1 రాజులు 7:1-51
1 రాజులు 7:1-51 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
సొలొమోనుకు తన రాజభవనాన్ని కట్టించుకోడానికి పదమూడేళ్ళు పట్టింది. అతడు కట్టించుకున్న లెబానోను అరణ్య రాజభవనం పొడవు వంద మూరలు, వెడల్పు యాభై మూరలు, ఎత్తు ముప్పై మూరలు, నాలుగు వరుసల దేవదారు స్తంభాల మీద దేవదారు దూలాలను వేయించాడు. స్తంభాల మీది దూలాల పైకప్పును దేవదారుతో చేశారు. ఒక్కో వరుసలో పదిహేను స్తంభాల చొప్పున మూడు వరుసల్లో నలభై అయిదు స్తంభాలు ఉన్నాయి. దాని కిటికీలు మూడు వరుసల్లో ఒకదానికొకటి ఎదురుగా ఉంచారు. అన్ని తలుపుల, కిటికీల గుమ్మాలు దీర్ఘచతురస్రాకారంలో ఉన్నాయి; అవి ముందు భాగంలో మూడు వరుసల్లో ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి. సొలొమోను స్తంభాలతో ఒక మండపాన్ని కట్టించాడు, దాని పొడవు యాభై మూరలు, వెడల్పు ముప్పై మూరలు, దానికి ముందు స్తంభాలతో కట్టిన వసారా ఉంది. అతడు తీర్పు తీర్చడానికి సింహాసన గదిని, న్యాయస్థాన గదిని కట్టించాడు. దానిని అడుగు నుండి పైకప్పు వరకు దేవదారుతో కప్పించాడు. దాని లోపలి ఆవరణంలో అతడు నివసించే రాజభవనాన్ని ఆ విధంగానే కట్టించాడు. సొలొమోను తాను పెళ్ళి చేసుకున్న ఫరో కుమార్తెకు కూడా ఇలాంటి భవనాన్నే కట్టించాడు. ఈ నిర్మాణాలన్ని, బయట నుండి గొప్ప ఆవరణం వరకు, పునాది నుండి పైకప్పు వరకు, లోపల బయట సరియైన కొలతలతో ఇనుప పనిముట్లతో చెక్కిన విలువైన రాళ్లతో చేశారు. పునాదిని నాణ్యమైన పెద్ద రాళ్లతో వేశారు. వాటిలో కొన్ని పది మూరలు, కొన్ని ఎనిమిది మూరల రాళ్లు ఉన్నాయి. పైభాగంలో చెక్కబడిన విలువైన రాళ్లు, దేవదారు దూలాలు ఉన్నాయి. గొప్ప ఆవరణానికి చుట్టూ మూడు వరుసల చెక్కిన రాళ్లు, ఒక వరుస దేవదారు దూలాలు ఉన్నాయి. యెహోవా మందిరపు లోపలి ఆవరణం కట్టినట్లే రాజభవనపు మండపం కూడా కట్టారు. సొలొమోను రాజు తూరు నుండి హూరాము అనే అతన్ని పిలిపించాడు. అతని తల్లి నఫ్తాలి గోత్రానికి చెందిన విధవరాలు, అతని తండ్రి తూరు వాసి, ఇత్తడి పనిలో నైపుణ్యత కలవాడు. హూరాము అన్ని రకాల ఇత్తడి పనులలో జ్ఞానం, సామర్థ్యం, తెలివిగలవాడు. అతడు రాజైన సొలొమోను దగ్గరకు వచ్చి తనకు అప్పగించిన పని అంతా చేశాడు. అతడు రెండు ఇత్తడి స్తంభాలను పోత పోశాడు. ఒక్కొక్క దాని ఎత్తు పద్దెనిమిది మూరలు, చుట్టుకొలత పన్నెండు మూరలు. ఆ స్తంభాల మీద ఉంచడానికి అతడు రెండు ఇత్తడి పీటలను కూడా పోత పోశాడు. ఒక్కొక్క దాని ఎత్తు అయిదు మూరలు. స్తంభాల మీద ఉన్న పీటలకు అల్లిన గొలుసులతో, ప్రతి పీటకు ఏడు అల్లిన గొలుసులను వేశాడు. ఆ స్తంభాలను మీది పీటలను అలంకరించడానికి చుట్టూ రెండు వరుసల దానిమ్మపండ్లు చేశాడు. మండపం స్తంభాల మీది పీటలపై నాలుగు మూరల ఎత్తు తామర పువ్వుల్లా చెక్కారు. ఆ రెండు స్తంభాల మీది పీటల మీద అల్లికపని ఉన్న గిన్నెలాంటి భాగం పైన రెండువందల దానిమ్మపండ్లు వరుసగా చుట్టూరా ఉన్నాయి. అతడు దేవాలయ మంటపంలో ఆ స్తంభాలను నిలబెట్టాడు. దక్షిణాన ఉన్న దానికి యాకీను అని, ఉత్తరాన ఉన్న దానికి బోయజు అని పేరు పెట్టాడు. ఆ స్తంభాల పైభాగాలు తామర పువ్వుల రూపంలో ఉన్నాయి. అలా స్తంభాలు కట్టే పని పూర్తి అయింది. అతడు పోతపోసిన ఒక గుండ్రని నీళ్ల తొట్టె చేయించాడు. అది ఈ అంచు నుండి ఆ అంచు వరకు పది మూరలు, దాని ఎత్తు అయిదు మూరలు. దాని చుట్టుకొలత ముప్పై మూరలు. దాని అంచు క్రింద మూరకు పది చొప్పున చుట్టూ గుండ్రని పండ్లు ఉన్నాయి. నీళ్ల తొట్టెను పోత పోసినప్పుడు ఆ గుండ్రని పండ్లను రెండు వరుసలుగా పోత పోశారు. ఆ నీళ్ల తొట్టె పన్నెండు ఎడ్ల మీద అమర్చబడింది, వాటిలో మూడు ఉత్తరం వైపు, మూడు పశ్చిమ వైపు, మూడు దక్షిణం వైపు, మూడు తూర్పు వైపు ఉన్నాయి. నీళ్ల తొట్టె వాటిపై ఉంచబడింది, వాటి వెనుకటి భాగాలు లోపలి వైపుకు ఉన్నాయి. అది బెత్తెడు మందం కలిగి ఉండి, దాని అంచు పాత్ర అంచులా, తామర పువ్వులా ఉంది. దానిలో రెండువేల బాతుల నీళ్లు పడతాయి. అతడు కదిలే పది ఇత్తడి స్తంభాలను కూడా చేయించాడు; ప్రతి దాని పొడవు నాలుగు మూరలు, వెడల్పు నాలుగు మూరలు, ఎత్తు మూడు మూరలు. ఆ స్తంభాలు ఇలా చేయబడ్డాయి: వాటికి ప్రక్క పలకలు ఉన్నాయి, ఆ పలకలు మధ్య చట్రాలు అమర్చారు. ఆ చట్రాల మధ్య ఉన్న పలకల మీద చట్రాల మీద సింహాలు, ఎడ్లు, కెరూబు ఆకారాలు ఉన్నాయి. సింహాలకు, ఎడ్లకు పైన క్రింద పూదండలు చెక్కారు. ప్రతి స్తంభానికి నాలుగు ఇత్తడి ఇరుసులతో పాటు ఇత్తడి చక్రాలు ఉన్నాయి. ప్రతి దానికి నాలుగు మూలల్లో దిమ్మలు ఉన్నాయి. వాటి ప్రతి వైపున పోతపోసిన పూదండలు ఉన్నాయి. స్తంభం పై భాగంలో దాని మూతి ఉంది. దాని మూతి గుండ్రంగా, ఒక మూర లోతు ఉంది. మూతి గుండ్రంగా ఉండి దాని ఎత్తు ఒక మూరన్నర. ఆ మూతి మీద కూడ చిత్రాలు చెక్కారు. దాని చట్రం గుండ్రంగా గాక, నలుచదరంగా ఉంది. చట్రాల క్రింద నాలుగు చక్రాలు ఉన్నాయి. వాటి ఇరుసులు స్తంభాలతో కలిపారు, చక్రాల అడ్డుకొలత మూరన్నర. ఈ చక్రాలు రథచక్రాల్లా చేశారు; వాటి ఇరుసులు, అంచులు, అడ్డు కర్రలు, చక్రం యొక్క మధ్య భాగాలు, అన్నీ పోత పనితో చేశారు. ప్రతి స్తంభానికి నాలుగు మూలలకు నాలుగు దిమ్మెలు ఉన్నాయి, వాటిని స్తంభాలతో కలిపి పోత పోశారు. స్తంభం పైన చుట్టూ జానెడు ఎత్తుగల గుండ్రని బొద్దు ఉంది. స్తంభం, దానిపై ఉన్న చట్రాలు, పలకలు ఒకటిగా పోత పోయబడ్డాయి. అతడు పలకల మీద, చట్రాల మీద స్థలమున్న ప్రతీ చోట కెరూబు, సింహాలు, ఖర్జూర వృక్షాల ఆకారాలను, వాటి చుట్టూ పూదండలతో పాటు చెక్కించాడు. ఈ విధంగా ఆ పది స్తంభాలు చేయించాడు, అన్నిటికీ ఒకే పోత, ఒకే కొలత, ఒకే ఆకారము. తర్వాత అతడు పది ఇత్తడి తొట్లు చేయించాడు. ప్రతి తొట్టి అడ్డుకొలత నాలుగు మూరలు. ప్రతి తొట్టిలో నలభై బాతులు పట్టేది, ఒక్కొక్క స్తంభం మీద ఒక్కో తొట్టి పెట్టారు. అతడు దేవాలయానికి కుడివైపు అయిదు స్తంభాలను, ఎడమవైపు అయిదు స్తంభాలను పెట్టించాడు. నీళ్ల తొట్టెను దక్షిణం వైపు దేవాలయానికి కుడి ప్రక్క ఆగ్నేయ దిక్కుగా పెట్టించాడు. అతడు కుండలను, చేటలను, చిలకరించడానికి వాడే గిన్నెలను కూడా చేయించాడు. కాబట్టి హూరాము యెహోవా ఆలయానికి రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారం పనంతా చేసి ముగించాడు: రెండు స్తంభాలు, ఆ రెండు స్తంభాల మీద ఉన్న గిన్నెలాంటి రెండు పీటలు, గిన్నెలాంటి పీటలను కప్పడానికి రెండు అల్లికలు, స్తంభాలపై ఉన్న గిన్నెలాంటి పీటలను అలంకరిస్తూ ఒక్కొక్క అల్లికకు రెండేసి వరుసల చొప్పున ఆ రెండు అల్లికలకు నాలుగు వందల దానిమ్మపండ్లు, పది పీటలు వాటిపై ఉన్న పది తొట్లు, నీళ్ల తొట్టె దాని క్రింద ఉన్న పన్నెండు ఎడ్లు, కుండలు, చేటలు, చిలకరించడానికి వాడే గిన్నెలు. హూరాము యెహోవా ఆలయానికి సొలొమోను రాజు చేయమన్న ఈ వస్తువులన్నీ మెరుగుపెట్టిన ఇత్తడితో తయారుచేశాడు. రాజు వీటన్నిటిని యొర్దాను సమతల మైదానంలో, సుక్కోతుకు సారెతానుకు మధ్య ఉన్న బంకమట్టితో పోతపోయించాడు. ఆ ఇత్తడి వస్తువుల సంఖ్య చాలా ఎక్కువ కాబట్టి సొలొమోను వాటిని తూకం వేయించలేదు; ఆ ఇత్తడి బరువు ఎంతో తెలుసుకోడానికి లేదు. యెహోవా మందిరానికి సొలొమోను చేయించిన తక్కిన వస్తువులు: బంగారు బలిపీఠం; సన్నిధి రొట్టెలు పెట్టే బంగారు బల్ల; మేలిమి బంగారు దీపస్తంభాలు (గర్భాలయం ఎదుట కుడి ప్రక్కన అయిదు, ఎడమ ప్రక్కన అయిదు); బంగారు పుష్పాలు దీపాలు పట్టుకారులు; అలాగే మేలిమి బంగారు పళ్లాలు, వత్తులు కత్తిరించే కత్తెరలు, చిలకరించే గిన్నెలు, పాత్రలు, ధూపకలశాలు; అనే అతి పరిశుద్ధ స్థలమైన గర్భాలయ తలుపులకు, మందిర ప్రధాన గది తలుపులకు, బంగారు బందులు చేయించాడు. రాజైన సొలొమోను యెహోవా మందిరానికి చేసిన పని అంతా ముగిసిన తర్వాత, తన తండ్రి దావీదు ప్రతిష్ఠించిన వెండి, బంగారు, వస్తువులను తెప్పించి యెహోవా మందిర ఖజానాలో పెట్టాడు.
1 రాజులు 7:1-51 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సొలొమోను 13 సంవత్సరాల పాటు తన రాజ గృహాన్ని కూడా కట్టించి పూర్తి చేశాడు. అతడు లెబానోను అరణ్య రాజగృహాన్ని కట్టించాడు. దీని పొడవు 100 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. దాన్ని నాలుగు వరసల దేవదారు స్తంభాలతో కట్టారు. ఆ స్తంభాలపై మీద దేవదారు దూలాలు వేశారు. పక్కగదులు 45 స్తంభాలతో కట్టి పైన దేవదారు కలపతో కప్పారు. ఆ స్తంభాలు ఒక్కో వరసకి 15 చొప్పున మూడు వరుసలు ఉన్నాయి. మూడు వరుసల కిటికీలు ఉన్నాయి. మూడు వరుసల్లో కిటికీలు ఒక దానికొకటి ఎదురుగా ఉన్నాయి. తలుపుల, కిటికీల గుమ్మాలు చతురస్రాకారంగా ఉన్నాయి. మూడు వరసల్లో కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి. అతడు స్తంభాలు ఉన్న ఒక మంటపాన్ని కట్టించాడు. దాని పొడవు 50 మూరలు, వెడల్పు 30 మూరలు. వాటి ఎదుట ఒక స్తంభాల ఆధారంగా ఉన్న మంటపం ఉంది. స్తంభాలు, మందమైన దూలాలు వాటి ఎదుట ఉన్నాయి. తరువాత అతడు తాను న్యాయ విచారణ చేయడానికి ఒక అధికార మంటపాన్ని కట్టించాడు. దాన్ని అడుగు నుండి పైకప్పు వరకూ దేవదారు కర్రతో కప్పారు. సొలొమోను లోపలి ఆవరణలో తన రాజప్రాసాదాన్ని ఆ విధంగానే కట్టించాడు. తన భార్య అయిన ఫరో కుమార్తెకు ఇదే నమూనాలో మరొక అంతఃపురం కట్టించాడు. ఈ కట్టడాలన్నీ పునాది నుండి పైకప్పు వరకూ లోపలా బయటా వాటి పరిమాణం ప్రకారం తొలిచి రంపాలతో కోసి చదును చేసిన బహు విలువైన రాళ్లతో నిర్మితమైనాయి. ఈ విధంగానే విశాలమైన ఆవరణం బయటి వైపున కూడా ఉన్నాయి. దాని పునాది పదేసి, ఎనిమిదేసి మూరలు ఉన్న బహు విలువైన, పెద్ద రాళ్లతో కట్టి ఉంది. పై భాగంలో పరిమాణం ప్రకారం చెక్కిన బహు విలువైన రాళ్లు, దేవదారు కర్రలు ఉన్నాయి. ఆవరణానికి చుట్టూ మూడు వరుసల చెక్కిన రాళ్లు, ఒక వరుస దేవదారు దూలాలు ఉన్నాయి. యెహోవా మందిరంలోని ఆవరణం కట్టిన విధంగానే ఆ మందిరం మంటపం కూడా కట్టారు. సొలొమోను రాజు తూరు పట్టణం నుండి హీరామును పిలిపించాడు. ఇతడు నఫ్తాలి గోత్రానికి చెందిన విధవరాలి కొడుకు. ఇతని తండ్రి తూరు పట్టణానికి చెందిన ఇత్తడి పనివాడు. ఈ హీరాము గొప్ప నైపుణ్యం, జ్ఞానం గలవాడు, ఇత్తడితో చేసే పనులన్నిటిలో బాగా ఆరితేరిన వాడు, అనుభవజ్ఞుడు. అతడు సొలొమోను దగ్గరికి వచ్చి అతని పని అంతా చేశాడు. ఎలాగంటే, అతడు రెండు ఇత్తడి స్తంభాలు పోత పోశాడు. ఒక్కొక్క స్తంభం 18 మూరల పొడవు, 12 మూరల చుట్టు కొలత ఉంది. స్తంభాల మీద ఉంచడానికి ఇత్తడితో రెండు పీటలు పోత పోశాడు. ఒక్కొక్క పీట ఎత్తు 5 మూరలు. స్తంభాల మీద ఉన్న పీటలకి అల్లిన గొలుసులతో వలల వంటి వాటిని చేసారు. గొలుసు పని దండలు పోత పోసి ఉంది. అవి ఒక్కో పీటకి ఏడేసి ఉన్నాయి. ఈ విధంగా అతడు స్తంభాలు చేసి వాటి పైని పీటలను కప్పడానికి చుట్టూ అల్లిక పని రెండు వరసలు దానిమ్మ పండ్లతో చేశాడు. రెండు పీటలకీ అతడు అదే విధంగా చేశాడు. స్తంభాల మీది పీటలపై 4 మూరల వరకూ తామర పూవుల్లాంటి ఆకృతులు ఉన్నాయి. ఆ రెండు స్తంభాల మీద ఉన్న పీటలమీది అల్లిక పని దగ్గర ఉన్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లు ఉన్నాయి. రెండు వందల దానిమ్మ పండ్లు ఆ పీట చుట్టూ వరుసలుగా ఉన్నాయి. ఈ స్తంభాలను అతడు పరిశుద్ధ స్థలం మంటపంలో నిలబెట్టాడు. కుడి పక్కన ఉన్న స్తంభానికి “యాకీను” అని పేరు పెట్టాడు. ఎడమ పక్కన ఉన్న స్తంభానికి “బోయజు” అని పేరు పెట్టాడు. ఈ స్తంభాల మీద తామర పూవుల్లాంటి చెక్కడం పని ఉంది. ఈ విధంగా స్తంభాల పని పూర్తి అయ్యింది. హీరాము పోత పనితో ఒక గుండ్రని సరస్సు తొట్టిని చేశాడు. అది ఈ చివరి పై అంచు నుండి ఆ చివరి పై అంచు దాకా 10 మూరలు. దాని ఎత్తు 5 మూరలు, చుట్టుకొలత 30 మూరలు. దాని పై అంచుకు కింద, చుట్టూ గుబ్బలున్నాయి. మూరకు 10 గుబ్బల చొప్పున ఆ గుబ్బలు సరస్సు చుట్టూ ఆవరించి ఉన్నాయి. ఆ సరస్సును పోత పోసినప్పుడు ఆ గుబ్బలను రెండు వరసలుగా పోత పోశారు. ఆ సరస్సు 12 ఎద్దుల ఆకారాల మీద నిలబడి ఉంది. వీటిలో మూడు ఉత్తర దిక్కుకూ మూడు పడమర దిక్కుకూ మూడు దక్షిణ దిక్కుకూ మూడు తూర్పు దిక్కుకూ చూస్తున్నాయి. వీటి మీద ఆ సరస్సు నిలబెట్టి ఉంది. ఎద్దుల వెనక భాగాలన్నీ లోపలి వైపుకు ఉన్నాయి. సరస్సు మందం బెత్తెడు. దాని పై అంచుకు పాత్రకు పై అంచులాగా తామర పూవుల్లాంటి పోత పని ఉంది. అందులో సుమారు 2,000 తొట్టెలు నీరు పడుతుంది. హీరాము 10 ఇత్తడి స్తంభాలు చేశాడు. ఒక్కొక్క స్తంభం 4 మూరల పొడవు, 4 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు ఉన్నాయి. ఈ స్తంభాలు ఏ విధంగా చేశారంటే, వాటికి పార్శ్వాల్లో పలకలు ఉన్నాయి. ఆ పక్క పలకలు చట్రాల మధ్య అమర్చారు. చట్రాల మధ్యలో ఉన్న పక్క పలకల మీదా చట్రాల మీదా సింహాల, ఎద్దుల, కెరూబుల రూపాలు ఉన్నాయి. సింహాల కిందా ఎద్దుల కిందా వేలాడుతున్న పూదండలు ఉన్నాయి. ప్రతి స్తంభానికీ నాలుగేసి ఇత్తడి చక్రాలు, ఇత్తడి ఇరుసులు ఉన్నాయి. ప్రతిపీఠం నాలుగు మూలల్లో దిమ్మలు ఉన్నాయి. ఈ దిమ్మలను తొట్టి కింద అతికిన ప్రతి స్థలం దగ్గరా పోత పోశారు. పీఠం పైన దాని మూతి ఉంది. దాని వెడల్పు మూరెడు. అయితే మూతి కింద స్తంభం గుండ్రంగా ఉండి మూరన్నర వెడల్పు ఉంది. ఆ మూతి మీద పక్కలు గల చెక్కిన పనులు ఉన్నాయి. ఇవి గుండ్రంగా గాక చదరంగా ఉన్నాయి. పక్క పలకల కింద 4 చక్రాలు ఉన్నాయి. చక్రాల ఇరుసులు స్తంభాలతో అతికించి ఉన్నాయి. ఒక్కొక్క చక్రం మూరన్నర వెడల్పు ఉన్నాయి. ఈ చక్రాల పని రథ చక్రాల పనిలాగా ఉంది. వాటి ఇరుసులూ అంచులూ అడ్డకర్రలూ నడిమి భాగాలూ పోత పనితో చేశారు. ప్రతి స్తంభం నాలుగు మూలల్లో నాలుగు దిమ్మలు ఉన్నాయి. ఈ దిమ్మలూ స్తంభమూ కలిపే పోత పోశారు. పీఠం పైన చుట్టూ జానెడు ఎత్తు ఉన్న గుండ్రని బొద్దు ఉంది. పీఠం పైన ఉన్న మోతలూ పక్క పలకలూ దానితో కలిసిపోయి ఉన్నాయి. దాని మోతల పలకల మీదా దాని పక్క పలకల మీదా, హీరాము కెరూబులనూ సింహాలనూ తమాల వృక్షాలనూ ఒక్కొక్కదాని చోటును బట్టి చుట్టూ దండలతో వాటిని చెక్కాడు. ఈ విధంగా అతడు పదింటిని చేశాడు. అన్నిటి పోత, పరిమాణం, రూపం ఒకేలా ఉన్నాయి. తరువాత అతడు 10 ఇత్తడి తొట్టెలు చేశాడు. ప్రతి తొట్టి 880 లీటర్లు నీరు పడుతుంది. ఒక్కొక్క తొట్టి వైశాల్యం 4 మూరలు. ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క తొట్టి ఉంచాడు. మందిరం కుడి పక్కన 5 స్తంభాలు, ఎడమ పక్కన 5 స్థంభాలు ఉంచాడు. సరస్సు దేవాలయానికి కుడి వైపు ఆగ్నేయ దిశగా మందిరం కుడి పక్కన ఉంచాడు. హీరాము తొట్లనూ చేటలనూ గిన్నెలనూ చేశాడు. ఈ విధంగా హీరాము సొలొమోను రాజు ఆజ్ఞ ప్రకారం యెహోవా మందిరం పని అంతా పూర్తి చేశాడు. రెండు స్తంభాలు, ఆ రెండు స్తంభాల మీద ఉన్న పైపీటల పళ్ళేలు, వాటిని కప్పిన రెండు అల్లికలు ఉన్నాయి. ఆ స్తంభాల మీద ఉన్న పై పీటల రెండు పళ్ళాలను, కప్పిన అల్లిక ఒకదానికి రెండు వరసలతో రెండు అల్లికలకు 400 దానిమ్మపండ్లనూ 10 స్తంభాలనూ స్తంభాల మీద 10 తొట్లనూ ఒక సరస్సును, సరస్సు కింద 12 ఎద్దులూ, బిందెలూ, చేటలూ, గిన్నెలూ వీటినన్నిటినీ సొలొమోను రాజు ఆజ్ఞ ప్రకారం హీరాము యెహోవా మందిరానికి చేశాడు. ఈ వస్తువులన్నీ మెరుగు పెట్టిన ఇత్తడితో చేసారు. యొర్దాను మైదానంలో సుక్కోతు, సారెతానుల మధ్య ఉన్న బంక మట్టి నేలలో రాజు వాటిని పోత పోయించాడు. అయితే ఈ వస్తువులు చాలా ఎక్కువగా ఉండడం వలన సొలొమోను వాటి బరువు తూయడం మానేశాడు. ఇత్తడి బరువు ఎంతో తెలుసుకోడానికి వీల్లేకుండా పోయింది. సొలొమోను యెహోవా మందిరానికి చెందిన ఇతర సామగ్రిని కూడా చేయించాడు. అవేవంటే, బంగారు బలిపీఠం, సముఖపు రొట్టెలను ఉంచే బంగారు బల్లలు, గర్భాలయం ఎదుట కుడి పక్కన 5, ఎడమ పక్కన 5, మొత్తం పది బంగారు దీపస్తంభాలు, బంగారు పుష్పాలు, ప్రమిదెలు, పట్టుకారులు. అలాగే మేలిమి బంగారు పాత్రలు, కత్తెరలు, గిన్నెలు, ధూపకలశాలు, లోపలి మందిరం అనే అతి పరిశుద్ధ స్థలం తలుపులు, ఆలయం హాలు తలుపులు, వాటి బంగారు బందులు, వీటన్నిటినీ చేయించాడు. ఈ విధంగా సొలొమోను రాజు యెహోవా మందిరానికి చేసిన పని అంతా పూర్తి అయ్యింది. సొలొమోను తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారాన్ని, సామగ్రిని తెప్పించి యెహోవా మందిరం ఖజానాలో ఉంచాడు.
1 రాజులు 7:1-51 పవిత్ర బైబిల్ (TERV)
రాజైన సొలొమోను తనకై ఒక రాజభవనం కట్టించాడు. సొలొమోను రాజభవన నిర్మాణానికి పదమూడు సంవత్సరాలు పట్టింది. అతడింకా “లెబానోను అరణ్యపు విశ్రాంతి గృహాన్ని” కూడ ఒకటి కట్టించాడు. అది నూట ఏభై అడుగుల పొడవు, డెబ్బది ఐదు అడుగుల వెడల్పు, మరియు నలభై ఐదు అడుగుల ఎత్తు కలిగివుంది. దానికి నాలుగు వరుసల దేవదారు స్తంభాలు వున్నాయి. వాటి పైన నగిషీ పని చేసిన దేవదారు స్తంభ శీర్షాలు నిలుపబడ్డాయి. స్తంభముల మీద పైకప్పుగా దేవదారు పలకలు పర్చబడ్డాయి. కప్పు భాగానికి నలభై ఐదు దూలాలను పరిచారు. నాలుగు స్తంభాల వరుసల మధ్యనున్న మూడు భాగాలకు ఒక్కొక్క దానికి పదిహేను కొయ్య కడ్డీలు చొప్పున అమర్చబడ్డాయి. ఈ వరుసల మధ్య కిటికీలున్నాయి. అవి ఒకదానికొకటి ఎదురెదురుగా నిర్మింపబడ్డాయి. తలుపులన్నీ చదరంగా వున్నాయి. ప్రతి వరుస చివరనున్న తలుపులు ఒకదానికొకటి ఎదురెదురుగా వున్నాయి. సొలొమోను “స్తంభాలతో ఒక మండపం” నిర్మించాడు. దాని పొడవు డెభ్బై అడుగులు; వెడల్పు నలభై అడుగులు, స్తంభాల నాధారంగా చేసుకొని మండపానికి ముందు ఒక వసారా వుంది. సొలొమోను తమ న్యాయ విచారణ జరుపుటకు సింహాసనమున్న ఒక గదిని కట్టించాడు. దానికి “న్యాయసభాస్థలి” అని పేరు పెట్టాడు. ఆ గదంతా కింది నేలనుండి పైకప్పు దూలాల వరకు దేవదారు చెక్కలతో కప్పబడింది. సొలొమోను నివసించే ఇల్లు ఈ న్యాయ సభాస్థలానికి బాగా వెనుక భాగంలో వుంది. అదే రకమైన మరియొక ఇంటిని తన భార్యకై నిర్మింపజేశాడు. తన భార్య ఈజిప్టు రాజు కుమారై. ఈ భవనాలన్నీ చాలా ఖరీదైన రాళ్లతో కట్టబడ్డాయి. ఈ రాళ్లన్నీ కావలసిన పరిమాణంలో చెక్కబడి, ప్రత్యేక రంపాలతో కోయబడ్డాయి. ఈ రాళ్లు ముందు వెనుక కోయబడ్డాయి. ఈ ఖరీదైన రాళ్లు పునాదుల నుండి పైవరుస వరకు వేయబడ్డాయి. ఆవరణ గోడలకు, ఆవరణలోను రాళ్లు వాడబడ్డాయి. పునాదులకు ఖరీదైన పెద్ద బండలు వేయబడ్డాయి. కొన్ని బండలు పదిహేను అడుగుల పొడవు గలవి; మరికొన్ని పన్నెండు అడుగుల పొడవుగలవై వున్నాయి. ఈ బండల మీద ఇతర ఖరీదైన రాళ్లు, దేవదారు కట్టెలు వేశారు. భవనపు ఆవరణ, దేవాలయపు ఆవరణ, దేవాలయ సింహద్వారపు గోడలు మూడు వరుసల చెక్కిన రాళ్లతో నిర్మింపబడి వాటి మీద దేవదారు దూలాలు వేయబడ్డాయి. రాజైన సొలొమోను తూరు పట్టణం నుండి హీరాము అను వానిని తన వద్దకు పిలిపించాడు. హీరాము తల్లి నఫ్తాలి వంశానికి చెందిన స్త్రీ. మరణించిన తన తండ్రి తూరు పట్టణపువాడు. హీరాము కంచు పనిలో బహు నేర్పరి. మంచి అనుభవజ్ఞుడు. రాజైన సొలొమోను అతనిని పిలవగా హీరాము అంగీకరించి వచ్చాడు. రాజైన సొలొమోను కంచు పనులన్నిటికీ అతనిని అధిపతిగా చేశాడు. కంచుతో చేసే పనులన్నీ హీరాము నిర్వహించాడు. హీరాము రెండు కంచు స్తంభాలు పోత పోశాడు. ఒక్కొక్కటి ఇరువై ఏడు అడుగుల పొడవు, పద్దెనిమిది అడుగుల చుట్టు కొలత (ఉరవు) కలిగి వున్నాయి. అయితే ఈ స్తంభాల లోపలి భాగం బోలుగా వుంది. స్తంభపు అంచు మందం నాలుగు అంగుళాలు. అతడు రెండు స్తంభ శీర్షాలు కూడా తయారు చేశాడు. అవి ఒక్కొక్కటి ఏడున్నర అడుగుల పొడవున వున్నాయి. ఈ స్తంభశీర్షాలను హీరాము తాను పోతపోసిన స్తంభాలపై నిలిపాడు. పిమ్మట గొలుసులతో వలలవంటి అల్లిక తయారు చేసి స్తంభాల మీద నున్న శీర్షాలను కప్పేలా పైనవేశాడు. దానిమ్మకాయల ఆకారంలో వేలాడే బంతులు గల రెండు కంచు గొలుసులను అతడు తయారు చేశాడు. ఈ కంచు దానిమ్మ కాయల వరుసలను స్తంభశీర్షాల మీదనున్న లోహపు వలలమీద చుట్టాడు. ఈ స్తంభశీర్షాలు ఏడున్నర అడుగుల పొడవున వికసించిన పద్మాకారంలో మలచబడ్డాయి. ఈ స్తంభశీర్షాలు కంచు స్తంభాలమీద పెట్టబడ్డాయి. పాత్ర ఆకారంలో ఉన్న వలలపైన అవి పెట్టబడ్డాయి. ఆ ప్రదేశంలో స్తంభశీర్షం చుట్టూ ఇరవై దానిమ్మ కాయలు గల గొలుసు చుట్టబడింది. ఈ రెండు కంచు స్తంభాలను హీరాము దేవాలయపు మండపం వద్ద నిలబెట్టాడు. ఒక స్తంభం దక్షిణ వైపున, మరొక స్తంభం ఉత్తరవైపున నిలుపబడ్డాయి. దక్షిణ స్తంభానికి యాకీను అని, ఉత్తర స్తంభానికి బోయజు అని పేర్లు పెట్టారు. పుష్పాకారంలో వున్న పీటలు కంచుస్తంభాలపై ఉంచబడ్డాయి. ఆ విధంగా స్తంభ నిర్మాణం పని పూర్తయింది. పిమ్మట హీరాము కంచుతో ఒక గుండ్రని కోనేరు తయారు చేశాడు. (దానిని వారు “సముద్రం” అని పిలిచారు) ఆ సముద్రం సుమారు నలభై ఐదు అడుగుల చుట్టు కొలత కలిగివుంది. ఒక అంచునుండి మరొక అంచు వరకు సముద్రం అడ్డుగా పదిహేను అడుగులు వుంది. దాని లోతు ఏడున్నర అడుగులు. దాని చుట్టు బయటి అంచున ఒక కమ్మి ఉన్నది. ఈ కమ్మి కింద రెండు వరుసల కంచు సొరతీగె పొందుపర్చబడింది. అనగా ఈ కంచు సొరతీగ ఒక్క ముక్కగానే చెరువుతో పాటు ఒకే సారి మలచబడింది. ఈ కోనేటిని పన్నెండు కంచు గిత్తల వీపులపై నిలిపారు. ఈ పన్నెండు గిత్తలు చెరువునుండి బయటికి చూస్తున్నాయి. మూడు ఉత్తరానికి, మూడు తూర్పుకు, మూడు దక్షిణానికి, మరి మూడు పడమరకు చూస్తున్నాయి. కంచు చెరువు అంచుమందం నాలుగు అంగుళాలు. చెరువు అంచు గిన్నె అంచులా, విచ్చిన పూరేకులా వున్నది. ఆ చెరువులో సుమారు తొమ్మిది గరిసెల నీరు పడుతుంది. హీరాము తరువాత పది కంచు తోపుడు బండ్ల వంటివి తయారుచేశాడు. ఒక్కొక్క దాని పొడవు ఆరు అడుగులు (నాలుగు మూరలు), వెడల్పు ఆరు అడుగులు, మరియు ఎత్తు నాలుగున్నర అడుగులు (మూడు మూరలు), వీటి పక్కలు నాలుగు మూలలుగా వున్న కంచు పలకలతో మూయబడ్డాయి. ఆ నాలుగు మూలలుగా వున్న పలకలు చట్రాలతో బిగించబడ్డాయి. ఆ పలకల మీద సింహాలు, గిత్త దూడలు, కెరూబులు చిత్రీకరించబడ్డాయి. ఆ సింహాల, గిత్తల బొమ్మలపై వరుస, కింది వరుసలలో పువ్వుల అలంకరణ కంచులోకి దట్టించి ముద్రించబడింది. ప్రతి బండికి నాలుగు కంచు చక్రాలున్నాయి. చక్రాలకు ఇరుసులున్నాయి. మూలల మీద పెద్ద గిన్నెలు నిలపటానికి కంచు ముక్కల ఆధారం వుంది. ఆ కంచు ఆధారాల మీద పూలు చెక్కబడ్డాయి. ఆ గిన్నెలకు పైన అంచు చుట్టూ చట్రముంది. గిన్నెకు పదునెనిమిది అంగుళాల ఎత్తున అదివుంది. గిన్నె మూతి గుండ్రంగా వున్నది. గిన్నెలోతు ఇరువది ఏడు అంగుళాలు. చట్రం మీద కూడ అలంకరణ చెక్కబడి వున్నది. ఈ చట్రం గుండ్రంగా గాక నాలుగు పలకలుగా వుంది. అడుగు చట్రం కింద నాలుగు చక్రాలున్నాయి. చక్రాలు ఇరవై ఏడు అంగుళాల ఎత్తు వున్నాయి. చక్రాల ఇరుసులు బండితో ఒకే రీతిగా చేయబడ్డాయి. వీటి చక్రాలు రథ చక్రాలను పోలి వున్నాయి. చక్రాలలో ప్రతిదీ వాటి మధ్య కడ్డీలు, అంచులు, చువ్వలు, చక్రపు నడిమి భాగం కంచుతో చేయబడింది. ప్రతి బండికీ నాలుగు మూలలా నాలుగు ఆధారాలున్నాయి. అవన్నీ బండితో పాటు ఒకే రీతిగా చేయబడినవే. ప్రతి బండి చుట్టూ పైభాగాన ఒక బొద్దు వంటి చట్రముంది. అది బండితో కలిసి ఏకంగా చేయబడింది. బండి పక్కన గల కంచు పలకలపై కెరూబుల, సింహాల, తమాల వృక్షాల చిత్రాలు మలచబడ్డాయి. ఎక్కడెక్కడ అవకాశం వున్నదో అక్కడ చిత్రాలు, అలంకరణలు చెక్కబడ్డాయి. చుట్టూ అనేక పుష్పాలు చెక్కబడ్డాయి. ఆ రకంగా హీరాము పది బండ్లను తయారు చేశాడు. ప్రతీదీ కరిగించిన కంచును మూసలో పోత పోశాడు. కావున అన్ని బండ్లు ఒకే పరిమాణంలో, ఒకే ఆకారంలో ఉన్నాయి. హీరాము పిమ్మట పది పెద్ద తొట్లను తయారు చేశాడు. ముందు నిర్మించిన పది బండ్ల మీదికి పది తొట్లను నిర్మించాడు. ప్రతి తొట్టి ఈ అంచు నుండి ఆ అంచు వరకు అడ్డంగా ఆరడుగులు వుంది. ప్రతి తొట్టిలోను ఏడువందల ఇరువది తూముల నీరు పట్టేది. హీరాము ఐదు బండ్లను దేవాలయానికి దక్షిణాన, మిగిలిన ఐదింటిని ఉత్తర భాగాన ఉంచాడు. పెద్ద కోనేటిని దేవాలయానికి ఆగ్నేయ భాగాన నెలకొల్పాడు. హీరాము ఇంకా కొన్ని కుండలను, చిన్నపాటి గరిటెలను, గిన్నెలను తయారు చేశాడు. రాజైన సొలొమోను హీరామును చేయుమని చెప్పిన వన్నీ అతడు పూర్తిచేశాడు. యెహోవా దేవాలయానికై హీరాము చేసిన వస్తువులు ఇవి: రెండు స్తంభాలు; ఆ రెండు స్తంభాల మీద నున్న స్తంభశీర్షాలకు ఏర్పాటు చేసిన గిన్నెలాంటి పాత్రలు; స్తంభాల మీది రెండు శీర్షాల కొరకు ఉంచబడిన రెండు గిన్నెలను కప్పటానికి రెండు అల్లికలు; ఆ అల్లికలకు నాలుగు వందల దానిమ్మకాయల బొమ్మలు; రెండు స్తంభాల మీది శీర్షాలకు అమర్చిన గిన్నెలపై గల అల్లికల మీద దానిమ్మకాయల గొలుసును రెండు వరుసల చొప్పున చుట్టారు. పది బండ్లు; వాటిపైన తొట్టెలు; పన్నెండు గిత్తలపై నిల్పిన ఒక పెద్ద కోనేరు; కుండలు, చిన్న పాటి గరిటెలు, గిన్నెలు, యెహోవా దేవాలయానికి కావలసిన తదితర పాత్రలు; మరియు రాజు ఇంటికి నలభై ఎనిమిది స్తంభాలు; రాజైన సొలొమోను కోరినవన్నీ హీరాము తయారు చేసి పెట్టాడు. అవన్నీ మెరుగు దిద్దిన కంచుతో చేయబడ్డాయి. సొలొమోను ఈ వస్తు సామగ్రిని చేయటానికి పట్టిన కంచును తూకం వేయలేదు. అది తూచటానికి అలివికానంత ఉంది. అందువల్ల వారు ఎంత కంచు వాడినది తెలియదు. ఈ కంచు సామగ్రి అంతా రాజు ఆజ్ఞ ప్రకారం యొర్దాను నది దగ్గర సుక్కోతుకు, సారెతానుకు మధ్య చేయబడ్డాయి. ఈ వస్తు సామగ్రినంతా కంచు కరగించి బంక మట్టితో చేసిన మూసలలో పోసి వారు తయారుచేశారు. దేవాలయం కొరకు అనేక వస్తువులు బంగారంతో చేయటానికి కూడ సొలొమోను ఆజ్ఞ ఇచ్చాడు. బంగారంతో దేవాలయానికి సొలొమోను చేయించిన వస్తువులు ఈ విధంగా వున్నాయి: బంగారు బలిపీఠం; బంగారపు బల్ల (దేవునికి అర్పించు సముఖపు రొట్టెలు ఉంచడానికి). పది దీప స్తంభాలు: (అతి పరిశుద్ధ స్థలము ముందు కుడిపక్కన ఐదు, ఎడమపక్కన ఐదు ఇవి ఉంచబడ్డాయి) బంగారు పుష్పాలు, ప్రమిదెలు, పటకారులు; గిన్నెలు; దీపాలను కాంతి కొరకై ఎగదోసే పనిముట్లు; పాత్రలు; పెనాలు; ధూపం వేయటానికి బొగ్గులు వేసే బంగారు ధూపకలశం; దేవాలయం సింహద్వారపు తలుపులు. ఆ రకంగా రాజైన సొలొమోను కోరుకున్న ప్రకారం యెహోవా దేవాలయంయొక్క పని పూర్తి అయింది. అప్పడు రాజైన సొలొమోను తన తండ్రి దావీదు దేవునికి అంకితం చేసిన వస్తువులన్నీ దేవాలయానికి తెచ్చాడు. దేవాలయపు ధనాగారంలో ఆ వెండి బంగారాలు భద్రపరిచాడు.