రోమా 10:12-15
రోమా 10:12-15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యూదులకు, యూదేతరులకు భేదం లేదు. ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఆయనకు మొరపెట్టిన వారందరిని ఆయన సమృద్ధిగా దీవిస్తాడు. ఎందుకంటే, “ప్రభువు పేరట మొరపెట్టిన ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు.” అయితే, వారు తాము నమ్మని వానికి ఎలా మొరపెడతారు? తాము విననివానిని ఎలా నమ్ముతారు? వారికి ఎవరూ ప్రకటించకపోతే ఎలా వినగలరు? ప్రకటించేవారిని పంపకపోతే ఎలా ప్రకటించగలరు? దీని గురించి, “సువార్తను తెచ్చేవారి పాదాలు ఎంతో అందమైనవి!” అని వ్రాయబడి ఉంది.
రోమా 10:12-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇందులో యూదులూ, గ్రీకులూ అనే వ్యత్యాసం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు. ఆయన తనకు ప్రార్థన చేసే వారందరికీ కృప చూపగల సంపన్నుడు. ఎందుకంటే ప్రభువు నామంలో ప్రార్థన చేసే వారందరికీ పాపవిమోచన కలుగుతుంది. నమ్మని వాడికి వారు ఎలా ప్రార్థన చేస్తారు? తాము వినని వాడిపై ఎలా నమ్మకం పెట్టుకుంటారు? ఆయన్ని గురించి ప్రకటించేవాడు లేకుండా వారెలా వింటారు? ప్రకటించే వారిని పంపకపోతే ఎలా ప్రకటిస్తారు? దీన్ని గురించి, “శ్రేష్ఠమైన వాటిని గురించిన శుభ సమాచారం అందించే వారి పాదాలు ఎంతో అందమైనవి” అని రాసి ఉంది.
రోమా 10:12-15 పవిత్ర బైబిల్ (TERV)
యూదులకు, యూదులు కానివాళ్ళకు వ్యత్యాసం లేదు. ప్రభువు ఒక్కడే. ఆయనే అందరికి ప్రభువు. ఆయన, తనను ప్రార్థించిన వాళ్ళందరికీ అడిగినంత ఇస్తాడు. దీన్ని గురించి, “ప్రభువును ప్రార్థించిన ప్రతి ఒక్కడూ రక్షింపబడతాడు” అని వ్రాయబడి ఉంది. మరి, విశ్వసించకుండా ఎలా ప్రార్థించగలరు? ఆయన్ని గురించి వినకుండా వాళ్ళు ఆయన్ని ఏ విధంగా విశ్వసించగలరు? వాళ్ళకు ఎవరో ఒకరు చెప్పకుంటే వాళ్ళు ఏ విధంగా వినగలరు? ఎవరైనా పంపందే వాళ్ళు వచ్చి ఎలా చెపుతారు? దీన్ని గురించి ఈ విధంగా వ్రాసారు: “సువార్తను తెచ్చేవాళ్ళ పాదాలు ఎంత అందంగా ఉన్నాయి!”
రోమా 10:12-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థనచేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు. ఎందుకనగా– ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడులేకుండ వారెట్లు విందురు? ప్రకటించువారు పంప బడని యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై– ఉత్తమమైనవాటినిగూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి యున్నది


