న్యాయాధిపతులు 7:16-25
న్యాయాధిపతులు 7:16-25 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆ మూడువందల మందిని మూడు గుంపులుగా చేసి, వారందరి చేతుల్లో బూరను ఖాళీ కుండను, ప్రతి కుండలో దివిటీని పెట్టి ఇచ్చాడు. గిద్యోను వారితో, “నన్ను గమనించి వెంబడించండి, నేను దండును సమీపించినప్పుడు నేను చేసినట్లే మీరూ చేయండి. నేను, నాతో ఉన్నవారందరు మా బూరలు ఊదినప్పుడు, దండు చుట్టూ ఉన్న మీరు మీ బూరలు ఊదుతూ, ‘యెహోవా కోసం, గిద్యోను కోసం’ అంటూ కేకలు వేయండి.” నడి జాము వేళ మొదటి జాము కావలివారు మారే సమయంలో గిద్యోను, అతనితో ఉన్న వందమంది దండును సమీపించారు. వారు బూరలను ఊది తమ చేతుల్లో ఉన్న కుండలను పగులగొట్టారు. ఆ మూడు గుంపులవారు కూడా తమ బూరలను ఊది కుండలను పగులగొట్టారు. వారి ఎడమ చేతుల్లో దివిటీలను, కుడి చేతుల్లో బూరలను పట్టుకుని, “యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం!” అని కేకలు వేశారు. దండు చుట్టూ ప్రతి మనుష్యుడు తన స్థానంలో ఉండగా మిద్యాను సైన్యం కేకలువేస్తూ పారిపోయింది. మూడువందలమంది బూరలు ఊదినప్పుడు, యెహోవా ఆ దండులోని వారందరు తమ ఖడ్గాలతో ఒకరినొకరు చంపుకొనేలా చేశారు. ఆ సైన్యం సెరేరా వైపు ఉన్న బేత్-షిత్తాకు, తబ్బాతు దగ్గరున్న ఆబేల్-మెహోలా సరిహద్దు వరకు పారిపోయారు. నఫ్తాలి, ఆషేరు, మనష్షే గోత్రాల నుండి పిలువబడిన ఇశ్రాయేలీయులు వచ్చి మిద్యానీయులను తరిమారు. గిద్యోను ఎఫ్రాయిం కొండసీమ దేశమంతటికి దూతలను పంపి, “క్రిందికి రండి, మిద్యానీయులను జయించడానికి వచ్చి బేత్-బారా వరకు యొర్దాను నీళ్లను వారికి ముందున్న స్వాధీనపరచుకోండి” అని చెప్పాడు. కాబట్టి ఎఫ్రాయిం గోత్రికులందరు వచ్చి యొర్దాను నీళ్లను బేత్-బారా వరకు స్వాధీనపరచుకున్నారు. వారు మిద్యాను నాయకుల్లో ఓరేబు, జెయేబు అనే ఇద్దరిని పట్టుకుని ఓరేబు బండ మీద ఓరేబును చంపారు, జెయేబు ద్రాక్షతోట దగ్గర జెయేబును చంపారు. వారు మిద్యానీయులను వెంటాడి, యొర్దాను అవతల ఉన్న గిద్యోను దగ్గరకు ఓరేబు, జెయేబు తలలను తెచ్చారు.
న్యాయాధిపతులు 7:16-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ మూడు వందలమందిని మూడు గుంపులుగా చేశాడు. ఒక్కొక్కరి చేతికి ఒక బూర, ఒక ఖాళీ కుండ, ఆ కుండలో ఒక దివిటీని ఇచ్చి, వాళ్లతో ఇలా అన్నాడు “నన్ను చూసి, నేను చేసినట్టు చేయండి. చూడండి! నేను వాళ్ల శిబిరం మీదకి వెళ్తున్నాను. నేను చేసినట్టే మీరూ చెయ్యాలి. నేను, నాతో ఉన్నవాళ్ళందరు బూరలను ఊదేటప్పుడు మీరు కూడా ఆ శిబిరం చుట్టూ బూరలు ఊదుతూ, ‘యెహోవాకు, గిద్యోనుకు, జయం’ అని కేకలు వెయ్యాలి” అని చెప్పాడు. కాబట్టి, అర్దరాత్రి కాపలా కాసేవారు కాపలా సమయం మారుతూ ఉన్నప్పుడు, గిద్యోను, అతనితో ఉన్న వందమంది, శిబిరం చివరకూ వెళ్లి, బూరలు ఊది, వాళ్ళ చేతుల్లో ఉన్న కుండలు పగులగొట్టారు. అలా ఆ మూడు గుంపులవాళ్ళు బూరలు ఊదుతూ ఆ కుండలు పగులగొట్టి, ఎడమ చేతుల్లో దివిటీలు, కుడి చేతుల్లో ఊదడానికి బూరలు పట్టుకుని “యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం” అని కేకలు వేశారు. వాళ్లలో ప్రతివాడూ తన స్థలం లో శిబిరం చుట్టూ నిలబడి ఉన్నప్పుడు ఆ సైనికులు అందరూ కేకలు వేస్తూ పారిపోయారు. ఆ మూడు వందలమంది బూరలు ఊదినప్పుడు యెహోవా, ఆ శిబిరం అంతటిలో ప్రతి వాని కత్తి తన ప్రక్కన ఉన్న వాని మీదకి తిప్పాడు. ఆ సైన్యం సెరేరాతు వైపు ఉన్న బేత్షిత్తా వరకూ, తబ్బాతు దగ్గర ఉన్న ఆబేల్మెహోలా తీరం వరకూ పారిపోయినప్పుడు, నఫ్తాలి గోత్రంలో నుంచి, ఆషేరు గోత్రంలో నుంచి, మనష్షే గోత్రమంతటిలో నుంచి, పిలుచుకు వచ్చిన ఇశ్రాయేలీయులు కలిసి మిద్యానీయులను తరిమారు. గిద్యోను ఎఫ్రాయిమీయుల ఎడారి ప్రాంతం అంతటా వేగులను పంపి “మిద్యానీయులను ఎదుర్కోడానికి రండి. బేత్బారా వరకూ వాగులను, యొర్దాను నది, వాళ్లకంటే ముందుగా స్వాధీనం చేసుకోండి” అని ముందే చెప్పాడు కాబట్టి ఎఫ్రాయిమీయులంతా కూడుకుని బేత్బారా వరకూ వాగులను యొర్దానును స్వాధీనపరచుకున్నారు. వాళ్ళు మిద్యాను అధిపతులైన ఓరేబు జెయేబు అనే ఇద్దరిని పట్టుకుని, ఓరేబు బండమీద ఓరేబును చంపారు. జెయేబు ద్రాక్షల తొట్టి దగ్గర జెయేబును చంపి, మిద్యానీయులను తరుముకుంటూ వెళ్ళారు. ఓరేబు, జెయేబుల తలలు యొర్దాను అవతల ఉన్న గిద్యోను దగ్గరికి తెచ్చారు.
న్యాయాధిపతులు 7:16-25 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు గిద్యోను మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసాడు. ఒక్కో మనిషికీ ఒక్కో బూరను, ఒక్కో ఖాళీ కుండనూ గిద్యోను ఇచ్చాడు. ప్రతి ఖాళీ కుండలోను మండుతున్న ఒక దివిటీ ఉంది. అప్పుడు గిద్యోను వారితో ఇలా చెప్పాడు: “నన్ను గమనించి నేను చేసినట్టు చేయండి. శత్రువు విడిది చివరి భాగం వరకు నన్ను అనుసరించండి. నా వెంబడి రండి. ఆ విడిది చివరి భాగానికి నేను వెళ్లగానే, సరిగ్గా నేను చేసినట్టే చేయండి. మీరు శత్రువు విడిదిని చుట్టుముట్టండి. నేనూ, నాతో ఉన్న వాళ్లందరూ బూరలు ఊదుతాము. మేము బూరలు ఊదినప్పుడు మీరు కూడా మీ బూరలు ఊదండి. అప్పుడు ‘యెహోవాకు, గిద్యోనుకు విజయం అని కేకలు వేయండి!’” కనుక గిద్యోను, అతనితో ఉన్న వంద మంది మనుష్యులు వారి శత్రువుల విడిది చివరి భాగానికి వెళ్లారు. కావలి వారు మారిన వెంటనే వారు అక్కడికి వచ్చారు. అది నడిజాము వేళ. గిద్యోను, అతనితో ఉన్న మనుష్యులు వారి బూరలు ఊది, వారి కుండలు పగులగొట్టారు. అప్పుడు గిద్యోను మనుష్యులు మొత్తం మూడు గుంపులవారు వారి బూరలు ఊది వారి కుండలు పగులగొట్టారు. ఆ మనుష్యులు దివిటీలను వారి ఎడమ చేతులలోను, బూరలు వారి కుడిచేతులలోను పట్టుకొన్నారు. ఆ మనుష్యులు వారి బూరలు ఊదుతూ, “యెహోవాకు ఒక ఖడ్గం, గిద్యోనుకు ఒక ఖడ్గం” అని కేకలు వేసారు. గిద్యోను మనుష్యులు వారు ఉన్న చోటనే నిలబడ్డారు. కాని ఆ విడిదిలో మిద్యాను వారు కేకలు వేస్తూ పారిపోవటం మొదలుపెట్టారు. గిద్యోను మూడు వందల మంది మనుష్యులు వారి బూరలు ఊదటం మొదలు పెట్టగానే మిద్యాను మనుష్యులు వారి కత్తులతో వారే ఒకర్నొకరు చంపుకొనేట్టు యెహోవా చేశాడు. సెరేరాతు పట్టణం వైపు ఉన్న బేత్షిత్తా పట్టణానికి శత్రుసైన్యం వాళ్లు పారిపోయారు. తబ్బాతు పట్టణం దగ్గర ఉన్న ఆబేల్మెహోలా పట్టణ సరిహద్దు వరకు ఆ మనుష్యులు పారిపోయారు. అప్పుడు నఫ్తాలి, ఆషేరు, మొత్తం మనష్షే వంశాల నుండి వచ్చిన సైనికులు మిద్యాను ప్రజలను తరమవలసిందిగా ఆజ్ఞాపించబడ్డారు. ఎఫ్రాయిము కొండ దేశమంతటికీ గిద్యోను వార్తాహరులను పంపించాడు. “దిగి వచ్చి మిద్యాను ప్రజలను ఎదుర్కొనండి. వీరిని బేత్బారా వరకూ తరిమి, నదిని అదుపు చేసి, యోర్దాను నదిని స్వాధీనం చేసుకోండి. మిద్యాను ప్రజలు అక్కడికి చేరక ముందే ఈ పని చేయండి” అని వార్తాహరులు చెప్పారు. కనుక ఎఫ్రాయిము వంశంలోని మనుష్యులందరినీ వారు పిలిచారు. బేత్బారా వరకు వారు నదిని స్వాధీనం చేసుకున్నారు. మిద్యాను నాయకులు ఇద్దరిని ఎఫ్రాయిము మనుష్యులు పట్టుకున్నారు. ఈ ఇద్దరు నాయకుల పేర్లు ఓరేబు, జెయేబు, ఓరేబు బండ అనుచోట ఎఫ్రాయిము మనుష్యులు ఓరేబును చంపివేసారు. జెయేబు ద్రాక్షగానుగ అనుచోట వారు జెయేబును చంపివేసారు. ఎఫ్రాయిము మనుష్యులు మిద్యాను వారిని ఇంకా తరుముతూనే ఉన్నారు. కానీ మొదట ఓరేబు, జెయేబు తలలను వారు నరికివేసి ఆ తలలను గిద్యోను వద్దకు తీసుకుని వెళ్లారు. ప్రజలు యోర్దాను నదిని దాటేచోట గిద్యోను ఉన్నాడు.
న్యాయాధిపతులు 7:16-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆ మూడువందలమందిని మూడు గుంపులుగా చేసి బూరను వట్టికుండను ఆకుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనెను–నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి; ఇదిగో నేను వారి దండు కొట్టకొనకు పోవుచున్నాను, నేను చేయునట్లు మీరు చేయవలెను. నేనును నాతో నున్నవారందరును బూరలను ఊదునప్పుడు మీరును దండు పాళెమంతటిచుట్టు బూరలను ఊదుచు–యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయ వలెనని చెప్పెను. అట్లు నడిజాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న నూరుమందియు దండుపాళెము కొట్టకొనకు పోయి బూరలను ఊది తమ చేతులలోనున్నకుండలను పగులగొట్టిరి. అట్లు ఆ మూడు గుంపులవారు బూరలను ఊదుచు ఆకుండలను పగులగొట్టి, యెడమచేతులలో దివిటీలను కుడిచేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని–యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలువేసిరి. వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టు నిలిచియుండగా ఆ దండువారందరును పరుగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి. ఆ మూడువందలమంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి త్రిప్పెను. దండు సెరేరాతువైపున నున్న బేత్షిత్తావరకు తబ్బాతునొద్దనున్న ఆబేల్మెహోలా తీరమువరకు పారిపోగా నఫ్తాలి గోత్రములోనుండియు, ఆషేరు గోత్రములోనుండియు, మనష్షే గోత్రమంతటిలోనుండియు పిలిపింపబడిన ఇశ్రాయేలీయులు కూడుకొని మిద్యానీయులను తరిమిరి. గిద్యోను ఎఫ్రాయిమీయుల మన్యదేశమంతటికిని దూతలను పంపి–మిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి, బేత్బారావరకు వాగులను యొర్దానును వారికంటెముందుగా పట్టుకొనుడని చెప్పియుండెను గనుక, ఎఫ్రాయిమీయులందరు కూడుకొని బేత్బారావరకు వాగులను యొర్దానును పట్టుకొనిరి. మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జెయేబు అను ఇద్దరిని పట్టుకొని, ఓరేబు బండమీద ఓరే బును చంపిరి, జెయేబు ద్రాక్షల తొట్టియొద్ద జెయేబును చంపి మిద్యానీయులను తరుముకొనిపోయిరి. ఓరేబు జెయేబుల తలలను యొర్దాను అవతలికి గిద్యోనునొద్దకు తెచ్చిరి.