ద్వితీయోపదేశకాండము 32:1-20
ద్వితీయోపదేశకాండము 32:1-20 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆకాశాల్లారా, ఆలకించండి, నేను మాట్లాడతాను; భూమీ, నా నోటి మాటలు విను. నా ఉపదేశం వర్షంలా కురుస్తుంది నా మాటలు మంచు బిందువుల్లా దిగుతాయి, లేతగడ్డి మీద జల్లులా, లేత మొక్కల మీద సమృద్ధి వర్షంలా ఉంటుంది. నేను యెహోవా నామాన్ని ప్రకటిస్తాను. మన దేవుని గొప్పతనాన్ని స్తుతించండి! ఆయన మనకు ఆశ్రయదుర్గం, ఆయన పనులు పరిపూర్ణం, ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి. ఆయన తప్పుచేయని నమ్మదగిన దేవుడు, ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు. ఆయన ప్రజలు అవినీతిపరులు, వారు ఆయన పిల్లలు కారు; వారి అవమానం పొందిన మూర్ఖులైన వక్ర తరం వారు. అవివేకులైన తెలివితక్కువ ప్రజలారా, యెహోవాకు మీరు తిరిగి చెల్లించే విధానం ఇదేనా? మిమ్మల్ని చేసిన, మిమ్మల్ని రూపించిన, మీ తండ్రి, మీ సృష్టికర్త ఆయన కాడా? పాత రోజులను జ్ఞాపకముంచుకోండి; గత తరాలను గురించి ఆలోచించండి. తండ్రిని అడగండి, ఆయనే మీకు చెప్తారు, మీ పెద్దలను అడగండి, వారే మీకు వివరిస్తారు. మహోన్నతుడు జనాంగాలకు వారి వారి వారసత్వాలను ఇచ్చినప్పుడు, సర్వ మనుష్యజాతిని విభజించినప్పుడు, ఇశ్రాయేలు కుమారుల సంఖ్య ప్రకారం జనములకు ఆయన సరిహద్దులు ఏర్పరిచారు. యెహోవా ప్రజలే ఆయన భాగం, యాకోబు ఆయనకు కేటాయించబడిన వారసత్వము. ఆయన అతన్ని ఎడారి ప్రదేశంలో, శబ్దాలు వినబడే బంజరు భూమిలో కనుగొన్నారు. తన గూడును కదిలించి, తన పిల్లల పైగా అల్లాడుతూ ఉండే, వాటిని పైకి తీసుకెళ్లడానికి దాని రెక్కలు చాపి వాటిని పైకి మోసుకెళ్లే గ్రద్దలా, ఆయన అతన్ని చుట్టూ ఆవరించి సంరక్షిస్తూ, తన కనుపాపలా ఆయన అతన్ని కాపాడారు. యెహోవా ఒక్కడే అతన్ని నడిపించారు; ఏ ఇతర దేవుడు అతనితో ఉండలేదు. ఆయన అతన్ని ఎత్తైన స్థలాలపైకి ఎక్కించారు పొలాల పంటను అతనికి తినిపించారు. బండ నుండి తీసిన తేనెతో, రాళ్లమయమైన పర్వత శిఖరం నుండి తీసిన నూనెతో అతన్ని పోషించారు, ఆవు పెరుగును, గొర్రెల, మేకల పాలను, గొర్రెపిల్లల క్రొవ్వును, మేకపోతులను, పశువుల మంద, గొర్రెల మంద నుండి పెరుగు, పాలతో క్రొవ్విన గొర్రెపిల్లలను, మేకలను, బాషాను శ్రేష్ఠమైన పొట్టేళ్లను నాణ్యమైన గోధుమలను మీకిచ్చారు. మీరు ద్రాక్షరసంతో చేసిన మద్యాన్ని త్రాగారు. యెషూరూను క్రొవ్వుపట్టి కాలు జాడించాడు; తిండి ఎక్కువై, వారు బలిసి మొద్దులయ్యారు. వారు తమను చేసిన దేవున్ని విసర్జించి రక్షకుడైన తమ ఆశ్రయ దుర్గాన్ని తృణీకరించారు. వారు ఇతర దేవుళ్ళ వల్ల ఆయనకు రోషం పుట్టించారు, వారి అసహ్యకరమైన విగ్రహాలతో ఆయనకు కోపం కలిగించారు. దేవుడు కాని దయ్యాలకు వారు బలులర్పించారు తమకు తెలియని దేవుళ్ళకు, క్రొత్తగా వచ్చిన దేవుళ్ళకు, మీ పూర్వికులు లెక్కచెయ్యని దేవుళ్ళకు మ్రొక్కారు. మీకు తండ్రిగా ఉన్న ఆశ్రయ దుర్గాన్ని మీరు విడిచిపెట్టారు; మీకు జన్మనిచ్చిన దేవుని మీరు మరచిపోయారు. యెహోవా ఇది చూసి వారిని తృణీకరించారు, ఎందుకంటే ఆయన తన కుమారులు కుమార్తెల వల్ల కోప్పడ్డారు. “నేను వారి నుండి నా ముఖాన్ని దాచుకుంటాను, వారి అంతం ఎలా ఉంటుందో చూస్తాను; ఎందుకంటే వారొక దుర్బుద్ధి కలిగిన తరం, నమ్మకద్రోహులైన పిల్లలు.
ద్వితీయోపదేశకాండము 32:1-20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆకాశమా! నేను చెప్పేది విను! నన్ను మాట్లాడనియ్యి. భూగోళమా, నా నోటి మాటలు ఆలకించు. నా ఉపదేశం వానలా కురుస్తుంది. నా మాటలు మంచు బిందువుల్లా, లేతగడ్డిపై పడే చినుకుల్లా, పచ్చికపై కురిసే చిరుజల్లులా, మొక్కలపై కురిసే జల్లులా ఉంటాయి. నేను యెహోవా పేరును ప్రకటిస్తాను. మన దేవునికి ఘనత ఆపాదించండి. ఆయన మనకు ఆశ్రయ దుర్గం. ఆయన పని పరిపూర్ణం. ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన పక్షపాతం చూపని దేవుడు. ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు. వారు తమను తాము చెడగొట్టుకున్నారు. వారు ఆయన సంతానం కారు. వారు దోషులు, మూర్ఖులైన వక్రతరం. బుద్ధి, ఇంగితం లేని మనుషులారా, యెహోవాకు ఇదా మీరిచ్చే కానుక? ఆయన మీ తండ్రి కాడా? ఆయనే గదా మిమ్మల్ని పుట్టించి స్థిరపరచింది? గతించిన కాలాన్ని గుర్తుకు తెచ్చుకోండి. తరతరాల సంవత్సరాల సంగతులను తలపోయండి. మీ తండ్రిని అడుగు, అతడు నీకు చూపిస్తాడు. పెద్దలను అడుగు, వాళ్ళు నీకు చెబుతారు. మహోన్నతుడు ప్రజలకు వారి వారి వారసత్వాలను పంచి ఇచ్చినప్పుడు, మానవ జాతులను వేరు పరచినపుడు, ఇశ్రాయేలు ప్రజల లెక్క ప్రకారం ప్రజలకు హద్దులు నియమించాడు. యెహోవా వంతు ఆయన ప్రజలే. ఆయన వారసత్వం యాకోబు సంతానమే. ఆయన ఆ ప్రజను ఎడారి ప్రదేశంలో కనుగొన్నాడు. బీడు భూమిలో, భీకరమైన శబ్దాలు ఉన్న నిర్జన ప్రదేశంలో అతణ్ణి రక్షించి ఆదుకున్నాడు. తన కనుపాపలా అతణ్ణి కాపాడాడు. గద్ద తన గూడు రేపి తన పిల్లలపై ఎగురుతూ రెక్కలు చాపుకుని ఆ పిల్లలను రెక్కల మీద మోసినట్టు యెహోవా చేశాడు. యెహోవా ఒక్కడే ఆ ప్రజలకు దారి చూపుతున్నాడు. వేరే దేవుళ్ళెవరూ ఆయనకు సాటిరారు. లోకంలో ఉన్నత స్థలాలపై ఆ ప్రజలను ఎక్కించాడు. పొలాల పంటలు వారికి తినిపించాడు. కొండబండల తేనెతో, చెకుముకి రాతిబండ నూనెతో వారిని తృప్తిపరిచాడు. ఆవు మజ్జిగను, గొర్రెల, మేకల పాలనూ, గొర్రెపిల్లల కొవ్వునూ, బాషాను పొట్టేళ్లను, మేకపోతులనూ, శ్రేష్ఠమైన గోదుమ పిండినీ మీకిచ్చాడు. మంచి ద్రాక్షరసంతో చేసిన మద్యం మీరు తాగారు. యెషూరూను కొవ్వి కాలు దువ్వాడు, మీరు కొవ్వుతో బలిసి మొద్దులాగా అయ్యారు. యెషూరూను తనను పుట్టించిన దేవుణ్ణి వదిలేశాడు. తన రక్షణ శిలను నిరాకరించాడు. వారు ఇతర దేవుళ్ళను అనుసరించి ఆయనకు రోషం పుట్టించారు. అసహ్యమైన విగ్రహాలు పెట్టుకుని ఆయనకు కోపం తెప్పించారు. వారు దేవత్వం లేని దయ్యాలకు బలులు అర్పించారు. తమకు తెలియని దేవుళ్ళకూ, కొత్తగా పుట్టుకొచ్చిన దేవుళ్ళకూ, మీ పితరులు భయపడని దేవుళ్ళకూ బలులర్పించారు. నీకు తండ్రి లాంటి బండను వదిలేశావు, నిన్ను కన్న దేవుణ్ణి మరిచావు. యెహోవా దీన్ని చూసి వాళ్ళని వదిలేశాడు, తన కొడుకులూ కూతుర్లూ ఆయన్నలా రేపారు. ఆయనిలా అన్నాడు. “వారికి నా ముఖాన్ని దాచు కుంటాను. వాళ్ళ అంతం ఎలా ఉంటుందో చూస్తాను. వాళ్ళు మొండి తరం, విశ్వసనీయత లేని పిల్లలు.
ద్వితీయోపదేశకాండము 32:1-20 పవిత్ర బైబిల్ (TERV)
“ఆకాశములారా ఆలకించండి, నేను మాట్లాడుతాను. భూమి నానోటి మాటలు వినునుగాక! నా ప్రబోధం వర్షంలా పడుతుంది, నా ఉపన్యాసం మంచులా ప్రవహిస్తుంది, మెత్తటి గడ్డిమీద పడే జల్లులా ఉంటుంది. కూరమొక్కల మీద వర్షంలా ఉంటుంది. యెహోవా నామాన్ని నేను ప్రకటిస్తా! దేవుణ్ణి స్తుతించండి! “ఆయన ఆశ్రయ దుర్గంలో ఉన్నాడు ఆయన పని పరిపూర్ణం! ఎందుకంటే ఆయన మార్గాలన్నీ సరైనవిగనుక. ఆయన సత్యవంతుడు నమ్ముకోదగ్గ దేవుడు. ఆయన చేసేది మంచిది, సరియైనది కూడా. మీరు నిజంగా ఆయన పిల్లలు కారు. మీతప్పుల మూలంగా మీరు ఆయనను సమీపించలేని అపవిత్రులయ్యారు. మీరు వంకర మనుష్యులు, అబద్ధీకులు. యెహోవాకు మీరు చెల్లించవలసిన కృతజ్ఞత ఇదేనా? మీరు బుద్ధిహీనులు, అజ్ఞానులు, యెహోవా మీ తండ్రి, ఆయన మిమ్మల్ని చేసాడు. ఆయనే మీ సృష్టికర్త. ఆయన మిమ్మల్ని బల పరచేవాడు. “పాత రోజులు జ్ఞాపకం చేసుకోండి, అనేక తరాల సంవత్సరాలను గూర్చి ఆలోచించండి. మీ తండ్రిని అడగండి, ఆయన చెబుతాడు; మీ నాయకుల్ని అడగండి, వాళ్లు మీకు చెబుతారు. రాజ్యాలకు వారి దేశాన్ని సర్వోన్నతుడైన దేవుడు యిచ్చాడు. ప్రజలు ఎక్కడ నివసించాల్సిందీ ఆయనే నిర్ణయించాడు. తర్వాత ఆయన ఇతరుల దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు యిచ్చాడు. ఆయన ప్రజలే యెహోవా వంతు; యాకోబు (ఇశ్రాయేలు) యెహోవాకు స్వంతం. “అరణ్య భూమిలో యాకోబును (ఇశ్రాయేలు) యెహోవా కనుగొన్నాడు, వేడి గాడ్పుల్లో కేకలు పెట్టే పనికిమాలిన అరణ్యంలో యెహోవా యాకోబు దగ్గరకు వచ్చి, ఆతణ్ణి గూర్చి జాగ్రత్త తీసుకున్నాడు. యెహోవా తన కంటి పాపలా ఆతడ్ని కాపాడాడు. యెహోవా ఇశ్రాయేలీయులకు పక్షి రాజులా ఉన్నాడు. పక్షిరాజు తన పిల్లలకు ఎగరటం నేర్పించేందుకోసం అది వాటిని బయటకు తోస్తుంది. అది తన పిల్లలను కాపాడేందుకు వాటితో కలిసి ఎగురుతుంది. అవి పడిపోతున్నప్పుడు వాటిని పట్టుకొనేందుకు తన రెక్కలు చాపుతుంది. మరియు అది తన రెక్కల మీద వాటిని క్షేమ స్థలానికి మోసుకొని వెళ్తుంది. యెహోవా అలాగే ఉన్నాడు. యెహోవా మాత్రమే యాకోబును (ఇశ్రాయేలు) నడిపించాడు. యాకోబు దగ్గర ఇతర దేవతలు లేవు. భూమియొక్క ఉన్నత స్థలాల్లో యాకోబును యెహోవా నడిపించాడు, పొలంలోని పంటను యాకోబు భుజించాడు యాకోబు బండలోనుండి తేనెను చెకుముకి రాతినుండి నూనెను తాగేటట్టు యెహోవా చేసాడు. మందలోనుండి వెన్న, గొర్రెలనుండి పాలు గొర్రెపిల్లలు, పొట్టేళ్లు, బాషాను జాతి మగ మేకలు, అతి శ్రేష్ఠమైన గోధుమలు ఆయన నీకు యిచ్చాడు. ద్రాక్షల ఎర్రటిరసం నుండి ద్రాక్షారసం నీవు త్రాగావు. “కానీ యెష్రూను కొవ్వు పట్టి బలిసిన ఎద్దులా తన్నుతన్నాడు. వాడు బాగా తిని బలిసాడు. వానికి మంచి పోషణ దొరికింది. వాడు తనను చేసిన దేవుణ్ణి విడిచిపెట్టేసాడు. వాడు ఆ బండను (యెహోవాను) తన రక్షకునిగా అంగీకరించలేదు. యెహోవా ప్రజలు యితర దేవుళ్లను పూజించి ఆయనకు రోషం పుట్టించారు. యెహోవాకు అసహ్యమైన వారి విగ్రహాల మీద ఆయనకు కోపం వచ్చేటట్లు వారు చేసారు. నిజానికి దేవుళ్లు కాని దయ్యాలకు వారు బలులు అర్పించారు. వాళ్లకు తెలియని దేవుళ్లకు వారు బలులు అర్పించారు. ఈ దేవుళ్లు మీ పూర్వీకులు ఎన్నడూ పూజించని కొత్త దేవుళ్లు. మిమ్మల్ని సృష్టించిన ఆశ్రయ దుర్గమును (దేవుణ్ణి) మీరు విడిచిపెట్టేసారు. మీకు జీవం ప్రసాదించిన దేవుణ్ణి మీరు మరచిపోయారు. “యెహోవా కుమారులు, కుమార్తెలు ఆయనకు కోపం పుట్టించినందువల్ల ఆయన అది చూచి తన ప్రజలను నిరాకరించాడు. అప్పుడు యెహోవా ఇలా చెప్పాడు, ‘వారినుండి నేను నా ముఖం దాచుకొంటాను. వాళ్ల అంతం ఏమిటో నేను చూడగలను. ఎందుకంటే వారు చాలా చెడ్డ తరంవారు వారు అపనమ్మకమైన పిల్లలు.
ద్వితీయోపదేశకాండము 32:1-20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆకాశమండలమా, చెవినొగ్గుము; నేను మాటలాడుదును భూమండలమా, నా నోటిమాట వినుము. నా ఉపదేశము వానవలె కురియును నా వాక్యము మంచువలెను లేతగడ్డిమీద పడు చినుకులవలెను పచ్చికమీద కురియు వర్షమువలెను ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించెదను మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. వారు తమ్ము చెరుపుకొనిరి; ఆయన పుత్రులుకారు;వారు కళంకులు మూర్ఖతగల వక్రవంశము. బుద్ధిలేని అవివేకజనమా, ఇట్లు యెహోవాకు ప్రతికారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. పూర్వదినములను జ్ఞాపకము చేసికొనుము తరతరముల సంవత్సరములను తలంచుకొనుము నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును; నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభా గించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలీయుల లెక్కనుబట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్యభాగము యాకోబే. అరణ్యప్రదేశములోను భీకరధ్వనిగల పాడైన యెడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను అన్యులయొక్క దేవుళ్లలో ఏ దేవుడును ఆయనతోకూడ ఉండలేదు. భూమియొక్క ఉన్నతస్థలములమీద వాని నెక్కిం చెను పొలముల పంట వానికి తినిపించెను కొండబండనుండి తేనెను చెకుముకి రాతిబండనుండి నూనెను అతనికి జుఱ్ఱించెను. ఆవు మజ్జిగను గొఱ్ఱెమేకల పచ్చిపాలను గొఱ్ఱెపిల్లల క్రొవ్వును బాషాను పొట్టేళ్లను మేకలను గోధుమల మెరికెల సారమును నీకిచ్చెను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షలరసము. యెషూరూను క్రొవ్వినవాడై కాలు జాడించెను నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను తన రక్షణ శైలమును తృణీకరించెను. వారు అన్యుల దేవతలచేత ఆయనకు రోషము పుట్టించిరి హేయకృత్యములచేత ఆయనను కోపింపజేసిరి వారు దేవత్వములేని దయ్యములకు తామెరుగని దేవతలకు క్రొత్తగా పుట్టిన దేవతలకు తమపితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి. నిన్ను కనిన దేవుని మరచితివి. యెహోవా దానిని చూచెను. తన కుమారులమీదను కుమార్తెలమీదను క్రోధపడెను వారిని అసహ్యించుకొనెను. ఆయన ఇట్లనుకొనెను– నేను వారికి విముఖుడనై వారి కడపటిస్థితి యేమగునో చూచెదనువారు మూర్ఖచిత్తముగలవారు విశ్వాసములేని పిల్లలు.