యెహోషువ 7:3-10
యెహోషువ 7:3-10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వారు యెహోషువ దగ్గరకు తిరిగివచ్చి, “హాయి మీదికి సైన్యమంతా వెళ్లాల్సిన అవసరం లేదు. దాన్ని స్వాధీనపరచుకోడానికి రెండు లేదా మూడువేలమందిని పంపండి చాలు, సైన్యమంతా అలసిపోనవసరం లేదు, ఎందుకంటే అక్కడ కొంతమంది మాత్రమే నివసిస్తున్నారు.” కాబట్టి ప్రజల్లో సుమారు మూడువేలమంది యోధులు వెళ్లారు; కానీ వారు హాయి ప్రజల ఎదుట నిలబడలేక పారిపోయారు, హాయి ప్రజలు వారిలో ముప్పై ఆరుగురిని చంపారు. వారు ఇశ్రాయేలీయులను పట్టణ ద్వారం నుండి రాతి గనుల వరకు కొండ దిగువన వారిని చంపారు. దీంతో ప్రజల గుండెలు భయంతో నీరుగారిపోయాయి. అప్పుడు యెహోషువ, తన బట్టలు చింపుకొని యెహోవా మందసం ముందు నేలమీద పడి, సాయంకాలం వరకు అక్కడే ఉన్నాడు. ఇశ్రాయేలు పెద్దలు కూడా అలాగే చేసి తమ తలలపై దుమ్ము చల్లుకున్నారు. యెహోషువ, “అయ్యో! ప్రభువైన యెహోవా! ఈ ప్రజలను యొర్దాను నదిని ఎందుకు దాటించావు? మమ్మల్ని నాశనం చేయమని అమోరీయుల చేతికి అప్పగించడానికా? మేము యొర్దాను అవతలి ఒడ్డున ఆగిపోవడానికి నిర్ణయించుకొని ఉంటే ఎంత బాగుండేది! ప్రభువా, మీ సేవకుని క్షమించు. ఇప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు తమ శత్రువును ఎదుర్కోలేక పారిపోయారు, నేను ఏమి చెప్పగలను? కనాను ప్రజలు, ఈ దేశంలో ఉన్న ఇతర ప్రజలు ఈ సంగతిని విని మమ్మల్ని చుట్టుముట్టి భూమి మీద మా పేరును తుడిచివేస్తారు. అప్పుడు మీ గొప్ప పేరుకు ఉన్న ఘనత కోసం ఏమి చేస్తావు?” అని ప్రార్థించాడు. అయితే యెహోవా యెహోషువతో ఇలా అన్నారు, “నీవు లే! నీ ముఖం నేలకేసి నీవేమి చేస్తున్నావు?
యెహోషువ 7:3-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారు వెళ్లి, హాయి పట్టణాన్ని వేగు చూసి యెహోషువ దగ్గరికి తిరిగి వచ్చి “ప్రజలందరినీ పంపించకు, రెండు మూడు వేలమంది వెళ్లి హాయిని పట్టుకోవచ్చు, అందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్లనక్కరలేదు, హాయి ప్రజలు కొద్దిమందే ఉన్నారు” అన్నారు. కాబట్టి సుమారు మూడు వేలమంది సైనికులు అక్కడికి వెళ్ళారు గాని వారు హాయి ప్రజల ముందు నిలవలేక పారిపోయారు. హాయి ప్రజలు వారిలో ముప్ఫై ఆరుగురిని చంపేశారు. అదీ కాకుండా వారి పట్టణ ద్వారం దగ్గర నుండి షేబారీము వరకూ తరిమి మోరాదులో వారిని చంపేశారు. కాబట్టి ఇశ్రాయేలీయుల గుండెలు కరిగి నీరైపోయాయి. యెహోషువ తన బట్టలు చింపుకున్నాడు. అతడూ ఇశ్రాయేలీయుల పెద్దలూ సాయంకాలం వరకూ యెహోవా మందసం ముందు నేలమీద ముఖాలు మోపి తలల మీద దుమ్మెత్తి పోసుకొంటూ “అయ్యో, ప్రభూ, యెహోవా, మమ్మల్ని నాశనం చేయడానికీ అమోరీయుల చేతికి అప్పగించడానికీ ఈ ప్రజలను యొర్దాను నదిని ఎందుకు దాటించావు? మేము యొర్దాను అవతల నివసించడమే మేలు కదా. ప్రభూ, కనికరించు, ఇశ్రాయేలీయులు తమ శత్రువులను ఎదుర్కోలేక వెన్ను చూపినందుకు నేనేమి చెప్పాలి? కనానీయులు, ఈ దేశ ప్రజలంతా ఇది విని, మమ్మల్ని చుట్టుముట్టి మా పేరు భూమి మీద ఉండకుండాా తుడిచి పెట్టేస్తారు. అప్పుడు ఘనమైన నీ నామం కోసం నువ్వు ఏం చేస్తావు” అని ప్రార్థించారు. అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు “లే, ఎందుకు ఇక్కడ నేల మీద ముఖం మోపుకున్నావు?
యెహోషువ 7:3-10 పవిత్ర బైబిల్ (TERV)
తర్వాత ఆ మనుష్యులు యెహోషువ దగ్గరకు తిరిగి వచ్చారు. “హాయి బలహీన ప్రాంతం. ఆ దేశాన్ని జయించేందుకు మనకు మన మనుష్యులంతా అవసరం లేదు. అక్కడ యుద్ధానికి రెండువేల మంది లేక మూడు వేల మందిని పంపించు. మన ప్రజలందర్నీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మనమీద పోరాడేందుకు అక్కడ కొద్దిమంది మనుష్యులే ఉన్నారు” అన్నారు వారు. కనుక సమారు మూడువేల మంది మనుష్యులు హాయికి వెళ్లారు. కాని హాయివారు ఇశ్రాయేలు మనుష్యులను 36 మందిని చంపివేసారు. పైగా ఇశ్రాయేలు ప్రజలు పారిపోయారు. హాయివాళ్లు తమ పట్టణ ద్వారాల దగ్గరనుండి షేబారీమువరకు వాళ్లను తరిమివేసారు. హాయివాళ్లు వారిని బాగా కొట్టివేసారు. ఇశ్రాయేలు ప్రజలు అది చూసి, చాలా భయపడిపోయారు, ధైర్యం కోల్పోయారు. యెహోషువ ఇది విని, తన బట్టలు చింపుకొని, పవిత్ర పెట్టె ముందర నేలమీద సాగిలపడ్డాడు. సాయంత్రం వరకు యెహోషువ అక్కడే ఉండిపోయాడు. ఇశ్రాయేలు నాయకులంతా అలానే చేసారు. వారు వారి తలలమీద ధూళి పోసుకొన్నారు. అప్పుడు యెహోషువ చెప్పాడు: “అయ్యో యెహోవా ప్రభువా! మా ప్రజలను నీవే యొర్దాను నది దాటించావు. కానీ నీవెందుకు మమ్మల్ని ఇంత దూరం తీసుకొని వచ్చి, అమోరీవాళ్లు మమ్మల్ని నాశనం చేయునట్లు చేశావు. యొర్దాను నది ఆవల మేము తృప్తిపడి, అక్కడే ఉండిపోవాల్సింది. నా ప్రాణం మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ప్రభూ! ఇప్పుడు నేను చెప్పగలిగింది ఏమీ లేదు. ఇశ్రాయేలీయులు శత్రువులకు లోబడిపోయారు. కనానీ ప్రజలు, ఈ దేశంలోని ప్రజలందరూ జరిగిన దానిగూర్చి వింటారు. తరువాత వాళ్లు మా మీదికి వచ్చి, మమ్మల్ని అందర్నీ చంపేస్తారు. అప్పుడు నీ గొప్ప పేరు కాపాడేందుకు నీవు ఏమి చేస్తావు?” యెహోషువతో యెహోవా ఇలా చెప్పాడు: “లేచి నిలబడు! ఎందుకు నీవు సాష్టాంగ పడతావు?
యెహోషువ 7:3-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
హాయి పురమును వేగుచూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి–జనులందరిని వెళ్లనీయకుము, రెండు మూడు వేలమంది వెళ్లి హాయిని పట్టుకొన వచ్చును, జనులందరు ప్రయాసపడి అక్కడికి వెళ్లనేల? హాయి వారు కొద్దిగానున్నారు గదా అనిరి. కాబట్టి జనులలో ఇంచుమించు మూడు వేలమంది అక్కడికి వెళ్లిరిగాని వారు హాయివారి యెదుట నిలువలేక పారిపోయిరి. అప్పుడు హాయివారు వారిలో ముప్పది ఆరు గురు మనుష్యులను హతము చేసిరి. మరియు తమ గవినియొద్ద నుండి షేబారీమువరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. యెహోషువ తన బట్టలు చింపుకొని, తానును ఇశ్రాయేలీయుల పెద్దలును సాయంకాలమువరకు యెహోవా మందసము నెదుట నేలమీద ముఖములు మోపుకొని తమ తలలమీద ధూళి పోసికొనుచు –అయ్యో, ప్రభువా యెహోవా, మమ్మును నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీ వెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము; ఇశ్రాయేలీయులు తమ శత్రువులయెదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులును ఈ దేశ నివాసులందరును విని, మమ్మును చుట్టుకొని మా పేరు భూమిమీద ఉండకుండ తుడిచివేసినయెడల, ఘనమైన నీ నామమునుగూర్చి నీవేమి చేయుదువని ప్రార్థింపగా యెహోవా యెహోషువతో ఇట్లనెను–లెమ్ము, నీ వేల యిక్కడ ముఖము నేల మోపికొందువు?