అపొస్తలుల కార్యములు 15:1-35

అపొస్తలుల కార్యములు 15:1-35 TELUBSI

కొందరు యూదయనుండి వచ్చి–మీరు మోషే . నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు, ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపొస్తలులయొద్దకును పెద్దలయొద్దకును వెళ్లవలెనని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘమువలన సాగనంపబడి, ఫేనీకే సమరయ దేశములద్వారా వెళ్లుచు, అన్యజనులు దేవునివైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికిని మహా సంతోషము కలుగజేసిరి. వారు యెరూషలేమునకు రాగా, సంఘపువారును అపొస్తలులును పెద్దలును వారిని చేర్చుకొనిరి; దేవుడు తమకు తోడై యుండి చేసినవన్నియు వారు వివరించిరి. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరులేచి, అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు, మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెననియు చెప్పిరి. అప్పుడు అపొస్తలులును పెద్దలును ఈ సంగతినిగూర్చి ఆలోచించుటకు కూడివచ్చిరి. బహు తర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను– సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడేర్పరచుకొనెనని మీకు తెలియును. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి, వారినిగూర్చి సాక్ష్య మిచ్చెను. వారి హృదయములను విశ్వాసమువలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడమీద పెట్టి మీ రెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా? అలాగే వారును రక్షణ పొందుదురు అనెను. అంతట ఆ సమూహమంతయు ఊరకుండి, బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచకక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను–సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్యజనులలోనుండి దేవుడు తన నామముకొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఏలాగు మొదట కటాక్షించెనో సుమెయోను వివరించియున్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడియున్నవి; ఎట్లనగా– ఆ తరువాత నేను తిరిగి వచ్చెదను; మనుష్యులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెనో ఆ సమస్తమైన అన్యజనులును ప్రభువు ను వెదకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను దాని పాడైనవాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెద నని అనాదికాలమునుండి ఈ సంగతులను తెలియ పరచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడియున్నది. కాబట్టి అన్యజనులలోనుండి దేవునివైపు తిరుగుచున్నవారిని మనము కష్టపట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము. ఏలయనగా, సమాజమందిరములలో ప్రతి విశ్రాంతిదినమున మోషే లేఖనములు చదువుటవలనమునుపటి తరములనుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరుగల యూదాను సీలను తమలో ఏర్పరచుకొని, పౌలుతోను బర్నబాతోను అంతియొకయకు పంపుట యుక్తమని అపొస్తలులకును పెద్దలకును సంఘమంతటికిని తోచెను. వీరు వ్రాసి, వారిచేత పంపిన దేమనగా–అపొస్తలులును పెద్దలైన సహోదరులును అంతియొకయలోను, సిరియలోను, కిలికియలోను నివసించుచు అన్యజనులుగానుండిన సహోదరులకు శుభము. కొందరు మాయొద్దనుండి వెళ్లి, తమ బోధచేత మిమ్మును కలవరపరచి, మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మే మధికారమిచ్చి యుండలేదు గనుక మనుష్యులను ఏర్పరచి, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరుకొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను మన ప్రియులతోకూడ మీయొద్దకు పంపుట యుక్తమని మాకంద రికి ఏకాభిప్రాయము కలిగెను. కాగా యూదాను సీలను పంపి యున్నాము; వారును నోటిమాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు. మీకు క్షేమము కలుగును గాక. అంతట వారు సెలవుపుచ్చుకొని అంతియొకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. మరియు యూదాయు సీలయు కూడ ప్రవక్తలై యుండి నందున పెక్కుమాటలతో సహోదరుల నాదరించి స్థిరపరచిరి. వారు అక్కడ కొంతకాలము గడపి, సహోదరులయొద్దనుండి తమ్మును పంపిన వారియొద్దకు వెళ్లుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. అయితే పౌలును బర్నబాయు అంతియొకయలో నిలిచి, యింక అనేకులతోకూడ ప్రభువు వాక్యము బోధించుచు ప్రకటించుచు నుండిరి.

అపొస్తలుల కార్యములు 15:1-35 కోసం వీడియో