గలతీయులకు 4:21-31

గలతీయులకు 4:21-31 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఒక్క మాట చెప్పండి, ధర్మశాస్త్రానికే లోబడి ఉండాలనుకునే మీకు ధర్మశాస్త్రం ఏమి చెప్తుందో తెలియదా? వ్రాయబడి ఉన్న ప్రకారం, అబ్రాహాముకు ఇద్దరు కుమారులు, ఒకడు దాసియైన స్త్రీ వలన, మరొకడు స్వతంత్రురాలైన స్త్రీ వలన పుట్టారు. దాసియైన స్త్రీ వలన పుట్టిన కుమారుడు శరీరానుసారంగా పుట్టాడు, స్వతంత్రురాలైన స్త్రీ వలన పుట్టిన కుమారుడు దైవిక వాగ్దాన ఫలితంగా పుట్టాడు. ఈ విషయాలను ఉపమానరీతిగా చెప్పవచ్చు. ఈ స్త్రీలు రెండు నిబంధనలను సూచిస్తున్నారు. ఒక నిబంధన సీనాయి పర్వతం దగ్గరిది, ఇది హాగరు: బానిసలుగా ఉండడానికి పిల్లలను కంటుంది. హాగరు అరేబియాలో ఉన్న సీనాయి పర్వతాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం ఉన్న యెరూషలేము పట్టణంలా ఆమె తన పిల్లలతో సహా బానిసత్వంలో ఉంది. కాని పైనుండి వచ్చే యెరూషలేము స్వతంత్రమైనది, ఆమె మనకు తల్లి. అయితే వ్రాయబడిన ప్రకారం, “గొడ్రాలా, పిల్లలు కననిదానా, ఆనందించు; ప్రసవవేదన పడనిదానా, ఆనందంతో కేకలు వేయి; ఎందుకంటే, భర్త ఉన్నదాని పిల్లలకంటే విడిచిపెట్టబడిన స్త్రీ పిల్లలు ఎక్కువమంది ఉన్నారు.” అయితే సహోదరీ సహోదరులారా, మీరు ఇస్సాకులా వాగ్దానం ద్వారా పుట్టిన పిల్లలు. ఆ సమయంలో శరీరానుసారమైన కుమారుడు ఆత్మానుసారమైన కుమారుని ఎలా హింసించాడో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. అయితే లేఖనం ఏమి చెప్తుంది? “దాసిని ఆమె కుమారున్ని పంపివేయి, దాసి కుమారుడు ఎప్పటికీ స్వతంత్రురాలైన స్త్రీ కుమారునితో వారసత్వం పంచుకోలేడు” అని చెప్తుంది. కాబట్టి సహోదరీ సహోదరులారా, మనం దాసురాలైన స్త్రీ పిల్లలం కాదు, గాని స్వతంత్రురాలైన స్త్రీ పిల్లలము.

గలతీయులకు 4:21-31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ధర్మశాస్త్రానికి లోబడి ఉండాలని కోరే వారంతా నాకో మాట చెప్పండి-మీరు ధర్మశాస్త్రం చెప్పేది వినడం లేదా? దాసి వలన ఒకడు, స్వతంత్రురాలి వలన ఒకడు, ఇద్దరు కొడుకులు అబ్రాహాముకు కలిగారని రాసి ఉంది గదా? అయినా దాసి వలన పుట్టినవాడు శరీర రీతిగా పుట్టాడు. స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దాన మూలంగా పుట్టాడు. ఈ విషయాలను అలంకార రూపంలో చెప్పవచ్చు. ఈ స్త్రీలు రెండు నిబంధనలు. వాటిలో ఒకటి సీనాయి పర్వతానికి సంబంధించి బానిసత్వంలో ఉండడానికి పిల్లలను కంటుంది. ఇది హాగరు. ఈ హాగరు అరేబియా ప్రాంతంలో ఉన్న సీనాయి కొండ. ప్రస్తుతం ఉన్న యెరూషలేము దాని పిల్లలతో కూడ బానిసత్వంలో ఉంది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది. ఆమె మనకు తల్లి. “గొడ్రాలా, పిల్లలను కననిదానా, ఆనందించు. ప్రసవ వేదన పడనిదానా, ఆనందంతో కేకలు పెట్టు. ఎందుకంటే, భర్త ఉన్న ఆమె పిల్లల కంటే భర్త లేని దాని పిల్లలు ఎక్కువమంది ఉన్నారు” అని రాసి ఉంది. సోదరులారా, మీరు కూడా ఇస్సాకు లాగా వాగ్దానం ప్రకారం పుట్టిన కొడుకులుగా ఉన్నారు. అప్పుడు శరీరాన్ని బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణ్ణి ఎలా హింస పెట్టాడో ఇప్పుడు కూడా ఆలాగే జరుగుతున్నది. అయితే లేఖనం ఏమి చెబుతున్నది? “దాసిని, ఆమె కొడుకుని వెళ్ళగొట్టు. దాసి కొడుకు స్వతంత్రురాలి కొడుకుతో పాటు వారసుడుగా ఉండడు.” అందుచేత, సోదరులారా, మనం స్వతంత్రురాలి కొడుకులమే గాని దాసి కొడుకులం కాదు.

గలతీయులకు 4:21-31 పవిత్ర బైబిల్ (TERV)

ధర్మశాస్త్రం చెప్పినట్లు నడుచుకోవాలని అనుకొన్న మీకు ధర్మశాస్త్రం ఏమి చెపుతుందో తెలియదా? అబ్రాహాముకు ఇద్దరు పుత్రులని, ఒకడు బానిస స్త్రీకి జన్మించాడని, మరొకడు స్వంత స్త్రీకి జన్మించాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి వుంది. బానిస స్త్రీ వల్ల అతనికి జన్మించిన కుమారుడు ప్రకృతి సిద్ధంగా జన్మించాడు. కాని స్వంత స్త్రీకి జన్మించిన వాడు వాగ్దానం వల్ల జన్మించాడు. ఈ వృత్తాంతం అలంకారికంగా చెప్పబడింది. ఆ యిరువురు స్త్రీలు రెండు ఒడంబడికలతో పోల్చబడ్డారు. సీనాయి పర్వతం మీద నుండి ఒక ఒడంబడిక వచ్చింది. దీని వల్ల జన్మించిన వాళ్ళు బానిసలు కావాలని ఉంది. “హాగరు” ను ఆ మొదటి ఒడంబడికతో పోల్చవచ్చును. అరేబియాలో ఉన్న సీనాయి పర్వతంతో కూడా “హాగరు” ను పోల్చవచ్చు. ఆమెను ప్రస్తుతం యెరూషలేముతో పోల్చవచ్చు. ఎందుకంటే ఆ పట్టణపు ప్రజలు కూడా ఆమె సంతానంలా బానిసలు. కాని పరలోకంలో ఉన్న యెరూషలేము స్వతంత్రమైంది. అది మన తల్లి. దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ఓ గొడ్రాలా! పిల్లల్ని కననిదానా! ఆనందించు, పురిటి నొప్పులు పడనిదానా! గట్టిగా కేకలు వేయి! ఎందుకనగా భర్త వున్న స్త్రీకన్నా భర్త లేని స్త్రీకి పిల్లలు ఎక్కువ.” కనుక సోదరులారా! మీరు ఇస్సాకువలే వాగ్దానపు పిల్లలుగా జన్మించలేదు. ఆనాడు ప్రకృతి సిద్ధంగా జన్మించిన కుమారుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించిన కుమారుణ్ణి హింసించాడు. ఈనాడు కూడా అదే జరుగుతోంది. కాని ధర్మశాస్త్రం ఏమి చెపుతున్నది? “బానిస స్త్రీ కుమారుడు, స్వంత స్త్రీకి జన్మించిన కుమారునితో ఆస్తి పంచుకోలేడు. కనుక ఆ బానిస స్త్రీని, ఆమె కుమారుణ్ణి బయటికి తరిమివేయండి” అని వ్రాయబడి ఉంది. సోదరులారా! మనము స్వంత స్త్రీకి జన్మించిన బిడ్డలం. బానిస స్త్రీకి జన్మించిన బిడ్డలం కాము.

గలతీయులకు 4:21-31 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ధర్మశాస్త్రమునకు లోబడియుండగోరువారలారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి. దాసివలన ఒకడును స్వతంత్రురాలివలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రాహామునకు కలిగిరని వ్రాయబడియున్నది గదా? అయినను దాసివలన పుట్టినవాడు శరీరప్రకారము పుట్టెను, స్వతంత్రురాలివలన పుట్టినవాడు వాగ్దానమునుబట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడియున్నవి. ఈ స్త్రీలు రెండు నిబంధనలై యున్నారు; వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును; ఇది హాగరు. ఈ హాగరు అనునది అరేబియాదేశములో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతోకూడ దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటయియున్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; అది మనకు తల్లి. ఇందుకు– కనని గొడ్రాలా సంతోషించుము, ప్రసవవేదనపడని దానా, బిగ్గరగా కేకలువేయుము; ఏలయనగా పెనిమిటిగలదాని పిల్లలకంటె పెనిమిటి లేనిదాని పిల్లలు ఎక్కువమంది ఉన్నారు అని వ్రాయబడియున్నది. సహోదరులారా, మనమును ఇస్సాకువలె వాగ్దానమునుబట్టి పుట్టిన కుమారులమై యున్నాము. అప్పుడు శరీరమునుబట్టి పుట్టినవాడు ఆత్మ నుబట్టి పుట్టినవానిని ఏలాగు హింసపెట్టెనో యిప్పుడును ఆలాగే జరుగుచున్నది. ఇందునుగూర్చి లేఖన మేమి చెప్పుచున్నది?– దాసిని దాని కుమారుని వెళ్లగొట్టుము, దాసి కుమా రుడు స్వతంత్రురాలి కుమారునితోపాటు వార సుడై యుండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమా రులమే గాని దాసి కుమారులము కాము.