుప్రకు ఎదురుగా వచ్చి, దానిని ఎడమతట్టున విడిచి, సిరియవైపుగా వెళ్లి, తూరులో దిగితిమి; అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసియుండెను. మేమక్కడ నున్న శిష్యులను కనుగొని యేడుదినములక్కడ ఉంటిమి. వారు–నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమై పోవుచుండగా, భార్యలతోను పిల్లలతోను వారందరు మమ్మును పట్టణము వెలుపలివరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్రతీరమున మోకాళ్లూని ప్రార్థనచేసి యొకరియొద్ద ఒకరము సెలవు పుచ్చుకొంటిమి. అంతట మేము ఓడ ఎక్కితిమి, వారు తమతమ యిండ్లకు తిరిగి వెళ్లిరి. మేము తూరునుండి చేసిన ప్రయాణము ముగించి, తొలెమాయికి వచ్చి, సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినముంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి, యేడుగురిలో నొకడును సువార్తి కుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతనియొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికుండిరి, వారు ప్రవచించువారు. మేమనేక దినములక్కడ ఉండగా, అగబు అను ఒక ప్రవక్త యూదయనుండి వచ్చెను. అతడు మాయొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసికొని, తన చేతులను కాళ్లను కట్టుకొని–యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనుష్యుని ఈలాగు బంధించి, అన్యజనులచేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడివారును–యెరూషలేమునకు వెళ్లవద్దని అతని బతిమాలుకొంటిమి గాని పౌలు– ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేల? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను. అతడు ఒప్పుకొన నందున మేము–ప్రభువు చిత్తము జరుగునుగాక అని ఊరకుంటిమి. ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామగ్రి తీసికొని యెరూషలేమునకు ఎక్కిపోతిమి. మరియు కైసరయనుండి కొందరు శిష్యులు, మొదటనుండి శిష్యుడుగా ఉండిన కుప్రీయుడైన మ్నాసోను ఇంట మేము దిగవలెనను ఉద్దేశముతో అతనిని వెంటబెట్టుకొని మాతోకూడ వచ్చిరి. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మును సంతోషముతో చేర్చుకొనిరి. మరునాడు పెద్దలందరు అక్కడికి వచ్చియుండగా పౌలు మాతోకూడ యాకోబునొద్దకు వచ్చెను. అతడు వారిని కుశల మడిగి, తన పరిచర్యవలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పెను. వారు విని దేవుని మహిమపరచి అతని చూచి–సహోదరుడా, యూదులలో విశ్వాసులైనవారు ఎన్ని వేలమంది యున్నారో చూచుచున్నావుగదా? వారందరును ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, మన ఆచారముల చొప్పున నడువకూడదనియు నీవు చెప్పుటవలన వారందరు మోషేను విడిచిపెట్టవలెనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్నుగూర్చి వర్తమానము వినియున్నారు. కావున మన మేమి చేయుదుము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయుము. మ్రొక్కుబడియున్న నలుగురు మనుష్యులు మాయొద్ద ఉన్నారు. నీవు వారిని వెంటబెట్టుకొనిపోయి వారితోకూడ శుద్ధిచేసికొని, వారు తలక్షౌరము చేయించుకొనుటకు వారికయ్యెడి తగులుబడి పెట్టుకొనుము; అప్పుడు నిన్నుగూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు, నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావనియు తెలిసికొందురు అయితే విశ్వసించిన అన్యజనులనుగూర్చి–వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపినదానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసియున్నామని చెప్పిరి. అంతట పౌలు మరునాడు ఆ మనుష్యులను వెంట బెట్టుకొనిపోయి, వారితోకూడ శుద్ధిచేసికొని, దేవాలయములో ప్రవేశించి, వారిలో ప్రతివానికొరకు కానుక అర్పించువరకు శుద్ధిదినములు నెరవేర్చుదుమని తెలిపెను. ఏడు దినములు కావచ్చినప్పుడు ఆసియనుండి వచ్చిన యూదులు దేవాలయములో అతని చూచి, సమూహ మంతటిని కలవరపరచి అతనిని బలవంతముగా పట్టుకొని –ఇశ్రాయేలీయులారా, సహాయము చేయరండి; ప్రజ లకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసుదేశస్థులను దేవాలయములోనికి తీసికొనివచ్చి యీ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచియున్నాడని కేకలు వేసిరి. ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితోకూడ పట్టణములో అంతకుముందువారు చూచియున్నందున పౌలు దేవాలయములోనికి అతని తీసికొని వచ్చెనని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరుగెత్తికొని వచ్చి, పౌలును పట్టుకొని దేవాలయములోనుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి; వెంటనే తలుపులు మూయబడెను. వారతని చంపవలెనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై యధికారికి వర్తమానము వచ్చెను; వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంట బెట్టుకొని వారియొద్దకు పరుగెత్తివచ్చెను; వారు పై యధికారిని సైనికులను రాణువవారిని చూచి పౌలును కొట్టుట మానిరి. పై యధికారి దగ్గరకు వచ్చి అతని పట్టుకొని, రెండు సంకెళ్లతో బంధించుమని ఆజ్ఞా పించి–ఇతడెవడు? ఏమిచేసెనని అడుగగా, సమూహములో కొందరీలాగు కొందరాలాగు కేకలువేయు చున్నప్పుడు అల్లరిచేత అతడు నిజము తెలిసికొనలేక కోటలోనికి అతని తీసికొనిపొమ్మని ఆజ్ఞాపించెను. పౌలు మెట్లమీదికి వచ్చినప్పుడు జనులు గుంపుకూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతనిని మోసికొని పోవలసి వచ్చెను. ఏలయనగా–వానిని చంపుమని జనసమూహము కేకలువేయుచు వెంబడించెను.

అపొస్తలుల కార్యములు 21:1-36 కోసం వీడియో