యెహోషువ 2:1-6

యెహోషువ 2:1-6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అప్పుడు నూను కుమారుడైన యెహోషువ షిత్తీము నుండి ఇద్దరు వేగులవారు రహస్యంగా పంపుతూ, “వెళ్లి ఆ దేశాన్ని, ముఖ్యంగా యెరికోను వేగుచూసి రండి” అని వారితో చెప్పాడు. వారు రాహాబు అనే వేశ్య ఇంటికి వెళ్లి రాత్రి అక్కడే ఉన్నారు. ఎవరో యెరికో రాజుతో, “చూడండి, కొంతమంది ఇశ్రాయేలీయులు రాత్రి ఈ దేశాన్ని వేగుచూడటానికి వచ్చారు” అని చెప్పారు. కాబట్టి యెరికో రాజు: “నీ దగ్గరకు వచ్చి నీ ఇంట్లో ఉన్న మనుష్యులను ఇక్కడకు తీసుకురా, ఎందుకంటే వారు ఈ దేశాన్ని వేగుచూడటానికి వచ్చారు” అని ఆజ్ఞ జారీచేస్తూ రాహాబుకు సందేశం పంపాడు. అయితే ఆమె ఆ ఇద్దరిని తీసుకెళ్లి దాచిపెట్టి, వారి కోసం వచ్చిన వారితో, “అవును, నా దగ్గరకు మనుష్యులు వచ్చారు, కానీ వారెక్కడి నుండి వచ్చారో నాకు తెలియదు. చీకటి పడుతుండగా పట్టణ ద్వారం మూసివేసే సమయంలో వారు వెళ్లిపోయారు. వారు ఏ మార్గాన వెళ్లారో నాకు తెలియదు. మీరు త్వరగా వెళ్తే వారిని పట్టుకోవచ్చు” అని చెప్పింది. (కాని నిజానికి ఆమె వారిని మిద్దె మీదికి తీసుకెళ్లి అక్కడ వరుసగా పేర్చి ఉన్న జనపకట్టెల్లో దాచిపెట్టింది.)

యెహోషువ 2:1-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నూను కుమారుడు యెహోషువ ఇద్దరు గూఢచారులను పిలిచి “మీరు వెళ్ళి ఆ దేశాన్ని, మరి ముఖ్యంగా యెరికో పట్టణం చూడండి” అని వారితో చెప్పి, షిత్తీము నుండి వారిని రహస్యంగా పంపాడు. వారు వెళ్లి రాహాబు అనే ఒక వేశ్య ఇంటికి వెళ్ళి అక్కడ బస చేశారు. దేశాన్ని వేగుచూడటానికి ఇశ్రాయేలీయుల దగ్గర నుండి ఎవరో రాత్రివేళ ఇక్కడికి వచ్చారని యెరికో రాజుకు సమాచారం వచ్చింది. అతడు తన మనుషులను పంపి “నీ దగ్గరికి వచ్చి నీ ఇంట్లో ప్రవేశించిన ఆ మనుషులను బయటికి తీసుకురా, వారు ఈ దేశాన్ని వేగు చూడటానికి వచ్చారు” అని రాహాబుకు కబురు పంపాడు. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తీసుకెళ్ళి దాచిపెట్టి, ఆ వచ్చిన వారితో “మనుషులు నా దగ్గరికి వచ్చిన మాట నిజమే, వాళ్ళెక్కడ నుండి వచ్చారో నాకు తెలీదు, చీకటి పడేటప్పుడు కోట తలుపులు మూసే వేళ వాళ్ళు బయటికి వెళ్లిపోయారు, వాళ్ళెక్కడికి వెళ్ళారో నాకు తెలీదు, మీరు వాళ్ళను తొందరగా తరిమితే పట్టుకుంటారు” అని చెప్పింది. అంతకుముందు ఆమె ఆ ఇద్దరినీ తన మిద్దె మీదికి ఎక్కించి దాని మీద రాశివేసి ఉన్న జనపకట్టల్లో వాళ్ళని దాచి పెట్టింది.

యెహోషువ 2:1-6 పవిత్ర బైబిల్ (TERV)

నూను కుమారుడైన యెహోషువ, ప్రజలంతా ఆకాషియా దగ్గర గుడారాలు వేసుకున్నారు. యెహోషువ ఇద్దరు గూఢచారుల్ని పంపించాడు. వీళ్లను యెహోషువ పంపినట్టు మరెవ్వరికీ తెలియదు. “మీరు వెళ్లి ఆ దేశాన్ని చూడండి. ముఖ్యంగా యెరికో పట్టణాన్ని దగ్గరగా చూడండి” అని యెహోషువ ఆ మనుష్యులతో చెప్పాడు. కనుక ఆ మనుష్యులు యెరికో పట్టణం వెళ్లారు. వాళ్లు ఒక వేశ్య ఇంటికి వెళ్లి, అక్కడ వుండిరి. ఆ స్త్రీ పేరు రాహాబు. “మన ప్రజల బలహీనత తెలుసుకొనేందుకు కొందరు ఇశ్రాయేలు మనుష్యులు వచ్చారు” అని యెరికో రాజుతో ఎవరో చెప్పారు. కనుక యెరికో రాజు రాహాబుకు ఇలా కబురంపాడు: “నీ ఇంటికి వచ్చిదాక్కొన్న ఆ మనుష్యుల్ని దాచిపెట్టకు. వాళ్లను బయటకు తీసుకొనిరా. వాళ్లు మన దేశాన్ని వేగు చూడటానికి వచ్చారు.” ఆ స్త్రీ వాళ్లిద్దర్నీ దాచిపెట్టేసింది. అయితే ఆమె అంది: “ఆ ఇద్దరూ ఇక్కడికి వచ్చిన మాట నిజమే. అయితే వాళ్లు ఎక్కడ్నుండి వచ్చిందీ నాకు తెలియదు. సాయంకాలం, పట్టణ ద్వారాలు మూసివేసే వేళ వాళ్లు వెళ్లిపోయారు. వాళ్లు ఎక్కడికి వెళ్లిందీ నాకు తెలియదు. కానీ ఒకవేళ మీరు త్వరగా వెళ్తే మీరు వాళ్లను పట్టుకోవచ్చేమో.” అయితే నిజానికి వాళ్లను అటక మీద జనుపకట్టెలో దాచిపెట్టింది.

యెహోషువ 2:1-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నూను కుమారుడైన యెహోషువ వేగులవారైన యిద్దరు మనుష్యులను పిలిపించి–మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి, షిత్తీమునొద్దనుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్లి రాహాబను నొక వేశ్యయింట చేరి అక్కడ దిగగా దేశమును వేగుచూచుటకు ఇశ్రాయేలీయులయొద్దనుండి మనుష్యులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు–నీయొద్దకు వచ్చి నీ యింట చేరిన ఆ మనుష్యులను వెలుపలికి తీసికొనిరమ్ము; వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుష్యులను పంపగా ఆ స్త్రీ ఆ యిద్దరు మనుష్యులను తోడుకొని వారిని దాచిపెట్టి –మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడనుండి వచ్చిరో నేనెరుగను; చీకటిపడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుష్యులు వెలుపలికి వెళ్లిరి, వారెక్కడికిపోయిరో నేనెరుగను; మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దెమీదికి ఆ యిద్దరిని ఎక్కించి దానిమీద రాశివేసి యున్న జనుపకట్టెలో వారిని దాచి పెట్టెను.