అపొస్తలుల కార్యములు 3:1-12
అపొస్తలుల కార్యములు 3:1-12 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఒక రోజు పేతురు యోహానులు మధ్యాహ్నం మూడు గంటల వేళలో ప్రార్థన సమయానికి దేవాలయానికి వెళ్తున్నారు. సుందరమని పిలువబడే ఆ దేవాలయ గుమ్మం దగ్గర కూర్చుని, ఆవరణంలోనికి వచ్చేవారి దగ్గర భిక్షం అడుక్కోడానికి పుట్టుకతోనే కుంటివాడైన ఒకనిని ప్రతిరోజు కొంతమంది మోసుకొచ్చేవారు. పేతురు యోహానులు ఆ దేవాలయ ఆవరణంలోనికి ప్రవేశిస్తుండగా వాడు చూసి భిక్షమడిగాడు. యోహాను చేసినట్టుగానే, పేతురు వానివైపు సూటిగా చూసి, వానితో, “మా వైపు చూడు!” అన్నాడు. వాడు వారి దగ్గర ఏమైన దొరుకుతుందేమోనని ఆశిస్తూ, వారివైపు దీక్షగా చూశాడు. అప్పుడు పేతురు వానితో, “వెండి బంగారాలు నా దగ్గర లేవు గాని, నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు పేరట లేచి నడువు” అని చెప్పి, వాని కుడిచేయి పట్టుకుని లేపాడు. వెంటనే వాని పాదాలు, చీలమండలాలు బలం పొందుకున్నాయి. వాడు లేచి ఎగిరి తన కాళ్లపై నిలబడి నడవడం మొదలుపెట్టాడు. తర్వాత వాడు నడుస్తూ, గంతులు వేస్తూ, దేవుని స్తుతిస్తూ వారితో పాటు దేవాలయ ఆవరణంలోనికి వెళ్లాడు. ప్రజలందరు అతడు నడుస్తూ దేవుని స్తుతిస్తున్నాడని చూసి, సుందరమని పిలువబడే ఆ దేవాలయ గుమ్మం దగ్గర కూర్చుని భిక్షమడిగేవాడు వీడే అని గుర్తించి, వానికి జరిగిన దానిని బట్టి విస్మయం చెంది ఆశ్చర్యపడ్డారు. స్వస్థత పొందినవాడు పేతురు యోహానులతో ఉండగా, ప్రజలందరు ఆశ్చర్యపడి, సొలొమోను మండపం అని పిలువబడే చోటికి గుంపులుగా పరుగెత్తుకొని వచ్చారు. అది చూసిన పేతురు వారితో ఈ విధంగా చెప్పాడు: “తోటి ఇశ్రాయేలీయులారా, జరిగింది చూసి ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మేమేదో మా స్వశక్తితోనో లేదా మా భక్తితోనో వీడిని నడిచేలా చేసినట్లు మీరు మా వైపే తదేకంగా చూస్తున్నారేమిటి?
అపొస్తలుల కార్యములు 3:1-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మధ్యాహ్నం మూడు గంటల ప్రార్థన సమయంలో పేతురు, యోహాను దేవాలయానికి వెళ్తూ ఉన్నారు. పుట్టినప్పటి నుండి కుంటివాడుగా ఉన్న ఒకణ్ణి కొందరు ప్రతిరోజూ మోసుకొచ్చి ‘సౌందర్యం’ అనే దేవాలయ ద్వారం దగ్గర ఉంచేవారు. వాడు దేవాలయంలోకి వెళ్ళేవారి దగ్గర బిచ్చమెత్తుకునే వాడు. పేతురు యోహాను దేవాలయంలోకి ప్రవేశిస్తూ ఉండగా వారిని బిచ్చమడిగాడు. పేతురు యోహాను వాడిని తదేకంగా చూస్తూ, “మా వైపు చూడు” అన్నారు. అతడు వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమోనని ఆశించి వారివైపు చూశాడు. అప్పుడు పేతురు, “వెండి బంగారాలు నా దగ్గర లేవు, నాకున్న దాన్నే నీకిస్తాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడువు” అని వాడి కుడి చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. వెంటనే వాని పాదాలూ, చీలమండలూ బలం పొందాయి. వాడు వెంటనే లేచి నడవడం మొదలు పెట్టాడు. నడుస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వారితో పాటు దేవాలయంలోకి వెళ్ళాడు. వాడు నడుస్తూ దేవుణ్ణి కీర్తించడం ప్రజలందరూ చూశారు. ‘సౌందర్యం అనే దేవాలయ ద్వారం దగ్గర అడుక్కోడానికి కూర్చున్నవాడు వీడే’ అని గుర్తుపట్టి, అతనికి జరిగిన దాన్ని చూసి ఆశ్చర్యంలో, విస్మయంలో మునిగిపోయారు. వాడు పేతురు, యోహానులను అంటిపెట్టుకుని ఉండగా చూసిన జనమంతా విస్మయం చెంది, సొలొమోను మంటపంలో ఉన్నవారి దగ్గరికి పరుగెత్తుకు వచ్చారు. పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇలా అన్నాడు, “ఇశ్రాయేలీయులారా, దీని గురించి మీరెందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తితోనో, భక్తితోనో ఇతడు నడిచేలా చేశామన్నట్టు మీరెందుకు మా వైపు అదేపనిగా చూస్తున్నారు?
అపొస్తలుల కార్యములు 3:1-12 పవిత్ర బైబిల్ (TERV)
ఒక రోజు పేతురు, యోహాను పగలు మూడు గంటలప్పుడు మందిరానికి వెళ్తున్నారు. అది ప్రార్థనా సమయం. కొందరు ఒక పుట్టు కుంటివాణ్ణి ప్రతిరోజూ మోసుకొని వెళ్ళి ఒక ద్వారం ముందు దించేవాళ్ళు. దీన్నే సౌందర్య ద్వారం అనేవాళ్ళు. మందిరంలోకి ప్రవేశించేవాళ్ళనుండి ఆ కుంటివాడు భిక్షమెత్తుకొంటూ ఉండేవాడు. ఈ కుంటివాడు పేతురు యోహానులు ఆలయంలోకి ప్రవేశించబోతుండగా చూసి వాళ్ళను భిక్షమడిగాడు. పేతురు అతనివైపు ఏక దృష్టితో చూసాడు. యోహాను కూడా అలాగే చూసాడు. పేతురు ఆ కుంటివానితో, “మా వైపు చూడు!” అని అన్నాడు. ఆ కుంటివాడు వాళ్ళేదైనా యిస్తారని వాళ్ళ వైపు చూసాడు. అప్పుడు పేతురు, “నా దగ్గర వెండి, బంగారాలు లేవు కాని నా దగ్గరున్నదాన్ని నీకిస్తాను. నజరేతు నివాసి యేసు క్రీస్తు పేరిట నడువు!” అని అంటూ, అతని కుడి చేయి పట్టుకొని లేపాడు. వెంటనే ఆ కుంటివాని చీలమండలకు, పాదాలకు బలం వచ్చింది. అతడు గంతేసి నిలబడి నడవటం మొదలు పెట్టాడు. తదుపరి అతడు నడుస్తూ గంతులేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వాళ్ళతో సహా మందిరంలోకి ప్రవేశించాడు. మందిరంలో ఉన్నవాళ్ళంతా అతడు నడవటం, దేవుణ్ణి స్తుతించటం చూసారు. భిక్షమెత్తుకోవటానికి మందిరంలోని సౌందర్య ద్వారం ముందు కూర్చునేవాడు అతడేనని గుర్తించారు. జరిగింది చూసి వాళ్ళు భయపడి దిగ్భ్రాంతి చెందారు. ఆ భిక్షమెత్తుకొనేవాడు పేతురు, యోహానులను అంటిపెట్టుకొని ఉన్నాడు. ప్రజల్లో కలిగిన ఆశ్చర్యం తగ్గలేదు. వాళ్ళు సొలొమోను మంటపంలో ఉన్న పేతురు, యోహానుల దగ్గరకు పరుగెత్తుకొంటూ వెళ్ళారు. పేతురు వాళ్ళను చూసి ఈ విధంగా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలారా! ఇది మీకెందుకు ఆశ్చర్యం కలిగిస్తోంది? మేము మా స్వశక్తితో లేక మా మంచితనంతో యితణ్ణి నడిపించినట్లు మావైపు అంత దీక్షతో ఎందుకు చూస్తున్నారు?
అపొస్తలుల కార్యములు 3:1-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
పగలు మూడు గంటలకు ప్రార్థనకాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్లుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక మనుష్యుడు మోసికొనిపోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్లువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింప బోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి–మాతట్టు చూడుమనిరి. వాడు వారియొద్ద ఏమైన దొరుకునని కనిపెట్టుచు వారియందు లక్ష్యముంచెను. అంతట పేతురు–వెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీ కిచ్చుచున్నాను; నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడిచెయ్యి పట్టుకొని లేవ నెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను; నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితోకూడ దేవాలయములోనికి వెళ్లెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరు చూచి శృంగారమను దేవా లయపు ద్వారమునొద్ద భిక్షముకొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి, వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. వాడు పేతురును యోహానును పట్టుకొని యుండగా, ప్రజలందరు విస్మయమొంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారియొద్దకు గుంపుగా పరుగెత్తివచ్చిరి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను–ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై యెందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంతశక్తి చేతనైనను భక్తిచేతనైనను నడవను వీనికి బలమిచ్చి నట్టుగా మీరెందుకు మాతట్టు తేరి చూచుచున్నారు?