మత్తయి 27:1-44 - Compare All Versions
మత్తయి 27:1-44 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తెల్లవారుజామున ముఖ్య యాజకులు, ప్రజానాయకులు కలిసి యేసును ఎలా చంపాలి అని ఆలోచన చేశారు. కాబట్టి వారు ఆయనను బంధించి, తీసుకెళ్లి అధిపతియైన పిలాతు చేతికి అప్పగించారు. అప్పుడు యేసును అప్పగించిన యూదా, యేసుకు శిక్ష వేయడం చూసి, తాను చేసిన దోషాన్ని బట్టి పశ్చాత్తాపపడి, ఆ ముప్పై వెండి నాణాలను ముఖ్య యాజకులు యూదా నాయకులకు తిరిగి ఇవ్వడానికి వెళ్లాడు. అతడు వారితో, “నేను ఒక నిరపరాధి రక్తాన్ని మీకు అప్పగించి, పాపం చేశాను” అని అన్నాడు. అందుకు వారు, “దానితో మాకేంటి? అది నీ సమస్య” అని జవాబిచ్చారు. అప్పుడు యూదా ఆ వెండి నాణాలను దేవాలయంలో విసిరి వేసి అక్కడినుండి వెళ్లి, ఉరి వేసుకున్నాడు. ముఖ్య యాజకులు ఆ వెండి నాణాలను తీసుకుని, “ఇవి రక్తపు వెల కాబట్టి వీటిని కానుక పెట్టెలో వేయడం ధర్మశాస్త్ర విరుద్ధం” అని చెప్పి, వారు ఆలోచించి ఆ డబ్బుతో విదేశీయులను సమాధి చేయడానికి ఒక కుమ్మరి వాని పొలం కొన్నారు. అందుకే నేటి వరకు ఆ పొలం రక్తపొలం అని పిలువబడుతూ ఉంది. ఈ విధంగా యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పబడిన: “వారు ముప్పై వెండి నాణేలు తీసుకున్నారు, అవి ఇశ్రాయేలీయులు ఆయనకు కట్టిన విలువ, ప్రభువు నన్ను ఆదేశించిన ప్రకారం, వారు ఆ డబ్బుతో కుమ్మరి వాని పొలాన్ని కొన్నారు,” అనే ప్రవచనం నెరవేరింది. తర్వాత యేసు పిలాతు అధిపతి ఎదుట నిలబడ్డాడు. అప్పుడు అధిపతి, “నీవు యూదుల రాజువా?” అని ఆయనను అడిగాడు. అందుకు యేసు, “అని నీవే అన్నావు కదా” అని జవాబిచ్చారు. ముఖ్య యాజకులు యూదానాయకులును యేసు మీద నిందలు మోపినప్పుడు, ఆయన వాటికి జవాబివ్వలేదు. అందుకు పిలాతు, “వారు నీకు వ్యతిరేకంగా తెస్తున్న సాక్ష్యాన్ని నీవు వినడం లేదా?” అని అడిగాడు. కాని కనీసం ఒకదానికైనా యేసు జవాబివ్వలేదు, అధిపతికి చాలా ఆశ్చర్యం కలిగింది. పండుగ రోజు ప్రజల ఎన్నుకున్న ఒక నేరస్థుని విడుదల చేయడం అధిపతికి ఆనవాయితి. ఆ సమయంలో బందిపోటు దొంగగా పేరుమోసిన బరబ్బ అనే ఖైదీ ఉన్నాడు. కాబట్టి జనసమూహం సమకూడినప్పుడు, పిలాతు, “నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుతున్నారు? యేసు అనబడిన బరబ్బనా లేదా క్రీస్తు అనబడిన యేసునా?” అని వారిని అడిగాడు. ఎందుకంటే వారు కేవలం అసూయతోనే యేసును అప్పగించారని అతడు గ్రహించాడు. పిలాతు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు, అతని భార్య అతనికి: “నీవు ఆ నిర్దోషి జోలికి పోవద్దు, రాత్రి కలలో ఆయన గురించి నేను చాలా కష్టపడ్డాను” అని వర్తమానం పంపింది. కాని ముఖ్య యాజకులు నాయకులు బరబ్బాను విడుదల చేసి యేసును చంపమని అడిగేలా ప్రజలను రెచ్చగొట్టారు. అధిపతి, “ఈ ఇద్దరిలో నేను ఎవనిని విడుదల చేయాలని మీరు కోరుతున్నారు?” అని వారిని అడిగాడు. వారు, “బరబ్బనే” అని కేకలు వేశారు. అందుకు పిలాతు, “అలాగైతే క్రీస్తు అనబడిన యేసును, ఏమి చేయాలి?” అని వారిని అడిగాడు. అందుకు వారు, “సిలువ వేయండి!” అని కేకలు వేశారు. “ఎందుకు? ఇతడు చేసిన నేరమేంటి?” అని పిలాతు అడిగాడు. అయితే వారు ఇంకా గట్టిగా, “అతన్ని సిలువ వేయండి!” అని కేకలు వేశారు. పిలాతు అల్లరి ఎక్కువ అవుతుంది తప్ప తాను ఏమి చేయలేకపోతున్నానని గ్రహించి, నీళ్లు తీసుకుని ప్రజలందరి ముందు తన చేతులను కడుక్కుని, “ఈయన రక్తం విషయంలో నేను నిర్దోషిని, ఇక మీదే బాధ్యత!” అని చెప్పాడు. అప్పుడు ప్రజలందరు, “ఇతని రక్తం మామీద మా పిల్లల మీద ఉండును గాక!” అని కేకలు వేశారు. అప్పుడు పిలాతు బరబ్బను వారికి విడుదల చేశాడు. యేసును కొరడాలతో కొట్టించి, సిలువ వేయడానికి అప్పగించాడు. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధిపతి భవనం లోనికి తీసుకెళ్లి, సైనికులందరిని యేసు చుట్టూ సమకూర్చారు. వారు ఆయన బట్టలను తీసివేసి ఆయనకు ఎర్రని అంగీని తొడిగించారు. ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలమీద పెట్టారు. ఒక కర్ర తన కుడిచేతిలో ఉంచారు. అప్పుడు ఆయన ఎదుట మోకరించి, “యూదుల రాజా, నీకు శుభం!” అని అంటూ ఆయనను ఎగతాళి చేశారు. వారు ఆయన మీద ఉమ్మివేసి, కర్ర తీసుకుని దానితో ఆయనను తలమీద పదే పదే కొట్టారు. వారు ఆయనను ఎగతాళి చేసిన తర్వాత, ఆయన మీదున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రాలను ఆయనకే తొడిగించారు. ఆ తర్వాత ఆయనను సిలువ వేయడానికి తీసుకెళ్లారు. వారు వెళ్తుండగా, కురేనీయ పట్టణానికి చెందిన, సీమోను అనే ఒకడు కనిపించగానే, వారు అతన్ని సిలువ మోయడానికి బలవంతం చేశారు. వారు గొల్గొతా అనే స్థలానికి తీసుకుని వచ్చారు. గొల్గొతా అంటే “కపాల స్థలం” అని అర్థము. అక్కడ వారు చేదు కలిపిన, ద్రాక్షరసాన్ని ఆయనకు ఇచ్చారు; గాని ఆయన దాని రుచి చూసి, త్రాగడానికి ఒప్పుకోలేదు. వారు ఆయనను సిలువ వేసిన తర్వాత, చీట్లు వేసి ఆయన వస్త్రాలను పంచుకున్నారు. వారు అక్కడే కూర్చుని, ఆయనకు కాపలాగా ఉన్నారు. ఆయన మీద మోపబడిన నేరం వ్రాసి ఆయన తలపైన బిగించారు: ఇతడు యేసు, యూదుల రాజు. ఆయనతో పాటు ఇద్దరు బందిపోటు దొంగలను, కుడి వైపున ఒకడిని, ఎడమవైపున ఒకడిని సిలువ వేశారు. ఆ దారిలో వెళ్తున్నవారు తలలు ఊపుతూ, “దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో తిరిగి కడతానన్నావు, నిన్ను నీవే రక్షించుకో! నీవు దేవుని కుమారుడవైతే, సిలువ మీద నుండి దిగిరా” అని అంటూ దూషించారు. అలాగే ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు నాయకులు కూడా ఆయనను ఎగతాళి చేశారు, “వీడు ఇతరులను రక్షించాడు, కాని తనను తాను రక్షించుకోలేడు! ఇశ్రాయేలీయుల రాజు కదా! ఇప్పుడు సిలువ మీది నుండి దిగివస్తే, మేము ఇతన్ని నమ్ముతాము. వీడు దేవుని నమ్మాడు. ‘నేను దేవుని కుమారుడనని’ చెప్పుకొన్నాడు కదా, దేవునికి ఇష్టమైతే దేవుడే ఇతన్ని తప్పిస్తాడు” అన్నారు. ఆయనతో కూడా సిలువవేయబడిన బందిపోటు దొంగలు కూడా ఆయనపై అవమానాలు గుప్పించారు.
మత్తయి 27:1-44 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
తెల్లవారింది. ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలందరు యేసును చంపించాలని ఆయనపై కుట్ర చేశారు. ఆయనను బంధించి, తీసుకెళ్ళి రోమ్ గవర్నర్ పిలాతుకు అప్పగించారు. అప్పుడు ఆయనను వారికి పట్టించి ఇచ్చిన యూదా, వారు ఆయనకు శిక్ష విధించడం చూసి పశ్చాత్తాపపడి, ఆ ముప్ఫై వెండి నాణాలు ప్రధాన యాజకుల, పెద్దల దగ్గరికి తీసుకొచ్చి, “నేను నిరపరాధి రక్తాన్ని మీకు అప్పగించి పాపం చేశాను” అని చెప్పాడు. అందుకు వారు, “ఐతే మాకేంటి? దాని సంగతి నువ్వే చూసుకో” అని చెప్పారు. అప్పుడతడు ఆ వెండి నాణాలు దేవాలయంలో విసిరేసి, వెళ్ళి ఉరి వేసుకున్నాడు. ముఖ్య యాజకులు ఆ వెండి నాణాలు తీసుకుని “ఇది రక్తం కొన్న డబ్బు. కాబట్టి దీన్ని కానుక పెట్టెలో వేయడం ధర్మశాస్త్ర విరుద్ధం” అని చెప్పుకున్నారు. వారు ఆలోచించి ఆ సొమ్ముతో పరదేశులను పాతిపెట్టడం కోసం ఒక కుమ్మరి వాడి పొలం కున్నారు. ఆ పొలాన్ని నేటివరకూ “రక్త పొలం” అని పిలుస్తున్నారు. దీనితో, “ఇశ్రాయేలు ప్రజలు ఆయనకు కట్టిన వెల, క్రయధనం ముప్ఫై వెండి నాణాలు. వారు ప్రభువు నాకు నియమించిన ప్రకారం కుమ్మరి వాడి పొలం కోసం ఇచ్చారు” అని దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పిన మాట నెరవేరింది. యేసు పిలాతు ఎదుట నిలబడ్డాడు. అప్పుడు పిలాతు, “నీవు యూదుల రాజువా?” అని ఆయనను అడిగాడు. యేసు, “నీవే అంటున్నావు గదా” అన్నాడు. ముఖ్య యాజకులు, పెద్దలు ఆయన మీద నేరాలు మోపుతున్నప్పుడు ఆయన వాటికి ఏమీ జవాబు చెప్పలేదు. కాబట్టి పిలాతు, “నీ మీద వీరు ఎన్ని నేరాలు మోపుతున్నారో నీవు వినడం లేదా?” అని ఆయనను అడిగాడు. అయితే ఆయన ఒక్క మాటకైనా అతనికి జవాబు చెప్పకపోవడం పిలాతుకి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆ పండగలో ప్రజలు కోరుకొనే ఒక ఖైదీని విడుదల చేయడం గవర్నరుకు వాడుక. ఆ కాలంలో బరబ్బా అనే పేరు మోసిన ఒక బందిపోటు చెరసాలలో ఉన్నాడు. కాబట్టి ప్రజలు తన దగ్గరికి వచ్చినప్పుడు పిలాతు వారిని ఇలా అడిగాడు, “నేను మీకు ఎవరిని విడుదల చేయాలి? బరబ్బనా లేక క్రీస్తు అని పిలిచే యేసునా?” ఎందుకంటే వారు కేవలం అసూయతోనే ఆయనను అప్పగించారని అతనికి తెలుసు. అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య, “నీవు ఆ నిర్దోషి జోలికి పోవద్దు. ఈ రోజు నేను ఆయన గురించి కలలో బహు బాధపడ్డాను” అని అతనికి కబురు పంపింది. ముఖ్య యాజకులు, పెద్దలు బరబ్బనే విడిపించమనీ యేసును చంపించాలని అడగమని జనసమూహాలను రెచ్చగొట్టారు. పిలాతు, “ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయాలని మీరు కోరుతున్నారు?” అని అడగగా వారు, “బరబ్బనే” అని అరిచారు. అందుకు పిలాతు, “మరి క్రీస్తు అని పిలిచే ఈ యేసును ఏమి చెయ్యమంటారు?” అన్నాడు. వారంతా, “అతణ్ణి సిలువ వేయండి” అని కేకలు వేశారు. పిలాతు, “ఎందుకు? ఇతడు ఏం నేరం చేశాడు?” అని అడిగినప్పుడు, వారు, “సిలువ వేయండి” అని ఇంకా ఎక్కువగా కేకలు వేశారు. అల్లరి ఎక్కువౌతుందే గాని తన ప్రయత్నాలేమీ ఫలించడం లేదని గ్రహించి, పిలాతు నీళ్ళు తీసుకుని ఆ జనసమూహం ఎదుట చేతులు కడుక్కుని, “ఈ నీతిపరుని రక్తం విషయంలో నేను నిరపరాధిని, దీన్ని మీరే చూసుకోవాలి” అని చెప్పాడు. అందుకు ప్రజలంతా, “అతడి రక్తం మా మీదా, మా పిల్లల మీదా ఉండుగాక” అన్నారు. అప్పుడు పిలాతు వారు కోరినట్టే బరబ్బను విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయడానికి అప్పగించాడు. అప్పుడు సైనికులు యేసును అధికార మందిరంలోకి తీసుకుపోయి, ఆయన ముందు సైనికులందరినీ పోగుచేశారు. వారు ఆయన వస్త్రాలు తీసేసి, ఆయనకు ఎర్రని అంగీ తొడిగించారు. ముళ్ళతో ఒక కిరీటం అల్లి ఆయన తలమీద పెట్టారు. ఆయన కుడి చేతిలో ఒక రెల్లు కర్ర ఉంచారు. అప్పుడు ఆయన ముందు మోకరించి, “యూదుల రాజా, నీకు శుభం!” అంటూ ఎగతాళి చేశారు. ఆయన మీద ఉమ్మి వేసి, ఆ రెల్లు కర్రతో ఆయన తలమీద కొట్టారు. అదంతా అయిన తరువాత ఆయనకు వేసిన అంగీ తీసివేసి ఆయన వస్త్రాలు ఆయనకు తొడిగించి, సిలువ వేయడానికి తీసుకు వెళ్ళారు. వారు బయటికి వస్తూ ఉండగా కురేనే ప్రాంతానికి చెందిన సీమోను అనే వ్యక్తి కనిపించాడు. వారు బలవంతంగా అతని చేత ఆయన సిలువను మోయించారు. వారు, “కపాల స్థలం” అని అర్థమిచ్చే ‘గొల్గొతా’ అనే చోటికి వచ్చారు. అక్కడ చేదు కలిపిన ద్రాక్షారసాన్ని తాగడానికి ఆయనకు అందించారు గాని ఆయన దాన్ని రుచి చూసి తాగలేక నిరాకరించాడు. వారు ఆయనను సిలువ వేసిన తరవాత చీట్లు వేసి ఆయన బట్టలు పంచుకున్నారు. అక్కడే ఆయనకు కావలిగా కూర్చున్నారు. “ఇతడు యూదుల రాజైన యేసు’’ అని ఆయన మీద మోపిన నేరం రాసి ఉన్న ప్రకటన ఒకటి ఆయన తలకు పైన ఉంచారు. ఆయన కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు ఇద్దరు బందిపోటు దొంగలను కూడా సిలువవేశారు. ఆ దారిన వెళ్ళేవారు తలలూపుతూ, “దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో కట్టేవాడా, నిన్ను నీవే రక్షించుకో. నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగిరా!” అంటూ ఆయనను తిట్టారు. అలాగే ధర్మశాస్త్ర పండితులూ, పెద్దలూ, ప్రధాన యాజకులూ ఆయనను వెక్కిరిస్తూ, “ఇతడు ఇతరులను రక్షించాడు గానీ తనను రక్షించుకోలేడు. ఇశ్రాయేలు రాజు గదా, అతడిప్పుడు సిలువ మీద నుండి దిగి వస్తే అతణ్ణి నమ్ముతాం. ఇతడు దేవునిలో విశ్వాసం ఉన్నవాడు గదా, తాను దేవుని కుమారుణ్ణి అని చెప్పాడు గదా. కాబట్టి ఆయనకిష్టమైతే దేవుడే ఇతన్ని తప్పిస్తాడు” అని హేళనగా మాట్లాడారు. ఆయనతోబాటు సిలువ వేసిన దోపిడీ దొంగలు కూడా ఆయనను అలాగే నిందించారు.
మత్తయి 27:1-44 TERV (పవిత్ర బైబిల్)
తెల్లవారాక ప్రధాన యాజకులు, పెద్దలు అంతా సమావేశమై యేసును చంపటానికి నిశ్చయించారు. వాళ్ళాయన్ని బంధించి తీసుకెళ్ళి రాష్ట్ర పాలకుడైన పిలాతుకు అప్పగించారు. యేసుకు ద్రోహం చేసిన యూదా యేసుని చంపటానికి నిశ్చయించారని విని చాలా బాధ పడ్డాడు. తాను తీసుకొన్న ముప్పై వెండి నాణాల్ని ప్రధాన యాజకులకు, పెద్దలకు తిరిగి యిచ్చేస్తూ, “నేను పాపం చేసాను. ఆ అమాయకుణ్ణి చావుకు అప్పగించాను” అని అన్నాడు. వాళ్ళు, “అది నీ గొడవ. మాకు సంబంధం లేదు” అని సమాధానం చెప్పారు. యూదా ఆ డబ్బును దేవాలయంలో పారవేసి, వెళ్ళి ఉరి వేసుకున్నాడు. ప్రధానయాజకులు నాణాల్ని తీసికొని, “ఇది రక్తాని కోసం చెల్లించిన డబ్బు కనుక ఈ డబ్బును ధనాగారంలో ఉంచటం మంచిది కాదు” అని అన్నారు. వాళ్ళు ఆలోచించి ఆ ధనంతో విదేశీయుల్ని సమాధి చెయ్యటానికి ఉపయోగపడేటట్లు ఒక కుమ్మరి వాని పొలాన్ని కొన్నారు. అందువల్లే ఈ నాటికీ ఆ పొలాన్ని “రక్తపు భూమి” అని అంటారు. తద్వారా యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన ఈ వాక్యాలు నెరవేరాయి, “వాళ్ళు ముప్పై వెండి నాణెములను తెచ్చారు. ఇది అతని విలువ. ఇది ఇశ్రాయేలు ప్రజలు నిర్ణయించిన విలువ. ప్రభువు ఆజ్ఞాపించినట్లు వాళ్ళు ఆ ధనంతో కుమ్మరి పొలాన్ని కొన్నారు.” యేసు రాష్ట్రపాలకుని ముందు నిల్చున్నాడు. ఆ రాష్ట్రపాలకుడు, “నీవు యూదులకు రాజువా?” అని యేసును అడిగాడు. “ఔను! నీవన్నది నిజం!” అని యేసు సమాధానం చెప్పాడు. ప్రధాన యాజకులు, పెద్దలు ఆయనపై నేరారోపణలు చేస్తూ పోయారు. కాని ఆయన సమాధానం చెప్పలేదు. అప్పుడు పిలాతు, “వాళ్ళు నీైపె యిన్ని నేరాలు మోపుతున్నారు కదా! నీవు వినటం లేదా?” అని అడిగాడు. యేసు ఒక్క నేరారోపణకు కూడా సమాధానం చెప్పలేదు. రాష్ట్రపాలకునికి చాలా ఆశ్చర్యం వేసింది. పండుగ రోజుల్లో ప్రజలు కోరిన ఒక నేరస్తుణ్ణి విడుదల చేసే ఆచారాన్ని ఆ రాష్ట్రపాలకుడు ఆచరిస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో బరబ్బ అనే ప్రసిద్ధిగాంచిన ఒక నేరస్తుడు కారాగారంలో ఉన్నాడు. అందువల్ల ప్రజలు సమావేశమయ్యాక పిలాతు, “ఎవర్ని విడుదల చెయ్యమంటారు? బరబ్బనా లేక క్రీస్తు అని పిలువబడే యేసునా?” అని వాళ్ళనడిగాడు. అసూయవల్ల వాళ్ళు యేసుని తనకప్పగించారని పిలాతుకు తెలుసు. పిలాతు న్యాయపీఠంపై కూర్చోబోతుండగా అతని భార్య, “ఆ నీతిమంతుని విషయంలో జోక్యం కలిగించుకోకండి. నిన్న రాత్రి ఆయన గురించి కలగన్నాను. ఆ కలలో ఎన్నో కష్టాలను అనుభవించాను” అన్న సందేశాన్ని పంపింది. బరబ్బను విడుదల చేసి యేసుకు మరణ దండన విధించేటట్లు కోరుకోమని ప్రధాన యాజకులు, పెద్దలు ప్రజల్ని ప్రోద్బలం చేసారు. “ఇద్దర్లో నన్ను ఎవర్ని విడుదల చెయ్యమంటారు?” అని రాష్ట్రపాలకుడు అడిగాడు. “బరబ్బను” అని వాళ్ళు సమాధానం చెప్పారు. “మరి ‘క్రీస్తు’ అని పిలువబడే ఈ యేసును నన్నేమి చెయ్యమంటారు?” అని పిలాతు అడిగాడు. అంతా, “సిలువకు వెయ్యండి!” అని సమాధానం చెప్పారు. “ఆయనేం తప్పు చేసాడు?” అని పిలాతు అడిగాడు. కాని వాళ్ళు, “అతన్ని సిలువకు వెయ్యండి” అని యింకా బిగ్గరగా కేకలు వేసారు. లాభం కలగటానికి మారుగా అల్లర్లు మొదలవటం పిలాతు గమనించాడు. తరువాత అతడు నీళ్ళు తీసుకొని ప్రజలముందు ఆ నీళ్ళను చేతులు మీదుగా వదుల్తూ, “ఈయన రక్తానికి నేను బాధ్యుణ్ణికాను. ఇది మీ బాధ్యత!” అని అన్నాడు. ప్రజలు, “అతని రక్తానికి మేము, మా సంతానము బాధ్యత వహిస్తాము!” అని సమాధానం చెప్పారు. ఆ తర్వాత పిలాతు బరబ్బను విడుదల చేసాడు. కాని యేసును కొరడా దెబ్బలు కొట్టించి సిలువకు వేయటానికి అప్పగించాడు. ఆ తర్వాత రాష్ట్రపాలకుని సైనికులు యేసును కోటకు తీసుకు వెళ్ళారు. దళానికి చెందిన సైనికులందరూ ఆయన చుట్టూ చేరారు. ఆయన దుస్తుల్ని విప్పి, ఎఱ్ఱ రంగుగల ఒక పొడుగాటి వస్త్రాన్ని ఆయనకు తొడిగించారు. ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలపై పెట్టారు. ఆయన కుడి చేతికి ఒక బెత్తాన్నిచ్చారు. ఆయన ముందు మోకరిల్లి నమస్కరిస్తూ, “యూదుల రాజా! జయము” అని హేళన చేసారు. ఆయన మీద ఉమ్మివేసారు. బెత్తాన్ని తీసుకొని దాంతో ఆయన తలపై కొట్టారు. ఆయన్ని హేళన చేసాక ఆ పొడుగాటి వస్త్రాన్ని తీసేసి ఆయన దుస్తుల్ని ఆయనకు తొడిగించారు. ఆ తదుపరి ఆయన్ని సిలువకు వెయ్యటానికి తీసుకెళ్ళారు. వాళ్ళు బయటికి వెళ్తూండగా కురేనే పట్టణానికి చెందిన సీమోను అనేవాడు కనిపించాడు. అతణ్ణి బలవంతం చేసి యేసు సిలువను మొయ్యమన్నారు. వాళ్ళు గొల్గొతా అనే స్థలాన్ని చేరుకున్నారు. (గొల్గొతా అంటే “పుర్రెలాంటి స్థలం” అని అర్థం.) అక్కడ చేదుకలిపిన ద్రాక్షరసాన్ని యేసుకు త్రాగటానికి యిచ్చారు. కాని రుచి చూసాక దాన్ని త్రాగటానికి ఆయన నిరాకరించాడు. ఆయన్ని సిలువకు వేసాక ఆయన దుస్తుల్ని చీట్లువేసి పంచుకున్నారు. సైనికులు కూర్చొని ఆయనకు కాపలా కాశారు. ఆయనపై ఆరోపించిన, “ఇతడు యూదుల రాజు” అన్న నేరాన్ని వ్రాసి ఆయన తలపై భాగాన ఉంచారు. ఆ తదుపరి ఆయనతో పాటు దోపిడి దొంగలిద్దర్ని ఒకణ్ణి కుడివైపు, మరొకణ్ణి ఎడమ వైపు సిలువకు వేసారు. ఆ దారిన వెళ్ళిన వాళ్ళు తమ తలలాడిస్తూ ఆయన్ని దూషిస్తూ “దేవాలయాన్ని నాశనం చేసి మూడు రోజుల్లో పునర్నిర్మాణం చేయగల వాడివి! నిన్ను నీవు రక్షించుకో. నీవు దేవుని కుమారుడవైతే ఆ సిలువ నుండి దిగిరా!” అని అన్నారు. ప్రధానయాజకులు శాస్త్రులతో, పెద్దలతో కలసి ఆయన్ని అదే విధంగా హేళన చేస్తూ, “అతడు యితరులను రక్షిస్తాడు. కాని తనను తాను రక్షించుకోలేడు. అతడు ఇశ్రాయేలు ప్రజలకు రాజైనట్లయితే ఆ సిలువ నుండి క్రిందికి దిగిరానీ. అప్పుడతణ్ణి విశ్వసిస్తాము. అతడు దేవుణ్ణి విశ్వసిస్తాడు, ‘నేను దేవుని కుమారుణ్ణి’ అని అన్నాడు. దేవునికి కావలసివస్తే అతణ్ణి రక్షించుకోమనండి” అని అన్నారు. ఆయనతో సహా సిలువకు వేయబడిన దోపిడి దొంగలు కూడా ఆయన్ని అదేవిధంగా అవమానించారు.
మత్తయి 27:1-44 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఉదయమైనప్పుడు ప్రధానయాజకులును, ప్రజల పెద్దలందరును యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచనచేసి ఆయనను బంధించి, తీసికొనిపోయి, అధిపతియైన పొంతిపిలాతునకు అప్పగించిరి. అప్పుడాయనను అప్పగించిన యూదా, ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, ఆ ముప్పది వెండి నాణెములు ప్రధానయాజకులయొద్దకును పెద్దలయొద్దకును మరల తెచ్చి – నేను నిరపరాధరక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారు దానితో మాకేమి? నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి, పోయి ఉరిపెట్టుకొనెను. ప్రధానయాజకులు ఆ వెండి నాణెములు తీసి కొని – ఇవి రక్తక్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచనచేసి వాటినిచ్చి, పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. అందువలన నేటివరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది. అప్పుడు– విలువ కట్టబడినవాని, అనగా ఇశ్రాయేలీయులలో కొందరు విలువకట్టినవాని క్రయధనమైన ముప్పది వెండి నాణెములు తీసికొని ప్రభువు నాకు నియమించినప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమున కిచ్చిరి అని ప్రవక్తయైన యిర్మీయాద్వారా చెప్పబడినమాట నెర వేరెను. యేసు అధిపతియెదుట నిలిచెను; అప్పుడు అధిపతి–యూదుల రాజవు నీవేనా? అని ఆయన నడుగగా యేసు అతని చూచి నీవన్నట్టే అనెను ప్రధానయాజకులును పెద్దలును ఆయనమీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు. కాబట్టి పిలాతు– నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు విన లేదా? అని ఆయనను అడిగెను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. జనులు కోరుకొనిన యొక ఖయిదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బ అను ప్రసిద్ధుడైన యొక ఖయిదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు–నేనెవనిని విడుదలచేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా? అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయచేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి యుండెను అతడు న్యాయపీఠముమీద కూర్చుండియున్నప్పుడు అతని భార్య – నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు; ఈ ప్రొద్దు ఆయ ననుగూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను. ప్రధానయాజకులును పెద్దలును, బరబ్బను విడిపించుమని అడుగుటకును, యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి అధిపతి ఈ యిద్దరిలో నేనెవనిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారని వారినడుగగా వారు–బరబ్బనే అనిరి. అందుకు పిలాతు ఆలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమిచేతునని వారినడుగగా సిలువవేయుమని అందరును చెప్పిరి. అధిపతి–ఎందుకు? ఇతడు ఏ దుష్కా ర్యము చేసెనని అడుగగా వారు సిలువవేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగు చున్నదే గాని తనవలన ప్రయోజనమేమియు లేదని గ్రహించి, నీళ్లు తీసికొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని–ఈ నీతిమంతుని రక్తమునుగూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. అందుకు ప్రజలందరు–వాని రక్తము మా మీదను మా పిల్లలమీదను ఉండుగాకనిరి. అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను. అప్పుడు అధిపతియొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసికొనిపోయి, ఆయనయొద్ద సైనికుల నందరిని సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసి వేసి, ఆయనకు ఎఱ్ఱని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడి చేతిలోనుంచి, ఆయనయెదుట మోకాళ్లూని–యూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి, ఆ రెల్లును తీసికొని దానితో ఆయనను తలమీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రము లాయనకు తొడిగించి, సిలువ వేయుటకు ఆయనను తీసికొనిపోయిరి. వారు వెళ్లుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువమోయుటకు అతనిని బలవంతము చేసిరి. వారు కపాలస్థలమను అర్థమిచ్చు గొల్గొతా అన బడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. వారు ఆయనను సిలువవేసిన పిమ్మట చీట్లువేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. అంతట వారక్కడ కూర్చుండి ఆయనకు కావలియుండిరి. –ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతోకూడ సిలువవేయ బడిరి. ఆ మార్గమున వెళ్లుచుండినవారు తలలూచుచు –దేవాలయమును పడగొట్టి మూడుదినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధానయాజకులును కూడ ఆయనను అపహసించుచు –వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలురాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము. వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఆయనతోకూడ సిలువవేయబడిన బందిపోటుదొంగలును ఆలాగే ఆయనను నిందించిరి.